యాపిల్ పే భారత్కు వస్తోందా?- బ్యాంకులతో చర్చలు జరుపుతున్న కంపెనీ: రిపోర్ట్
భారతదేశంలో "యాపిల్ పే" సేవలను ప్రారంభించేందుకు యాపిల్ ఇంక్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Published : February 27, 2026 at 11:47 AM IST
Hyderabad: యాపిల్ ఇంక్ తన డిజిటల్ పేమెంట్ సర్వీస్ "యాపిల్ పే"ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ అనేక ప్రధాన ప్రైవేట్ బ్యాంకులతో చర్చలు జరుపుతోందని సమాచారం. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, యాపిల్ భారతదేశంలో తన చెల్లింపు సేవను ప్రారంభించడానికి ICICI బ్యాంక్ లిమిటెడ్, HDFC బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్లతో చర్చలు జరుపుతోంది, కంపెనీ మిడ్-2026 నాటికి భారతదేశంలో తన "యాపిల్ పే"ను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
యాపిల్ భారతదేశంలో తన పేమెంట్ సర్వీస్ లాంఛ్ టైమ్లైన్ను ఇంకా నిర్ణయించనప్పటికీ, బ్యాంకులతో చర్చల నేపథ్యంలో త్వరలోనే భారతీయ వినియోగదారులకు "యాపిల్ పే" సేవ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ ప్రణాళిక కోసం యాపిల్ గ్లోబల్ పేమెంట్ నెట్వర్క్ కంపెనీలు మాస్టర్ కార్డ్ ఇంక్. (Mastercard Inc.), వీసా ఇంక్. (Visa Inc.)లతో కూడా చర్చలు జరుపుతోందని సమాచారం.
అయితే ఈ విషయంపై అధికారికంగా వ్యాఖ్యానించడానికి యాపిల్ నిరాకరించింది. మరోవైపు యాపిల్ చర్చలు జరుపుతున్న బ్యాంకులు ఇంకా దీని గురించి ఏం మాట్లాడలేదు. యాపిల్ పే భారతదేశానికి వస్తే, ఇది భారత ప్రభుత్వ మద్దతు ఉన్న డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అయిన UPIకి కూడా మద్దతు ఇస్తుంది. UPIని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.
UPI ద్వారా వినియోగదారులు తక్షణ డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు చేయవచ్చు. ఇది ప్రస్తుతం భారతదేశ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. (Alphabet Inc.)కు చెందిన పేమెంట్ సర్వీస్ గూగుల్ పే, వాల్మార్ట్ ఇంక్. (Walmart Inc.) నియంత్రణలో ఉన్న ఫోన్పే, అమెజాన్కు చెందిన అమెజాన్ పే, పేటిఎం వంటి కంపెనీలు భారతదేశంలో ఇప్పటికే యాక్టివ్ ఆన్లైన్ పేమెంట్ సేవలను అందిస్తున్నాయి. ఈ పరిస్థితిలో యాపిల్ పే ప్రవేశించిన తర్వాత భారతదేశ ఆన్లైన్ చెల్లింపు మార్కెట్లో పోటీ మరింత పెరుగుతుంది. దీని ప్రభావాలు ఇప్పటికే కనిపించడం ప్రారంభించాయి, యాపిల్ పేమెంట్ సర్వీస్ వస్తోందన్న వార్తల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ షేర్లు కూడా క్షీణించాయి.

