GO 1 in AP: ఏపీలో చీకటి జీవోకు చరమగీతం..!

author img

By

Published : May 13, 2023, 1:38 PM IST

GO 1 in AP

GO 1 in AP: బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 పట్టాభిషేకం సందర్భంగా.. ఆ దేశంలో రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ కొందరు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై విచారం వ్యక్తం చేస్తూ పోలీసులు తర్వాత ప్రకటన విడుదల చేశారు. నిరసన తెలపటం ప్రజల హక్కు అయినందున పోలీసులు విచారం ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు లాంటి బ్రిటన్‌లో అలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిరసన తెలపటమే మహానేరంగా వైసీపీ ప్రభుత్వం పరిగణిస్తోంది. ప్రతిపక్షాల అణచివేతకే అప్రజాస్వామిక జీవో-1ను తెచ్చింది.

ఏపీలో చీకటి జీవోకు చరమగీతం..!

GO 1 in AP: ప్రతిపక్ష పార్టీలను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకోవటమే లక్ష్యంగా జీవో-1 తీసుకొచ్చి, దాన్ని మూర్ఖంగా అమలుచేసిన వైసీపీ ప్రభుత్వానికి.. హైకోర్టు తీర్పు చెంపపెట్టు. ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసే ఈ చీకటి జీవోను అన్ని వర్గాలూ ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. జగన్‌ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. జీవోలోని నిబంధనలు వైసీపీకూ వర్తిస్తాయంటూ సుద్దులు చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ప్రతిపక్షాల్ని అణచివేయడానికి దీన్ని ఓ ఆయుధంలా ప్రయోగించారు.

ప్రతిపక్ష నాయకులను అడుగు తీసి అడుగు వేయనివ్వలేదు. పర్యటించిన ప్రతిచోటా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేశారు. కనీసం హ్యాండ్‌ మైక్‌లోనూ మాట్లాడనీయకుండా అడ్డుకున్నారు. స్టూలుపై నిలబడి మాట్లాడితే.. దాన్నీ స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున పొలీసు బలగాల్ని మోహరించి యుద్ధ వాతావరణం సృష్టించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష పార్టీల వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు.

బహుశా ఏ రాష్ట్రంలోని లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు రహదారులపైనే సభలు, సమావేశాలు పెట్టినా పోలీసులు కళ్లు మూసుకున్నారు. బాణసంచా మోత, డీజే సౌండ్లతో వైసీపీ నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తే పల్లెత్తు మాట అనలేదు. హైకోర్టు తాజా తీర్పుతో ఈ అప్రజాస్వామిక ధోరణులకు చెల్లుచీటీ పడినట్లయ్యింది.

వైసీపీ అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై అణచివేత మొదలుపెట్టింది. సున్నితమైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదంటూ ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, నోటీసుల పేరిట ఆంక్షలు అమలు చేశారు. కొవిడ్‌ నిబంధనల పేరిట అనుమతులు నిరాకరించారు. కొవిడ్‌ ఆంక్షలు ముగిశాకా ఇదే పరిస్థితి. అధికారపార్టీ కార్యక్రమాలకు మాత్రం ఏ ఆంక్షలు లేవు. అలా మొదలైన వైసీపీ ప్రభుత్వ అణచివేత జీవో-1 జారీతో పరాకాష్ఠకు చేరింది.

ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేలా ఉన్న ఈ చీకటి జీవోను రద్దుచేయాలంటూ రాష్ట్రంలో పెద్ద పోరాటమే నడిచింది. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఇలా అన్ని వర్గాలు ఒక్కతాటి పైకి వచ్చి పోరాడాయి. చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాయి. ‘‘బ్రిటిష్‌ ప్రభుత్వం ఇలాంటి జీవో తెస్తే స్వాతంత్య్రోద్యమం జరిగేదా? 75 ఏళ్లుగా ఎవరూ రహదారులపై సభలు పెట్టలేదా? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదని విచారణ సందర్భంలో హైకోర్టు వ్యాఖ్యానించిందంటేనే ఇది ఎంతటి అప్రజాస్వామిక జీవోనో అర్థమవుతుంది.

ఇంత వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం.. ప్రతిపక్షాల కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ జీవోను కఠినంగా అమలుచేసింది. సీఎం జగన్‌ ఈ నెల 4న పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలోనూ జీవో1ను గట్టిగా అమలు చేయాల్సిందేనని ఆదేశాలిచ్చారు. హైకోర్టు తాజా తీర్పుతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి అడ్డుకట్ట పడినట్లయింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.