డాక్టర్​ కూతురిపై గ్యాంగ్​ రేప్​.. కూల్​ డ్రింక్​లో మత్తు మందు కలిపి..

author img

By

Published : Mar 5, 2023, 7:55 PM IST

Updated : Mar 5, 2023, 9:33 PM IST

Gangrape On Doctor Daughter In UP Kanpur

ఓ వైద్యుడి 16 ఏళ్ల కుమార్తెను ఆమె స్నేహితులే అత్యాచారం చేశారు. కూల్​ డ్రింక్​లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​లో ఘోరం జరిగింది. మరోవైపు ఓ మహిళ పక్కింటివారిపై ఉన్న కోపంతో ఎరుపు రంగులో ఉండే కుంకుమను తలపై రుద్దుకుంది. దీంతో వారు దాడి చేశారని ఆరోపిస్తూ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఈ వింత సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

ఉత్తర్​ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. ఏకంగా ఓ వైద్యుడి​ కుమార్తెపై ఆమె స్నేహితులే సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్​ డ్రింక్​లో మత్తు మందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. జిల్లాలోని బర్రా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
పోలీసుల తెలిపిన వివరాలు..
డాక్టర్​ కుమార్తెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బర్రా గ్రామానికి చెందిన వినయ్ ఠాకూర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను హుక్కా పార్లర్​కు రావల్సిందిగా బాధిత బాలికను అతడు పిలిచాడు. దీంతో ఆమె అక్కడకు వెళ్లింది. వినయ్​ ఆమెను హుక్కా తాగమని బలవంతం చేశాడు. అయినా ఆమె నిరాకరించినప్పటికీ హుక్కాను తాగించాడు. అనంతరం అక్కడే ఉన్న వినయ్​, మరికొంత మంది స్నేహితులు ఆమెకు కూల్ డ్రింక్​లో మత్తు మందు కలిపి తాగించారు. దీంతో స్పృహ కోల్పోయిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సాముహిక అత్యాచారం చేశారు నిందితులు. ఈ ఘటనలో యువతిని గాయపరిచారు నిందితులు. ఎలాగోలా కామాంధుల చరనుంచి తప్పించుకొని ఆ బాలిక ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తండ్రి స్థానిక బర్రా పోలీస్​ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్నేహితులైన వినయ్​, అజయ్​, అమన్ సింగ్​తో పాటు మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సౌత్ డీసీపీ సల్మాన్ తాజ్ పాటిల్ తెలిపారు.

కుంకుమతో డ్రామా..
తమిళనాడులో ఓ మహిళ హల్​చల్​ చేసింది. తన పొరుగింటివారిపై ఉన్న కోపంతో వారిని పోలీస్​ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. ఇందుకోసం ఎరుపు రంగులో ఉండే కుంకుమను తలపై రుద్దుకుంది. అనంతరం వాళ్లే దాడి చేశారని నిందిస్తూ చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకుంది.
తమిళనాడు దిండిగల్ జిల్లాలోని వేదసందూర్​ ప్రాంతానికి చెందిన చిన్నకుంజు అనే మహిళ మార్చి 3న రాత్రి 9 గంటల సమయంలో దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి 'నన్ను నా పక్కింటి వారు తలపై బలంగా కొట్టి గాయపరిచారు.. నాకు చికిత్స చేయండి' అంటూ అక్కడి సిబ్బందిని కోరింది. దీంతో ఆమె తలను పరీక్షించిన వైద్య సిబ్బంది ఆ రక్తం నకిలీదని తేల్చారు. తలపై ఉన్నది ఎర్రటి కుంకుమ అని బయటపడింది. ఈ నాటకంతో ఆస్పత్రిలోని వారందరూ అక్కడ గుమిగూడి నవ్వడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న వేదసందూరు పోలీసులు.. మహిళను విచారించగా పక్కింటివారిపై ఉన్న కోపంతోనే కావాలని ఇలా చేసినట్లుగా ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆ మహిళను హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు.

మహిళపై గ్యాంగ్​రేప్​..
ఛత్తీస్‌గఢ్​.. బస్తర్​లో దారుణం జరిగింది. జాతరకు ఒంటరిగా వెళ్లిన మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. దర్భా గ్రామంలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన. జాతరలో జరుగుతున్న నాటకాన్ని చూసేందుకు బాధితురాలు అర్ధరాత్రి సమయంలో వెళ్లింది. ఆమెను గమనించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు దర్భా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితులిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Last Updated :Mar 5, 2023, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.