'ఖర్గేతో మార్పు సాధ్యం కాదు'.. ముఖాముఖి చర్చకు శశిథరూర్ డిమాండ్!

author img

By

Published : Oct 2, 2022, 6:07 PM IST

Etv Bharatcongress president elections shasi tharoor interview and mallikharjun kharge press meet

కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పును తాను తీసుకొస్తానని ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్ పేర్కొన్నారు. పోటీలో ఉన్న మరో అభ్యర్థి మల్లికార్జున ఖర్గేతో మార్పు సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా.. ఖర్గేతో బహిరంగ ముఖాముఖి నిర్వహించాలని ఆయన కోరారు. కాగా, ఎవరినో ఎదిరించడానికి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత ఏ నిర్ణయమైనా నాయకులంతా సమష్టిగా తీసుకుంటామని చెప్పారు.

Congress President Elections: కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లిఖార్జున్​ ఖర్గేతో బహిరంగ ఎన్నికల ముఖాముఖికి తాను సిద్ధమని తిరువనంతపురం ఎంపీ, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశి థరూర్​ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లుకు సమర్ధవంతమైన నాయకత్వంతో పాటు సంస్థాగత సంస్కరణల కలయికే పరిష్కారమని ఓ ఇంటర్వ్యూలో థరూర్ పేర్కొన్నారు.

"ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహించిన నాకు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 77 కార్యాలయాలలో 800 మంది సిబ్బందితో కూడిన యూఎన్ పబ్లిక్​ రిలేషన్స్​ డిపార్ట్​మెంట్​కు సెక్రటరీ జనరల్​గా సమర్థంగా సేవలు అందించాను. ఆ సంస్థ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాను. బడ్జెట్​ను తగ్గించాను. 2017లో స్థాపించిన ఆల్ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్​కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నాను. కేవలం ఐదేళ్లలో 20 రాష్ట్రాల నుంచి 10,000 మంది సభ్యులు అందులో ఉన్నారు. నామినేషన్​ తేదీకి ఎన్నికల తేదీ మధ్య, దాదాపు రెండున్నర వారాల సమయమే ఉంది కాబట్టి 9,000 పీసీసీ ప్రతినిధులందరినీ సంప్రదించడం చాలా కష్టం. కాబట్టి ముఖాముఖి చర్చ పెడితే ఎక్కువమందికి ఒకేసారి సందేశం ఇవ్వొచ్చు."
--శశిథరూర్, కాంగ్రెస్​ ఎంపీ, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి

"కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులందరనీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. పార్టీని గొప్పగా నడిపించిన రికార్డు గాంధీలకు ఉంది. పార్టీ కోసం వారు సాధించిన దాన్ని ఎప్పటికీ మనం మరచిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల హృదయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మనంలో చాలా మంది రాహుల్​ గాంధీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటారని భావించాం. కానీ అది జరగలేదు. ముఖ్యంగా సోనియా, రాహుల్​, ప్రియాంక ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు" అని శశిథరూర్​ చెప్పారు.

మరోవైపు, ఆదివారం నాగ్​పుర్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన థరూర్.. అధ్యక్ష ఎన్నికలు అంటే యుద్ధం కాదని పేర్కొన్నారు. పోటీలో ఉన్న తాము శత్రువులం కాదని స్పష్టం చేశారు. 'ఖర్గే నాకన్నా సీనియర్ కాబట్టి.. పోటీ నుంచి వైదొలగాలని నాకు కొందరు సూచిస్తున్నారు. కానీ నేను ఎందుకు పోటీ పడకూడదు? ఖర్గే అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఇది పార్టీ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నిక. పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై ఇద్దరికీ వేర్వేరు ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఖర్గే కూడా భాగమే. గాంధీ కుటుంబం కాకుండా పార్టీలో ఉన్న అత్యుత్తమ ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. కానీ, అలాంటి నేత పార్టీలో మార్పు తీసుకురాలేరు. ప్రస్తుత వ్యవస్థనే ఆయన కొనసాగిస్తారు. పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న మార్పును నేను తీసుకొస్తా' అని థరూర్ వ్యాఖ్యానించారు.

'పార్టీని బలోపేతం చేసేందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులోకి'
కాగా, తాను ఎవరినీ ఎదిరించేందుకు కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగలేదని, పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే పోటీలోకి వచ్చానని ఖర్గే తెలిపారు. సీనియర్లు, యువనేతల కోరిక మేరకు తాను ఎన్నికల్లో ప్రవేశించానని ఖర్గే చెప్పారు.'ఒకే వ్యక్తి, ఒకే పదవి' అనే పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే తాను నామినేషన్‌ దాఖలు చేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

"దేశంలో నిరుద్యోగ శాతం, ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధనవంతులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది. ముఖ్యంగా భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. గాంధీ కుటుంబం తనకు మద్దతు ఇస్తోందని వదంతులు వస్తున్నాయి. అవి నిజం కాదు. అయితే ఎన్నికల తర్వాత ఏ నిర్ణయమైనా నాయకులంతా సమష్టిగా తీసుకుంటాం."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి

అనంతరం గౌరవ్‌ వల్లభ్‌ మాట్లాడుతూ.. దీపేందర్‌ హుడా, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌లతో పాటు తాను కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులుగా రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే తరఫున తాము ప్రచారం చేస్తామన్నారు.

ఖర్గే X థరూర్​
ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠీ నామినేషన్‌ శనివారం తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే, థరూర్‌లు మాత్రమే పోటీలో నిలిచారు. అక్టోబరు 17న జరిగే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైనవారు దాదాపు 9,000 మంది ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల్లో ఓట్లు వేస్తారు. అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎక్కువ ఓట్లు లభించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.

'ఖర్గేది ఏకపక్ష పోటీ.. థరూర్​ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి'
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంక్షోభం అనంతరం.. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అశోక్​ గహ్లోత్​.. ఖర్గే, థరూర్​ల పోటీపై స్పందించారు. మల్లికార్జున ఖర్గే గొప్ప రాజకీయ అనుభవజ్ఞుడని, ఆయన కాంగ్రెస్‌ను బలోపేతం చేయగలరని గహ్లోత్​ అన్నారు. ఆయన నిష్కళంక చరితుడని, దళిత జాతిలో జన్మించారని చెప్పారు. ఆయనను అందరూ స్వాగతిస్తున్నారన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆయన కచ్చితంగా గెలుస్తారని తెలిపారు. ఖర్గే ఎన్నికైతే 50 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు దళితుడు అధ్యక్షుడు అవుతారని అన్నారు.

శశి థరూర్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఉన్నత స్థాయి వర్గానికి చెందినవారని వ్యాఖ్యానించారు. అయితే పార్టీని బూత్, బ్లాక్, జిల్లా స్థాయుల్లో బలోపేతం చేయడానికి అవసరమైన అనుభవం ఖర్గేకు ఉందని, థరూర్‌తో ఆయనను పోల్చకూడదని అన్నారు. ఖర్గేకు ఇది ఏకపక్ష పోటీ అని తెలిపారు.

అశోక్​ గహ్లోత్​ సేఫ్​!!
రాజస్థాన్​లో ఎవరి నాయకత్వంలో కాంగ్రెస్​ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి సర్వే చేయమని అజయ్​ మాకెన్​కు చెప్పానని గహ్లోత్ అన్నారు. అయితే రాజస్థాన్​ ముఖ్యమంత్రి పీఠం విషయంలో హైకమాండ్​ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అధికారి తెలిపారు. గహ్లోత్​ను సీఎం పదవి నుంచి తప్పించే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి గహ్లోత్ సేఫ్​ అని తెలుస్తోంది.

ఇవీ చదవండి: గుజరాత్​లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. వాటర్​ బాటిల్​తో దాడి!

మార్నింగ్​ వాక్​ చేస్తున్న వారే టార్గెట్.. బైక్​పై వచ్చి కాల్పులు.. లక్కీగా ముగ్గురు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.