CBI Arguments in TS HC: ఈనెల 31 వరకు అవినాష్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

author img

By

Published : May 27, 2023, 10:59 AM IST

Updated : May 27, 2023, 2:53 PM IST

CBI Arguments in TS HC

10:56 May 27

వాదనలు వింటున్న వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి

CBI Arugumets on MP Avinash: ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈనెల 31కి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అవినాష్ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ కోర్టుకు విన్నవించింది. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు. కేసు దర్యాప్తులో మొదటినుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్‌కు ఏమిటి?కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారు’’ అని సీబీఐ తనఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా?: హైకోర్టు.. సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారని.. ప్రధాన కారణమేంటి?అని ప్రశ్నించింది. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. ‘‘రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. అవినాష్‌ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది. అవినాష్‌ రాజకీయంగా శక్తిమంతుడైతే వివేకాను చంపాల్సిన అవసరం ఏంటి?’’ అని కోర్టుకు తెలిపారు.

వారి నుంచి ఏం తెలుసుకున్నారు?: హైకోర్టు.. ‘‘భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి అరెస్టుకు కారణాలేంటని.. వారి నుంచి ఏం తెలుసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇస్తూ.. ‘‘కుట్రలో ప్రమేయం దృష్ట్యా భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిని అరెస్టు చేశాం. కస్టడీ విచారణకు వారిద్దరూ సహకరించడం లేదు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారు. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారు. శత్రువుకి శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారు. అవినాష్‌ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి చెప్పాడు. అవినాష్‌ డబ్బులు శివశంకర్‌రెడ్డికి ఇస్తే.. శివశంకర్‌ రెడ్డి గంగిరెడ్డికి ఇచ్చాడు. రూ.4 కోట్లు ఖర్చు చేయడానికి శివశంకర్‌రెడ్డికి ఏం అవసరం?’’ అని సీబీఐ తెలిపింది.

గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు: హైకోర్టు.. గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలు చెరిపేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ‘‘గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు. గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేంటి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ స్పందిస్తూ.. ‘‘శివశంకర్‌ రెడ్డి చెప్పినట్టుగానే ఎం.వి.కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రక్తపు మరకల విషయాన్ని కృష్ణారెడ్డి ప్రస్తావించలేదు. శివశంకర్‌ అంటే ఉన్న భయంతో సీఐ శంకరయ్య వాస్తవ పరిస్థితిని నమోదు చేయలేదు’’ అని పేర్కొంది.

అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: హైకోర్టు.. ‘‘హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్‌లో ఎవరితో మాట్లాడారు?అవినాష్ వాట్సప్‌లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్సప్ కూడా బిజీగా ఉందా? భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటినుంచో అనుమానిస్తోంది కదా. మరి అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ స్పందిస్తూ.. ‘‘వాట్సప్ కాల్ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తోంది. అయితే, ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేం. ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకే అవినాష్‌ను విచారించాలని అనుకుంటున్నాం. ఈనెల 12న అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ డేటా సేకరించాం’’ అని సీబీఐ వెల్లడించింది.

"సీబీఐ తీరు కూడా అనుమానాస్పదంగానే ఉందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. కొందరు కీలక సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. సీల్డ్‌ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తాం" అని తెలిపింది. పిటిషనర్‌కు కూడా ఆ వాంగ్మూలాలు ఇస్తారా అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించగా.. సాక్షుల వివరాలు ప్రస్తుత దశలో బయటపెట్టలేమని.. అలా బయటపెడితే వారి ప్రాణాలకు ముప్పు అని సీబీఐ వెల్లడించింది. ప్రస్తుతం అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై సీబీఐ వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనలపై హైకోర్టులో అవినాష్‌రెడ్డి న్యాయవాది రిప్లై వాదనలు వినిపిస్తున్నారు.

నిమ్స్​లో భాస్కర్​రెడ్డి చికిత్స: నిమ్స్ ఆసుపత్రిలో ఎంపీ అవినాష్​ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. నిన్న చంచల్‌గూడ జైలులో భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు నిమ్స్‌కు ఆసుపత్రికి తరలించారు. భాస్కర్‌రెడ్డికి నిమ్స్​ వైద్యులు గుండె, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో భాస్కర్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు.

Last Updated :May 27, 2023, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.