మాతృభక్తి.. తల్లి మాట తప్ప ఎవరి ఆదేశాలను లెక్కచేయని వీరుడు!

author img

By

Published : Jun 24, 2022, 6:52 AM IST

azadi ka amrit mahotsav

Azadi Ka Amrit Mahotsav: వివేకానందుడితో కలసి చదివారు.. సి.వి.రామన్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రామానుజన్‌ లాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించి బ్రిటిష్‌ రాజ్యంలో మేధో భారతావని ఆవిష్కరణకు కృషి చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ను తెల్లవారి దాడి నుంచి కాపాడారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండానే.. ఆంగ్లేయుల గౌరవాన్ని అందుకొన్న అరుదైన మేధావి అశుతోష్‌ ముఖర్జీ!

Ashutosh Mukharjee Biography: విద్యావంతుల కుటుంబంలో 1864 జూన్‌ 29న కలకత్తాలో జన్మించిన అశుతోష్‌ ముఖర్జీ చిన్నప్పటి నుంచీ చదువుల్లో చురుకు. ప్రెసిడెన్సీ కాలేజీలో వివేకానందుడితో పాటు చదువుకున్నారు. బీఏ పాసై గణితం, భౌతికశాస్త్రం రెండింటిలోనూ పీజీ పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి రెండు పీజీ డిగ్రీలు అందుకున్న తొలి విద్యార్థి అయ్యారు. ఆయన కాలేజీలో ఉన్న సమయంలోనే జాతీయోద్యమానికి బీజాలు పడుతున్నాయి. సురేంద్రనాథ్‌ బెనర్జీ బెంగాలీ పత్రికలో ఆంగ్లేయ విధానాలను, హక్కుల హననాన్ని విమర్శిస్తూ వ్యాసం రాశారు. ఇందుకు ఆయన్ను రెండు నెలలు జైల్లో పెట్టారు. 1883లో కలకత్తా విద్యార్థిలోకం దీనిపై ఉప్పెనలా ఉద్యమించింది. హైకోర్టును చుట్టుముట్టింది. విద్యార్థులకు ఆనాడు సారథ్యం వహించింది అశుతోష్‌ ముఖర్జీయే!

తర్వాత ఆయన విద్యారంగంలో, గణిత పరిశోధనల్లో మునిగిపోయారు. గణితంలో ఆయన పరిశోధన పత్రాలను చూసి విదేశీ నిపుణులూ ఆశ్చర్యపోయేవారు. రాయల్‌ సొసైటీ ఆర్థర్‌ కేలే, రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఎడింబరో, రాయల్‌ ఐరిష్‌ అకాడమీ, లండన్‌ మేథమాటికల్‌ సొసైటీ, పారిస్‌, అమెరికన్‌ మ్యాథమేటిక్స్‌ సొసైటీలు అశుతోష్‌కు సభ్యత్వమిచ్చి గౌరవించాయి. బ్రిటిష్‌ సర్కారు సర్‌ బిరుదునిచ్చింది కూడా. 24వ ఏటే కలకత్తా విశ్వవిద్యాలయ ఫెలోషిప్‌తో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఆయన న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నారు. 1897లో ఏకంగా అందులో పీహెచ్‌డీ చేసి.. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. 1904లో కలకత్తా హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. తర్వాతి రోజుల్లో కొద్దికాలం ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తానొకప్పుడు ఏ కోర్టు ముందు ఉద్యమించారో అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అవటం విశేషం.

తాము చెక్కిన మేధోశిల్పంలా భావించి అశుతోష్‌ను 1906లో కలకత్తా విశ్వవిద్యాయం ఉపకులపతిగా నియమించింది బ్రిటిష్‌ సర్కారు. 1914 దాకా ఆ పదవిలో కొనసాగిన ఆయన.. ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అప్పటిదాకా కేవలం పరీక్షల నిర్వహణ, పట్టాల ప్రదానానికే పరిమితమైన విశ్వవిద్యాలయంలో చదువులు చెప్పటం ప్రారంభించారు. స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతున్నా ఆంగ్లేయులు అందిస్తున్న సదుపాయాలను భారతీయులు సద్వినియోగం చేసుకోవాలనేవారాయన.

అందుకే.. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖలో పనిచేస్తున్న సి.వి.రామన్‌ ప్రతిభను గుర్తించిన అశుతోష్‌ ఆయన కోసం.. తన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఓ సైన్స్‌ కాలేజీని ఆరంభించారు. చేస్తున్న ఉద్యోగంకంటే తక్కువ జీతానికి ఒప్పించి తీసుకొచ్చి.. రామన్‌ పరిశోధనలను ప్రోత్సహించారు. చివరకవే నోబెల్‌ బహుమతి అందుకునే స్థాయికి చేర్చాయి. అలాగే.. గణితశాస్త్రవేత్త రామానుజన్‌ను కూడా తన సిద్ధాంతాలను ప్రపంచానికి వెల్లడించేందుకు సాయం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రతిభనూ గుర్తించి ఆశ్రయమిచ్చింది అశుతోషే. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన ఉపకులపతిగా ఉన్నప్పుడే కాలేజీలో చదువుతున్న సుభాష్‌ చంద్రబోస్‌కు.. ఆంగ్లేయ అధ్యాపకుడికి గొడవ జరిగింది. బోస్‌ను శాశ్వతంగా బహిష్కరించి ఎక్కడా సీటు దొరక్కుండా చేయాలని ఆంగ్లేయులు పట్టుబట్టారు. కానీ అశుతోష్‌ ఆ ఒత్తిళ్లకు లొంగకుండా.. మరో కళాశాలలో ఆయనకు సీటిప్పించి కాపాడారు. ఆ తర్వాత బోస్‌ లండన్‌ వెళ్లి ఐసీఎస్‌ పాసయ్యారు.

ఒకవైపు బెంగాల్‌ స్వాతంత్య్ర ఉద్యమ వీరులను కలుస్తూనే.. మరోవైపు బ్రిటిష్‌ వైస్రాయ్‌తోనూ అశుతోష్‌ సంబంధాలు నెరపేవారు. 1921-23 దాకా మళ్లీ కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రెండోదఫా సేవలందించిన ఆయన.. ఆంగ్లేయుల నిబంధనలకు నిరసనగా పదవి నుంచి వైదొలగారు. తన 80వేల పుస్తకాలను జాతీయ గ్రంథాలయానికి విరాళమిచ్చిన అశుతోష్‌.. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ.. 1924 మే 25న కన్నుమూశారు. జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆయన కుమారుడే!

అశుతోష్‌ ప్రతిభను చూసి ఆంగ్లేయులు కూడా గర్వించటం గమనార్హం. భారత్‌లో తాము అనుసరిస్తున్న విధానాలు ఇలాంటి ప్రతిభావంతులను తయారు చేస్తున్నాయని ప్రపంచానికి, ముఖ్యంగా స్వదేశమైన బ్రిటన్‌లో చూపించాలనుకున్నారు. ఇందుకోసం.. అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ స్వయంగా అశుతోష్‌ను బ్రిటన్‌లో పర్యటించి రావల్సిందిగా కోరాడు. కానీ అప్పటి సంప్రదాయాల ప్రకారం.. సముద్రయానానికి ఆయన తల్లి అంగీకరించలేదు. ఈ విషయమే వైస్రాయ్‌కి చెప్పారు అశుతోష్‌! 'నీ కుమారుడిని లండన్‌ పంపాల్సిందిగా భారత వైస్రాయ్‌ ఆదేశిస్తున్నారని మీ అమ్మకు చెప్పు' అంటూ స్పందించాడు. వెంటనే అశుతోష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. "అశుతోష్‌ ముఖర్జీ అనే నేను.. నా తల్లితప్ప మరెవ్వరి ఆదేశాలనూ పాటించను. అది వైస్రాయ్‌ అయినా మరెవ్వరైనాగానీ లెక్కచేయను" అంటూ కరాఖండిగా చెప్పి వచ్చేశారు.

ఇదీ చదవండి: 'ప్లాసీ'కి ముందే ఆర్కాట్​లో బీజం.. భారతావనిలో ఆంగ్లేయుల రాజ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.