Boy Complaint on His Mother: టవల్​తోనే పోలీస్​స్టేషన్​కు బుడ్డోడు.. కంప్లైంట్​ విని పోలీసులు షాక్​

author img

By

Published : May 15, 2023, 2:11 PM IST

Boy Complaint on His Stepmother

Boy Complaint on His Stepmother: ఓ పదేళ్ల బుడతడు పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు. స్నానం చేసి చొక్కా వేసుకోకుండా టవల్​తోనే వెళ్లాడు. అక్కడికి వెళ్లి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కంప్లెంట్​ విని అక్కడ ఉన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏమని ఫిర్యాదు ఇచ్చాడు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..

Boy Complaint on His Stepmother: సహజంగా పార్టీలు, ఫంక్షన్లు అంటే చాలా మంది కొత్తబట్టలు వేసుకుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే కచ్చితంగా కావాలని అడుగుతారు. వద్దని చెపితే మారం చేస్తుంటారు. అప్పటికి ఇవ్వకపోతే మంకుపట్టు పట్టి సాధించుకుంటారు. అయితే ఈ బుడ్డోడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. స్నేహితుడు పుట్టినరోజు ఫంక్షన్​ వెళ్లడానికి కొత్త చొక్కా ఇవ్వలేదని ఓ పని చేశాడు. ఇప్పుడు ఆ విషయం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ఓ పక్క ఫ్రెండ్​ పుట్టిన రోజుకు టైం అవుతోంది. అక్కడికి వెళ్లాలి. కానీ ఇక్కడ అమ్మేమో తెల్ల చొక్కా అగిడితే ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడవుగా స్నానం చేసి కట్టుకున్న టవల్తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసుస్టేషన్​కు వెళ్లాడు. తన తల్లిపై పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. బాలుడి కంప్లైంట్​ విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్​ ఉందండోయో.. ఆ తల్లి కన్నతల్లి కాదు.. మారు తల్లి. ఈ ఆసక్తికర సన్నివేశం ఏలూరు జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కొత్తపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న సాయిదినేష్​కు పదేళ్లు. నాలుగో తరగతి పూర్తి చేసి ఐదులోకి వెళుతున్నాడు. ఇతని తల్లి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. సాయి దినేష్​కు ఓ సోదరి ఉంది. ఆదివారం స్నేహితుడి పుట్టినరోజు కావడం వల్ల అక్కడికి వెళ్లాలని సాయి దినేష్​ స్నానం చేసి మారు తల్లిని తెల్ల చొక్కా ఇవ్వమన్నాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. బయటకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. అయినప్పటికీ బుడ్డోడు మారాం చేస్తుంటే కొట్టింది.

దీంతో దినేష్ చొక్కా వేసుకోకుండానే టూటౌన్ పోలీసుస్టేషన్​కు వెళ్లాడు. అక్కడ తన మారుతల్లిపై ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖరరావు.. సాయి దినేష్​ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లల పట్ల ప్రేమతో ఉండాలని సూచించారు. అదే విధంగా తల్లిదండ్రుల మాట వినాలని, చక్కగా చదువుకోవాలని, గౌరవంగా మెలగాలని బాలుడికీ సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే మరోవైపు అల్లరి చేశాడని గత సంవత్సరం సాయిదినేష్​కు మారు తల్లి వాతలు పెట్టింది. ఈ విషయంపై అప్పట్లో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.