ETV Bharat / technology

అంతరిక్షంలో నివాసంపై శుభాన్షు శుక్లా పరిశోధన- BHEEMపై కీలక కామెంట్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన భారత వ్యోమగామి కీలక అధ్యయనం- చంద్రుడు, అంగారకుడిపై మానవ నివాసాల కోసం సాంకేతికతలపై పరిశోధన- బెంగళూరులోని అలోక్ ల్యాబ్‌లో రూపుదిద్దుకున్న 'BHEEM'

Shubhanshu Shukla On BHEEM
భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 3:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Shubhanshu Shukla On BHEEM : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా కీలక అధ్యయనం చేపట్టారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. రష్యాలో ప్రాథమిక శిక్షణ ముగించుకుని వచ్చిన తర్వాత లాంచ్ వెహికల్, ఆర్బిటల్ మాడ్యూల్ వ్యవస్థలపై శిక్షణను ప్రారంభించినట్లు వెల్లడించారు. కఠినమైన శారీరక, అంతరిక్ష యాన శిక్షణ సహా అకడమిక్ రీసెర్చ్‌పై దృష్టి సారించినట్లు వివరించారు. భారతదేశ భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు ఉపయోగపడేలా భవిష్యత్ అంతరిక్ష అన్వేషణకు సంబంధించిన అంశం ఎంచుకుని పరిశోధన చేయాలని ఇస్రో సూచించిందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రయాణించే వ్యోమనౌకల గురించే కాకుండా, ఇతర గ్రహాలపై దిగిన తర్వాత మానవులు ఎక్కడ, ఎలా నివసిస్తారనే అంశంపై పరిశోధన ప్రారంభించినట్లు శుభాన్షు శుక్లా వెల్లడించారు. భూమికి అవతల మానవులు జీవించడానికి, పనిచేయడానికి వీలు కల్పించే సాంకేతికతలపై దృష్టి సారించినట్లు తెలిపారు. బెంగళూరులోని IISc అలోక్ ల్యాబ్‌లో జరిగిన ఈ పరిశోధనల ఫలితమే భారతీయ హ్యాబిటబుల్ ఎక్స్‌పాండబుల్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ హ్యాబిటాట్-BHEEM అని పేర్కొన్నారు. తన పరిశోధనా రంగం గ్రహాంతర నివాసాలకు సంబంధించినదని చెప్పిన ఆయన అంటే భవిష్యత్తులో భూమికి అవతల మానవులు జీవించడానికి, పనిచేయడానికి వీలు కల్పించే సాంకేతికతలపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. అక్కడ మానవులు సురక్షితంగా జీవించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఎలా కల్పించాలి? ఎలాంటి నిర్మాణం ఉండాలి? వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

'ఎన్నో సవాళ్లను అధిగమించాలి'
చంద్రుడు, అంగారకుడు లేదా ఇతర గ్రహాలపై మానవులు స్థిరంగా జీవించాలంటే ముందుగా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన రేడియేషన్, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రాణ రక్షణ వ్యవస్థలు, శక్తి వనరులు, నిర్మాణం వంటి ఎన్నో కీలకమైన అడ్డంకులు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికీ మించి అసలు 'మనం ఎక్కడ నివసిస్తాం' అనేది ప్రాథమిక ప్రశ్న. అందుకే ఈ సవాళ్ల గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం ఉందని శుక్లా స్పష్టం చేశారు. మరో గ్రహంపై నివాసాన్ని నిర్మించే మొదటి అడుగు కేవలం ఇటుక పేర్చడం కాకపోవచ్చని, ఆ నివాసం భవిష్యత్తులో ఎలా ఉండనుందో ఊహించే సాహసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఆవాసాలను నిర్మించడానికి అవసరమైన సాంకేతికత కూడా కీలకంగా మారుతుందని అన్నారు.

ఇప్పటి నుంచే ఆలోచించాలి
భవిష్యత్తులో 20 ఏళ్ల తర్వాత మానవులు భూమికి అవతల జీవించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ఆ ప్రయత్నాలను 20 ఏళ్ల తర్వాత ప్రారంభించడం సరిపోదని శుభాన్షు శుక్లా స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆలోచనలు, పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి ఇప్పటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. మరో గ్రహంపై మానవ ఆవాసాన్ని నిర్మించడంలో మొదటి అడుగు కేవలం ఇటుక పేర్చడం కాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ ఆవాసం భవిష్యత్తులో ఎలా ఉండాలి? అక్కడ మానవులు ఎలా జీవించాలి? అనే విషయాలను ఊహించి, వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించడమే మొదటి అడుగు కావచ్చని తెలిపారు.

యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్​- టిమ్ కుక్ స్థానంలో బాధ్యతలు స్వీకరణ!

'తొలి డార్క్ స్కై' విలేజ్​గా ఉధమల్- 'స్టార్స్​' చూసేందుకు డెస్టినేషన్- 22ఏళ్ల యువకుడి ఆలోచనకు ఫలితం!