ఆ విషయం నేను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు..! సీబీఐ విచారణ దారి తప్పుతోంది : అవినాష్

author img

By

Published : Mar 10, 2023, 4:42 PM IST

Updated : Mar 10, 2023, 8:59 PM IST

Etv Bharat

cbi enquiry ys viveka murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి శుక్రవారం సీబీఐ విచారణ అనంతరం కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలిపారు. విచారణ తప్పుదోవ పడుతోందని, తప్పుడు ఆరోపణలతో అమాయకులను ఇరికిస్తున్నారని ఆరోపించారు.

cbi enquiry ys viveka murder case : వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ఎదుట మూడోసారి విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన ఉదయం 11 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అక్కడకు భారీగా తరలివచ్చారు. ముందుజాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వివేకా కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగానే ఆయన హత్య జరిగిందని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకాను ఆస్తి కోసమే హత్య చేశారన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో లేఖను మాయం చేశారని... వివేకా కుమార్తె సునీత భర్త చెబితేనే తాను సంఘటన స్థలానికి వెళ్లానన్నారు. తన సోదరి సునీత హైకోర్టులో సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసిందని... ఏ రోజు తాను ఎవరి గురించి మాట్లాడలేదని అవినాష్‌ తెలిపారు. తాను కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డి ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారని... ఆమెకు పుట్టిన కుమారుడు రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆయన కూడా తన పేరును ముస్లింగా మార్చుకున్నారన్నారు. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని కార్యకర్తలు, అనుచరులు తనను ప్రశ్నిస్తున్నారని... ఇక నుంచి మాట్లాడడం మొదలు పెడతానని అవినాష్‌రెడ్డి చెప్పారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా.. చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ కావాలని ఇప్పటికే పలుమార్లు అడిగాం.. అయినా ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం అని వెల్లడించారు. విచారణ తప్పుదోవ పడుతోందని గతంలోనే చెప్పామని గుర్తుచేస్తూ.. తప్పుడు ఆరోపణలతో అమాయకులను ఇరికిస్తున్నారని ఆరోపించారు.

గుండెపోటు.. అని నేనెప్పుడూ చెప్పలేదు.. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లనే తీసుకుంటున్నారని, కట్టుకథను అడ్డంపెట్టి విచారణను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని కార్యకర్తలకు హామీ ఇస్తున్నా అని అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎంతవరకైనా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. పిటిషన్లు వేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేసు విచారణ వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ.. కంచే చేను మేసిన చందంగా ఉందని అన్నారు. హత్యాస్థలంలో దొరికిన లేఖ, ఫోన్‌ను దాచడం నేరం కాదా?, లేఖలోని వివరాలను దర్యాప్తు అధికారులకు చెప్పరా? అని సీబీఐ అధికారులను అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. గుండెపోటు అని నేను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని, గుండెపోటుగా తాను చెప్పినట్లు టీడీపీ నాయకులే చిత్రీకరించారని అన్నారు.

సీబీఐ ఏమంటోందంటే.. అవినాష్‌రెడ్డి విచారణను రికార్డ్ చేశామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆడియో, వీడియో రికార్డుల హార్డ్ డిస్క్‌ను సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టుకు తెచ్చారు. హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. కాగా, అవినాష్‌ వివరాలు, హార్డ్ డిస్క్‌ను సోమవారం సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు.. అవినాష్‌రెడ్డి.. సాక్షా? నిందితుడా? అని సీబీఐని ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని, అవసరమైతే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటామని సీబీఐ స్పష్టం చేసింది. సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే మంగళవారం మరోసారి అవినాష్‌ హాజరవుతారని తెలిపింది. అయితే, హత్యాస్థలంలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని సీబీఐ హైకోర్టుకు వెల్లడించింది. లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అభిప్రాయం తీసుకున్నామన్న సీబీఐ... తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తెలిపిందని వివరించింది. ఈ మేరకు లేఖ, సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక సమర్పించాల్సిందిగా సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం ఉందా ప్రశ్నించగా, తమకు అభ్యంతరం లేదని అవినాష్‌రెడ్డి, సీబీఐ తెలిపారు.

కేసు విచారణ సందర్భంగా.. తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో.. తీవ్రమైన చర్యలంటే ఏంటని ప్రశ్నించిన తెలంగాణ కోర్టు.. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా? అని ప్రశ్నించింది. చెప్పినట్లు వాంగ్మూలం నమోదు చేస్తున్నారన్న నమ్మకం లేదని సమాధానం రావడంతో.. విచారణ వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో తెలపాలని ఆదేశించిన కోర్టు.. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలని సూచించింది. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున... తన వాదనలు కూడా వినాలని సునీత కోరగా.. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌పై తమకు అభ్యంతరం లేదని అవినాష్‌రెడ్డి, సీబీఐ తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated :Mar 10, 2023, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.