గౌతమ్​ గంభీర్​పై​ విచారణకు హైకోర్టు ఆదేశం!

author img

By

Published : May 24, 2021, 6:42 PM IST

Goutham Gambhir

కొవిడ్​ ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న రాజకీయ నేతలపై విచారణ చేపట్టాలని డ్రగ్​ కంట్రోలర్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. ఓ వైద్యుడు​ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్​పై భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​.. రెండు వేల ఫాబిఫ్లూ ఔషధాలను కొనుగోలు చేయటాన్ని ప్రశ్నించింది. డ్రగ్​ కంట్రోలర్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

దేశంలో కొవిడ్​-19 ఔషధాల కొరత ఉన్న సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న విషయంపై విచారణ చేపట్టాలని డ్రగ్​ కంట్రోలర్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​ మంచి ఉద్దేశంతో ఔషధాలు కొనుగోలు చేసి ఉంటారని, కానీ, అనాలోచితంగా తప్పు చేశారని వ్యాఖ్యానించింది. అలాగే.. ఆప్​ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్​, ప్రవీణ్​ కుమార్​పై ఆక్సిజన్​ కొనుగోలు, నిల్వ చేయటంపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వ డ్రగ్​ కంట్రోలర్​ను ఆదేశించింది కోర్టు.

ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న సమయంలో రాజకీయ నేతలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయగలుగుతున్నారని, అలాంటి వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని దాఖలైన పిల్​పై విచారణ చేపట్టింది జస్టిస్​ విపిన్​ సంఘి, జస్టిస్​ జస్మీత్​ సింగ్​తో కూడిన ధర్మాసనం. దిల్లీలో ఫాబిఫ్లూ వంటి ఔషధాల కొరత ఉన్నప్పటికీ ఓ వ్యక్తి ఏకంగా 2000 స్ట్రిప్స్​ ఎలా కొనుగోలు చేయగలిగారని ప్రశ్నించింది. అలాంటి ప్రిస్క్రిప్షన్​ను కెమిస్ట్​ ఎలా అంగీకరిస్తున్నారని, ఈ అంశాన్నీ పరిశీలించాలని స్పష్టం చేసింది.

" గౌతమ్​ గంభీర్​ మంచి ఉద్దేశంతో అలా చేసి ఉండాలి. ఆయన ఉద్దేశాలను మేను అనుమానించటం లేదు. ఆయన జాతీయ క్రీడాకారుడు. ఔషధాల కొరత ఉన్నప్పుడు ఇది బాధ్యతాయుతమైన ప్రవర్తన అవుతుందా? అనేదే మా ప్రశ్న. ఆయన వెళ్లిన దారి సరైంది కాదనేది మా భావన. అది తప్పు అని అనుకొని ఉండరు. మార్కెట్​ నుంచి ఎక్కువ మొత్తంలో ఔషధాలను ఈ విధంగా కొనుగోలు చేయటం సరికాదు. "

- దిల్లీ హైకోర్టు.

గౌతమ్​ గంభీర్​ 2,628 ఫాబిఫ్లూ స్ట్రిప్స్​ను.. సంజయ్​ గార్గ్​ ఆసుపత్రి డాక్టర్​ మనీశ్​ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్​పై కొనుగోలు చేశారన్న దిల్లీ పోలీసుల నివేదికను పరిశీలించింది కోర్టు. కొనుగోలు చేసిన వాటిలో 2,343 స్ట్రిప్స్​ పంపిణీ చేశారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు మిగిలిన 285 స్ట్రిప్స్​ను ఆరోగ్య సేవల డైరెక్టర్​ జనరల్​ వద్ద ఉంచారు.

ఈ విషయంలో డ్రగ్​ కంట్రోలర్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ధర్మాసనం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని స్పష్టం చేసింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలాంటి కేసుల్లో డ్రగ్​ కంట్రోలర్​దే బాధ్యత ఉంటుందని, పోలీసులది కాదని నొక్కి చెప్పింది.

ఈ కేసులో తదుపరి విచారణను మే 31కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'ఫంగస్​లలో భిన్నమైన రంగులు అందుకే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.