బహిరంగ మలవిసర్జన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని ఎన్ని సార్లు చెప్పినా ఆ అలవాటు మానుకోవడం లేదు కొందరు. అందుకే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బహిరంగ మలవిజర్జనకు పాల్పడ్డవారికి భిన్నమైన శిక్షలు విధిస్తూ.. స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తున్నారు అధికారులు.
అలా చేస్తే రేషన్ కట్..
మహారాష్ట్ర అనురాగ్ బాద్ జిల్లాలోని జరంది గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసినట్టు కనిపిస్తే ఆ కుటుంబాలకు రేషన్ కార్డు రద్దు చేయాలని నిశ్చయించింది గ్రామ పంచాయతీ. ఆదేశాలు ఉల్లంఘించినవారి ఫోటోలు తీసి, సమాచారం ఇస్తే వారికి పన్ను ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది.
అనురాగ్బాద్ జిల్లాలో 5 వేలకు పైగా ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించారు. సరిపడా నీటి వసతులు ఉన్నాయి. అయినా.. ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేసేవారిని అరికట్టలేకపోతున్నారు. అందుకే ఈ అనారోగ్యకరమైన అలవాటును రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి అధికారులు.
జరిమానా కట్టకపోతే.. చెత్త ఎత్తాలి
మధ్యప్రదేశ్లో బహిరంగ మల విసర్జన చేసినందుకు వీధుల్లో చెత్త ఎత్తే శిక్ష విధించింది ఇందోర్ పురపాలక సంఘం. కేంద్ర స్వచ్ఛ నగరాల సర్వేలో వరుసగా మూడేళ్లు పరిశుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకున్న ఇందోర్లో ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరించింది.
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి, వివేక్ గంగ్రాడే ఆ ప్రాంతంలో స్వచ్ఛత తనిఖీలో ఉండగా.. బహిరంగంగా మలవిసర్జన చేస్తూ పట్టుబడ్డాడు 30 ఏళ్ల ఓ వ్యక్తి. అతడికి 100 రూపాయల జరిమానా విధించారు.
కానీ, తాను వేరే ప్రాంతం నుంచి వచ్చానని అంత డబ్బు తన దగ్గర లేదని చెప్పేసరికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వీధుల్లో చెత్త ఏరి శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇదీ చదవండి:రేషన్ కార్డు ఉంటే సంక్రాంతికి రూ.వెయ్యి, చీర ఫ్రీ!