కునోకు వచ్చిన చీతాలు క్షేమమేనా..? నిపుణుల నిఘా

author img

By

Published : Sep 21, 2022, 7:13 AM IST

Cheetahs in kuno national park are under experts observation

Cheetah In Kuno National Park : నమీబియా నుంచి కునో నేషనల్​ పార్క్​కు కొత్త స్నేహితులు వచ్చాయి. అంత దూరం నుంచి వచ్చిన ఈ అతిథులకు ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడ్డాయో లేదో తెలియదు. అందుకనే వాటి ఆలనా పాలన చూసుకునేందుకు నిపుణులు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు.

Cheetah In Kuno National Park : నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్‌ జిల్లా కునో జాతీయ పార్కుకు ఇటీవల తరలించిన 8 చీతాలు కొత్త వాతావరణానికి ఎలా అలవాటు పడుతున్నాయన్నది నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మనుషులతో వాటికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా ఎన్‌క్లోజర్లకు 50 నుంచి 100 మీటర్ల దూరంలో గడ్డివాములతో ఏర్పాటుచేసిన మంచెల్లాంటి నిర్మాణాల నుంచి నిపుణులు నిఘా పెట్టారు. చీతాల కంటపడకుండా వాటికి అడ్డుగా తెరలు ఏర్పాటు చేసి, రంధ్రాల నుంచి కదలికలను పరిశీలిస్తున్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్‌, సావన్నా, సాషా, ఓబాన్‌, ఆశా, సిబిలి, సైసా.. అనే పేర్లు గల ఈ చీతాలు ఆరు క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్లలో నెల రోజులపాటు గడపనున్నాయి. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వచ్చినందున ప్రొటోకాల్‌ ప్రకారం ఇది తప్పనిసరి.

30 నుంచి 66 నెలల మధ్య వయసు ఉన్న ఈ ప్రాణుల్లో అయిదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసంగా ఉన్నట్లు డీఎఫ్‌వో ప్రకాశ్‌కుమార్‌ వర్మ మంగళవారం వెల్లడించారు. వింధ్య పర్వతాల్లో ఉత్తరం దిక్కున 750 చదరపు కిలోమీటర్లలో కునో పార్కు విస్తరించి ఉంది. 8,000 కి.మీ.ల దూరంలోని నమీబియా నుంచి గత శనివారం ఇక్కడకు తీసుకువచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చీతాల వెంట వచ్చిన ఆఫ్రికన్‌ నిపుణుల బృందంలో కొందరు ఇప్పటికే వెనక్కు వెళ్లారు.

పశువైద్యురాలు అనా విన్సెంట్‌, మరో ఇద్దరు నమీబియన్లు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) ఉత్తమ్‌కుమార్‌ శర్మ తెలిపారు. భారత పశువైద్య నిపుణులు డాక్టర్‌ జితేంద్ర జాతవ్‌, డాక్టర్‌ ఓంకార్‌ ఆంచల్‌ వీరికి సహకరిస్తున్నారు. నిపుణుల సూచన మేరకు చీతాలకు గేదె మాంసం పెడుతున్నారు. ఈ జంతువులు మూడు రోజులకు ఒకసారి ఆహారం తీసుకొంటాయని డీఎఫ్‌వో తెలిపారు.

ఏనుగుల రక్షణ

భోపాల్‌: కునో జాతీయ పార్కులో ఇతర వన్యప్రాణుల నుంచి చీతాలకు రక్షణగా గజరాజులు పహారా కాస్తుండటం విశేషం. నర్మదాపురం సాత్పురా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి లక్ష్మి, సిద్ధాంత్‌ అనే రెండు ఏనుగులను ప్రత్యేకంగా ఈ పని కోసమే ఇక్కడికి తీసుకువచ్చారు. సిద్ధాంత్‌కు 30 ఏళ్లు.. లక్ష్మికి 25. గస్తీ విధుల్లో ఈ గజరాజులకు సుదీర్ఘ అనుభవం ఉంది. నెల రోజుల క్రితమే వీటిని ఇక్కడికి తరలించారు. చీతాలు రాకముందు.. వాటికి కేటాయించిన ప్రత్యేక ఎన్‌క్లోజర్లలోకి ప్రవేశించిన నాలుగు చిరుతలను తరిమికొట్టడంలో ఇవి కీలకపాత్ర పోషించాయి. ప్రస్తుతం ఈ రెండు ఏనుగులు ఎన్‌క్లోజర్లలో ఉన్న చీతాల రక్షణకు జాతీయ పార్కు భద్రతా సిబ్బందితోపాటు రేయింబవళ్లు గస్తీ తిరుగుతున్నాయి.

ఇదీ చదవండి: గుజరాత్‌లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. కావాలనే చేయించారని దిల్లీ సీఎం ఫైర్

'కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రాహుల్ దూరం.. భారత్ జోడోపైనే దృష్టి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.