ప్రేమకు ఓకే.. పెళ్లికి నో.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని..!

author img

By

Published : May 21, 2022, 8:05 PM IST

Crime News

Crime News: ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసినందుకు.. ఆమె కుటుంబ సభ్యులు యువకుడిని గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. అదే రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో.. ప్రేమికులు గుడిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Boy Killed By Lover Family: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసినందుకు.. ఆ యువకుడిని కుటుంబ సభ్యులతో కలిసి హతమార్చింది ప్రియురాలు. ఆ తర్వాత బాధితుడి మృతదేహన్ని ఊరి చివర బావిలో పడేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు.

ఇదీ జరిగింది.. బదాయూ జిల్లాకు చెందిన దినేశ్​, కుమారి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దినేశ్​ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే కుమారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఆ విషయం తెలుసుకున్న దినేశ్​.. ఆమెపై ఒత్తిడి చేశాడు. అందుకు కోపం తెచ్చుకున్న యువతి అతడిని చంపాలని నిర్ణయించుకుంది. మామయ్య రాజారామ్​తో కలిసి అతడిని హత్య చేసేందుకు ప్లాన్​ గీసింది. చివరకు మే10న దినేశ్​ను తమ గ్రామానికి పిలిపించి హత్య చేసి ఊరి చివర బావిలో పడేశారు. బాధితుడు కనిపించకపోవడం వల్ల అతడి కుటుంబ సభ్యులు మే 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారి, ఆమె మామయ్య రాజారామ్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు నేరం అంగీకరించారని ఎస్పీ సిద్ధార్థ్ వర్మ తెలిపారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు బంధువులను త్వరలో అరెస్ట్​ చేస్తామని చెప్పారు.

గుడిలో ప్రేమికుల ఆత్మహత్య.. ఉత్తర్​ప్రదేశ్​లోనే మరో విషాద ఘటన జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు మైనర్​లు ఓ గుడిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బదాయూ జిల్లాలోని ఉసావాన్​ పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బదాయూ జిల్లాలోని మాన్సా నాగ్లా గ్రామ ఆలయంలో శనివారం ఉదయం ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించటం కలకలం సృష్టించింది. ఉదయం ఆలయానికి వచ్చిన బాలిక తల్లి.. మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్​​ బృందం కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. అయితే అదే ప్రాంతంలో పురుగుల మందు డబ్బా, బీర్​ బాటిల్​, గ్లాసులు కూడా ఉన్నాయి. అయితే తొలుత పురుగుల మందు కలిపిన బీర్​ తాగి.. ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి వయస్సు 17 ఏళ్లు కాగా, బాలిక వయస్సు 16 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని.. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మేనకోడలికి విషం తాగించి చంపిన మామ.. మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. వేరే యువకుడిని ప్రేమిస్తున్నందుకు మేనకోడలిని బలవంతంగా విషం తాగించి హత్య చేశారు ఆమె మామ, బావ. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలోని రతన్‌పురియా గ్రామంలో మే18న 17 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. డాగ్​ స్క్వాడ్​, ఫోరెన్సిక్​ బృందం ఘటనాస్థలాన్ని తనిఖీ చేశాయి. వాటి నివేదికలను పరిశీలించిన తర్వాత, పోలీసులు.. బాధితురాలి మామ, అతడి కొడుకుపై అనుమానం వ్యక్తం చేసి అదుపులోకి తీసుకుని విచారించారు. తమ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి విషం తాగించి బాలికను చంపినట్లు ఇద్దరు అంగీకరించారు.

మైనర్​పై అత్యాచారం.. రాజస్థాన్​లో 14 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగౌర్​ జిల్లాలో చితావా పోలీసు స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామానికి బాధితురాలు.. తన బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే నిందితులు ఆమెను బెదిరించి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు బాధితురాలి బంధువు కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఇవీ చదవండి: మూడు ట్రక్కులు- కారు ఢీ.. ఎగసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం

నోటితో బాటిల్​ మూత ఓపెన్​.. బాలుడు మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.