పిల్లలు పుట్టడం లేదని మహిళపై క్షుద్ర పూజలు.. శ్మశానంలో కూర్చోబెట్టి, అస్థికలు తినిపించిన భర్త

author img

By

Published : Jan 20, 2023, 4:46 PM IST

maharasthra -woman-forced-to-consume-human-ashes-in-witchcraft-ritual-8-booked

మహిళతో అస్థికలు తినిపించారు భర్త, అత్తమామలు. పిల్లలు పుట్టడం లేదని ఆమెపై అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారు. మహిళను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ బాధలు భరించలేని మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్రలో ఈ దారుణ ఘటన జరిగింది

పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళతో అస్థికలు తినిపించారు కుటుంబ సభ్యులు. గర్భం దాల్చవచ్చని ఆమెపై అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారు. అజ్ఞానంతో మహిళను నానా ఇబ్బందులకు గురిచేశారు. ఆ బాధలు తట్టుకోలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె, ధైరీ ప్రాంతంలోని సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ గత మూడేళ్లుగా గృహహింసను ఎదుర్కొంటోంది. భర్త, అత్తమామలు ఆమెను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పెళ్లై ఇన్నాళ్లైన ఇంకా సంతానం కలగలేదని ఆమెపై పలుమార్లు దాడికి తెగబడ్డారు.

"బాధితురాలికి పిల్లలు లేరని.. కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారు. ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారు. మహిళ చేత అస్థికలు తినిపించారు. కొద్ది రోజుల క్రితం ఇలాగే బాధితురాలిపై పూజలు చేశారు. అప్పుడు కోళ్లను, మేకలను బలిచ్చారు. బాధితురాలిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు." అని పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు 8 మందిపై పలు సెక్షన్​ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను.. బాధితురాలి భర్త జయేష్ పోక్లే, ఆమె మరిది శ్రేయాస్ పోక్లే, మరదలు ఇషా పోక్లే, ఆమె అత్తమామలు ప్రభావతి పోక్లే, కృష్ణ పోక్లేగా గుర్తించినట్లు తెలిపారు. దీపక్ జాదవ్, బాటా జాదవ్ అనే మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. వీరంతా పుణెకు చెందినవారేనని పోలీసులు పేర్కొన్నారు. వీరిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.

ఘటనపై మహారాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్​ రూపాలీ చకంకర్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు సూచించారు. "పుణె లాంటి నగరంలో ఇలాంటి ఘటన జరగడం దారుణం. మహిళపై ఈ చర్య అమానవీయం. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి." అని చకంకర్ ట్వీట్ చేశారు. ఘటనపై దర్యాప్తు జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆమె పోలీసులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.