నేటితో వివేకా​ 'గొడ్డలిపోటు'కు నాలుగేళ్లు.. పులివెందుల్లో వర్ధంతి

author img

By

Published : Mar 15, 2023, 8:24 AM IST

Updated : Mar 15, 2023, 11:28 AM IST

YS Vivekananda Reddy

YS Vivekananda Reddy: వైఎస్​ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై నేటికి నాలుగేళ్లు గడిచింది. ఈ రక్తచరిత్రలో పాత్రధారులు చిక్కినా.. సూత్రధారులు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, అనుమానితులు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కోర్టు మెట్లెక్కడంతో.. కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వివేకా హత్య కేసులో మూడు సిట్‌లు చేసిన దర్యాప్తు, ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతున్న తీరు సహా.. నాలుగేళ్ల పరిణామాలపై ప్రత్యేక కథనం.

YS Vivekananda Reddy: 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్​ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఉదయం 6 గంటల 15నిమిషాలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ద్వారా హత్య జరిగిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఉదయం 6 గంటల 29 నిమిషాలకు కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి, వైఎస్​ భాస్కర్‌రెడ్డి, వైఎస్​ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. అందుకే మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండేజ్ చుట్టి, ఇంట్లోని రక్తపు మరకలు తుడిచేశారని.. ఈ వ్యవహారంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి.

సునీత పిటిషన్‌... వివేకా హత్య జరిగిన రోజే అదనపు డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. పలువురు అనుమానితులు, సాక్షులను సిట్ విచారించింది. ఆ తర్వాత ఎస్పీ అభిషేక్ మహంతి నేతృత్వంలో రెండో సిట్, ప్రస్తుత ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యాన మూడో సిట్ కూడా విచారణ జరిపాయి. మొత్తంగా 100 మంది సాక్షులు, 1461 మంది అనుమానితులను విచారించినా.. హంతకులు ఎవరనేది మాత్రం దర్యాప్తు బృందాలు తేల్చలేకపోయాయి. హత్యకేసుపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో పిటిషన్‌ వేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఉపసంహరించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వివేకా కుమార్తె సునీత.. సీబీఐ విచారణ చేయించాలంటూ 2019 నవంబరులో హైకోర్టును ఆశ్రయించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి కూడా పిటిషన్లు వేశారు. సునీత పిటిషన్‌ను మాత్రం స్వీకరించిన హైకోర్టు.. 2020 మార్చి 11న వివేకా కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.

అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. కోర్టు ఆదేశాలతో 2020 జులై 9న రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. జులై 18న కడపలో విచారణ ప్రారంభించారు. కడప, పులివెందులలో పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించారు. ఇప్పటివరకు 248 మంది విచారణ చేశారు. వివేకా ఇంటి వద్ద రెండుమూడు పర్యాయాలు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. 2021 జులై 23న జమ్మలమడుగు కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్ రంగన్న.. వివేకా హత్య జరిగిన రోజు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి వచ్చారని పేర్కొన్నాడు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్లు తెలిపాడు. ఆ తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాల తర్వాత ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.

వివేకా హత్యకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్‌ చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మన వెనుక ఉన్నారని భరోసా ఇచ్చారని.. అడ్వాన్స్ కింద ఒక్కో నిందితుడికి కోటి రూపాయలు అందజేశారని వెల్లడించాడు. ఈమేరకు 2021 అక్టోబర్‌ 26న పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలుచేసిన సీబీఐ.. ఎర్ర గంగిరెడ్డి A-1గా, సునీల్ యాదవ్ A-2, ఉమాశంకర్‌రెడ్డి A-3, దస్తగిరిని A-4గా చేర్చింది. దస్తగిరి వాంగ్మూలంలోని అంశాల ఆధారంగా నవంబరు 17న A-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.

తెలంగాణకు బదిలీ.. వివేకా హత్య కేసు తనపై వేసుకుంటే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి.. ఆ తర్వాత మాట మార్చేశాడు. సీబీఐ అధికారికి వ్యతిరేకంగా కోర్టులో ప్రైవేటు కేసు కూడా వేశాడు. అంతలోనే 2022 జూన్ 9న అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పదంగా చనిపోయాడు. అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న క్రమంలోనే.. కడప మొబైల్ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అధికారి రాంసింగ్‌పై కేసు నమోదు చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ తెలంగాణకు బదిలీ కావడం, ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.

గూగుల్ టేకవుట్ ద్వారా.. హత్య వెనుక అవినాష్‌రెడ్డి హస్తం ఉందని అనుమానిస్తున్న వివేకా కుమార్తె సునీత.. ఈమేరకు తెలంగాణ హైకోర్టులో అఫడవిట్‌ వేశారు. సీబీఐ కూడా కోర్టుకు అందించిన వివరాల్లో అవినాష్‌రెడ్డి పేరు ప్రస్తావించింది. సాక్షుల వాంగ్మూలాలు, హత్య జరిగిన రోజు, అంతకుముందు నిందితుల్లో కొందరు అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని.. గూగుల్ టేకవుట్ ద్వారా ఈ విషయం తెలిసిందని సీబీఐ నివేదించింది. ఈ కేసులో ఇప్పటివరకు పలు దఫాలుగా అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది. అవసరమైతే ఆయన్ను అదుపులోకి తీసుకుంటామని కూడా తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలన్న అవినాష్‌రెడ్డి వినతిపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిస్థితుల్లో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. కోర్టులో వేసిన పిటిషన్‌లోనూ, ఆ తర్వాత నేరుగానూ వివేకా కుటుంబసభ్యులపై అవినాష్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వివేకానందరెడ్డికి రెండో పెళ్లి జరిందని, ఆ అంశంపై కుటుంబంలో వివాదాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆస్తుల కోసం హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు.

చేరుకున్న కుటంబ సభ్యులు.. ఈ విచారణల ఉత్కంఠ మధ్యే ఇవాళ పులివెందులలో వివేకానందరెడ్డి నాలుగో వర్ధంతి జరగనుంది. ఇందుకోసం వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికే పులివెందుల చేరుకున్నారు. వైఎస్​ భారతి, విజయమ్మ కూడా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది.

నేటితో వివేకా​ 'గొడ్డలిపోటు'కు నాలుగేళ్లు.. పులివెందుల్లో వర్ధంతి

ఇవీ చదవండి:

Last Updated :Mar 15, 2023, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.