'కేంద్ర మంత్రిని తొలగిస్తేనే.. బాధితులకు న్యాయం'

author img

By

Published : Oct 13, 2021, 11:54 AM IST

Updated : Oct 13, 2021, 1:13 PM IST

congress

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri Violence) హింసాత్మక ఘటనపై ఫిర్యాదు చేసేందుకు రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ ప్రతినిధుల బృందం... రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలిసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఈ ఘటనపై ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri Violence) ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ​ సహా పలువురు నేతలు దిల్లీలో రామ్​నాథ్ కోవింద్​ను కలిశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

congress memorandum of facts
మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు

"లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రా నిందితుడుగా ఉన్న నేపథ్యంలో... అజయ్​ మిశ్రాను తన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని మేం కోరాం. లేదంటే ఈ కేసులో దర్యాప్తు న్యాయబద్ధంగా జరగదని చెప్పాము. దీనిపై ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేశాం."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

లఖింపుర్ ఘటనపై ప్రభుత్వంతో ఈరోజే చర్చిస్తానని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు.

"లఖింపుర్​ ఖేరి ఘటనకు సంబంధించి అన్ని వివరాలను మేం రాష్ట్రపతికి సమర్పించాం. మాకు రెండు డిమాండ్లు ఉన్నాయి. ఒకటి ఈ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి. రెండోది... కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలి లేదా రాజీనామా చేయాలి. అప్పుడే బాధితులకు న్యాయం దక్కుతుంది" అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.

లఖింపుర్​లో ఏం జరిగిందంటే..?

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అకోబరు 3న లఖింపుర్‌ ఖేరిలో (Lakhimpur Kheri Incident) తికోనియా-బన్బీపుర్‌ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తుండగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు(Ajay Mishra Son) ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈ కేసులో ఆశిష్‌ మిశ్రాను ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు'

Last Updated :Oct 13, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.