ఉచిత కరెంట్ కాదు.. విద్యుత్తో ఎలా సంపాదించాలో నేర్పిస్తా: మోదీ

ఉచిత కరెంట్ కాదు.. విద్యుత్తో ఎలా సంపాదించాలో నేర్పిస్తా: మోదీ
Gujarat Election 2022 : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ. ఉచిత కరెంట్ ఇవ్వడానికి బదులు.. విద్యుత్తోనే ప్రజలు సంపాదించుకునేలా చేస్తాన్నన్నారు. ఆప్ కేవలం ఓటర్లను ఆకర్షించడానికే ఇలాంటి తాయిలాలు ప్రకటిస్తోందని మండిపడ్డారు. దానికి వత్తాసు పలికినట్లుగా కాంగ్రెస్ కూడా అలాంటి హామీలు ఇస్తోందని.. ఆ పార్టీ 'విభజించు పాలించు' రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
Gujarat Election 2022 : విద్యుత్ ఉచితంగా పొందడానికి బదులు.. కరెంట్ నుంచి ఆదాయం పొందే సమయమిది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యుత్ నుంచి ఎలా సంపాదించాలో తనకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ 'విభజించు పాలించు' రాజకీయాలని చేస్తోందని.. వాళ్ల తపనంతా కేవలం అధికారంలోకి రావడం కోసమేనని ఆరోపించారు. అరవల్లి జిల్లాలోని మోడస టౌన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ.
'మెహ్సానా జిల్లాలోని మొధేరా గ్రామం సోలార్ విద్యుత్తో నడుస్తోంది. వాళ్లకు కావాల్సినంత వాడుకుని.. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు టీవీ, ఫ్రిజ్, ఏసీ లాంటివి లేని మొధేరా గ్రామంలోని మహిళలు.. ఇప్పుడు వాటన్నింటినీ కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవస్థను గుజరాత్ మొత్తం తీసుకురావాలనుకుంటున్నాను. ఇలా చేయడం మోదీకి మాత్రమే తెలుసు. ఇలాంటి విప్లవం గుజరాత్లోని ప్రతి ఇంటికి తీసుకొచ్చేలా నేను పని చేస్తున్నాను. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ మీకు దగ్గరలోనే ఉంది. ఆ రాష్ట్రంలో మీరేమైనా అభివృద్ధిని చూశారా? ఆ రాష్ట్రంలో ఏదైనా మంచి విషయం జరగడాన్ని చూశారా? కాంగ్రెస్కు అభివృద్ధి చేయడం ఎప్పుడూ చేతకాదు' అని మోదీ పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి కాంగ్రెస్ వత్తాసు పాడుతూ.. తాము కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పొందిపరిచిందని మోదీ గుర్తు చేశారు. కానీ తాను మాత్రం ఇళ్ల మిద్దెలపై సోలార్ రూఫ్లతో విద్యుత్ ఉత్పత్తి చేసి.. మిగులు విద్యుత్తో గుజరాతీలు డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి విద్యుత్ అడిగినందుకు రైతులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రైతులు వారి విద్యుత్ను సోలార్ ప్యానెళ్ల ద్వారా వారే ఉత్పత్తి చేసుకుని.. మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం కుడా పొందుతున్నారని మోదీ అన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో డిసెంబర్ 1,5 న జరగనున్నాయి. కౌంటింగ్ డిసెంబర్ 8న జరగనుంది.
ఇవీ చదవండి : గుజరాత్ త్రిముఖం: సెంటిమెంట్తో మోదీ.. రాజస్థాన్ మోడల్తో కాంగ్రెస్.. తాయిలాలతో ఆప్!
అంతా తానై గుజరాత్లో మోదీ ప్రచారం.. రికార్డు స్థాయి విజయం సాధించడమే వ్యూహమా?
