'ఆమె'తో తండ్రికి వివాహేతర సంబంధం​.. ఆస్తి పోతుందన్న భయంతో దారుణ హత్య.. కూతురు పనే!

author img

By

Published : May 24, 2023, 10:40 PM IST

Updated : May 24, 2023, 10:54 PM IST

Daughter Killed Father In Maharashtra Nagpur District

వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్రి.. తమ పేరుపై ఉన్న ఆస్తి మొత్తం ఆ మహిళకు కట్టపెడతాడేమోనన్న భయంతో ఓ కుమార్తె ఏకంగా కన్నతండ్రినే హత్య చేయించింది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే?

వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కన్నతండ్రి.. తమ పేరిట ఉన్న ఆస్తిని ఆమెకు కట్టపెడతాడేమోనన్న భయంతో ఏకంగా అతడినే హత్య చేయించింది ఓ కుమార్తె. మహారాష్ట్ర నాగ్​పుర్​ జిల్లాలోని భివాపుర్ ప్రాంతంలో ఆరు రోజుల కిందట ఓ పెట్రోల్​ బంక్​ యజమాని దిలీప్ సొంటక్కే కొందరు దుండగలు చేతుల్లో హత్యకు గురయ్యారు. ముందుగా ఈ కేసులో అనుమానితులుగా భావించిన ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు.. వారిని విచారించగా షాకింగ్​ నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతురే పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్​తో తన తండ్రిని హత్య చేయించినట్లుగా పోలీసులు తేల్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగ్​పుర్​ జిల్లాకు చెందిన మృతుడు దిలీప్ సొంటక్కే(60) పెట్రోల్​ బంక్​ నిర్వహణ​తో పాటు రియల్​ ఎస్టేట్​ వ్యాపారం చేసేవాడు. నాగ్​పుర్​కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భివాపుర్‌లో దిలీప్​న​కు పెట్రోల్​ బంక్​ వ్యాపారం ఉంది. అతడికి భార్య, 35 ఏళ్ల ప్రియ అనే కుమార్తె ఉన్నారు. అయితే తండ్రి దిలీప్ ఉమ్రేడ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఓ ప్లాట్​లో నివాసం ఉండేవారు. ఈ విషయం కాస్త భార్య, కుమార్తెకు తెలియడం వల్ల ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. పలుమార్లు తల్లీకూతుళ్ల పేరు మీద ఉన్న పొలం, ఇళ్లు సహా మరికొన్ని ఆస్తులను దిలీప్​ తన పేరిట బదిలీ చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు.

Daughter Killed Father In Maharashtra Nagpur
మృతుడు దిలీప్ సొంటక్కే

ఈ క్రమంలో తమ పేరిట ఉన్న ఆస్తిని భవిష్యత్​లో తండ్రి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు రాసిస్తాడేమోనన్న భయం కుమార్తెను వెంటాడింది. ఎలాగైనా తండ్రిని చంపించి ఆ మహిళకు ఆస్తి దక్కనివ్వకుండా చేయాలని పథకం​ వేసింది. అందుకోసం రూ.5 లక్షలతో ఓ సుపారీ గ్యాంగ్​తో తండ్రిని చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అనుకున్నట్లుగానే ఈ నెల 17న తండ్రి బంక్​ కార్యాలయంలోని క్యాబిన్​లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ముగ్గురు దుండగులు వచ్చి దిలీప్​పై పదునైన ఆయుధాలతో దాడికి దిగి దారుణంగా హత్య చేసి చంపేశారు.

దీంతో దిలీప్​ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మరో ప్లాన్​ వేసింది ప్రియ. హత్య చేసింది బయటవాళ్లే అని నమ్మించేందుకు తండ్రిని చంపిన అనంతరం క్యాష్​ కౌంటర్​లో ఉన్న నగదును తీసుకెళ్లాల్సిందిగా హంతకులకు చెప్పింది. దీని ప్రకారమే నిందితులు కూడా క్యాష్​ కౌంటర్​ నుంచి డబ్బు తీసుకొని పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమారాల్లో రికార్డ్​య్యాయి. వీటి ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా తండ్రిని హత్య చేయమని ప్రేరేపించింది కన్నకూతురే అని తేలింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియను పోలీసులు అరెస్ట్​ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనకు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతామని చెప్పారు పోలీసులు.

Last Updated :May 24, 2023, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.