'ఆమెతో దావూద్ రెండో వివాహం.. వారిపై దాడులకు మాస్టర్​ ప్లాన్!'

author img

By

Published : Jan 17, 2023, 4:25 PM IST

Dawood Ibrahim

ఎన్​ఐఏ విచారణలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ప్రముఖ నేతలు, వ్యాపారవేత్తలపై దాడులకు దావూద్‌ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే దావూద్ రెండో వివాహం చేసుకున్నాడని దావూద్‌ బంధువు తెలిపాడు.

అండర్‌ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో తెలిపిన వివరాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో అరెస్టయిన అలీషా.. విచారణలో దావూద్‌కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించాడు. భారత్‌లో ప్రముఖ నేతలు, వ్యాపారవేత్తలపై దాడులు చేసేందుకు దావూద్ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాడని అలీషా తెలిపాడు. ఈ గ్యాంగ్‌ పెద్ద నగరాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడతారని వెల్లడించాడు.

మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే దావూద్‌.. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడని అలీషా తెలిపాడు. ప్రస్తుతం కరాచీలో ఉంటున్న దావూద్ కుటుంబంతో అక్కడే మరో ప్రాంతానికి మారాడని చెప్పాడు. కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక రహీమ్ ఫకీ సమీపంలోని పాకిస్థాన్‌ రక్షణ శాఖకు సంబంధించిన ప్రాంతంలో దావూద్‌ నివసిస్తున్నట్లు వెల్లడించాడు. దావూద్‌కు నలుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారని అలీషా తెలిపాడు. దావూద్‌కు ముగ్గరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు వెల్లడించాడు.

జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో దావూద్ మొదటి భార్య మెహజబీన్ గురించి అలీషా పలు విషయాలు వెల్లడించాడు. మెహజబీన్‌ను గతేడాది జూలైలో దుబాయ్‌లో కలిసినట్లు వివరించిన అలీషా.. తన భార్యతో దావూద్ సతీమణి వాట్సాప్‌లో మాట్లాడుతుందని చెప్పాడు. దావూద్ రెండో పెళ్లి గురించి మెహజబీనే తనకు వెల్లడించిందని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.