మండలిలో మహాపచారం - చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫొటోతో వైఎస్సార్సీపీ ఆందోళన
శ్రీవారి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకొని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన - చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభకు వచ్చారని మంత్రుల మండిపాటు - చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ ధ్వజం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 3:16 PM IST
|Updated : February 20, 2026 at 3:44 PM IST
YSRCP MLCs Issue in Legislative Council : శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి ఒడిగట్టారు. హిందువులు కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫొటోలను పట్టుకుని చెప్పులు, బూట్లతో ర్యాలీ నిర్వహించి, ప్రదర్శించారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభకు రావటంపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య ఛైర్మన్ సభను వాయిదా వేయగానే వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులను, స్వామి వారిని ఫొటోలను టేబుల్పై పడేసి వెళ్లిపోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది.
శాసనమండలిలోనూ, అసెంబ్లీ బయట వెంకటేశ్వరస్వామి ఫొటోతో వైఎస్సార్సీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని ప్రవర్తించిన తీరును కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. సభలోనే దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామికి సభలో జరిగిన అవమానంపై కూటమి సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీఎల్పీలో మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ప్లకార్డులా దేవుడి ఫొటో వాడి మహాపచారానికి పాల్పడిన తీరును ఎన్డీఎల్పీ తీవ్రంగా ఖండించింది. విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించారు.
దేవుడికి జరిగిన అవమానానికి కోపంతో హెడ్ ఫోన్ విసిరానని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. చెప్పు తీయాలనేంత కోపం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. విషయాన్ని వదిలిపెట్టకూడదన్న సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరాని నేరం అని మండిపడ్డారు. సమావేశం నుంచి పార్టీ జాతీయ పెద్దలకు ఫోన్ చేసి సభలో జరిగిన పరిణామాలను వివరించారు. స్వామి వారికి జరిగిన అపచారాన్ని పార్టీ సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
మహాపచారంపై కఠిన చర్యలు : మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామానాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. హిందు మతాన్ని అవమానించారని ఛైర్మన్కు మంత్రులు తెలిపారు. ఇలాంటి చర్యకు ఛైర్మన్గా ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. వైఎస్సార్సీపీ చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. ఆ సభ్యులను పిలిచి మాట్లాడతానని ఛైర్మన్ తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు.
చట్టసభ సాక్షిగా వైఎస్సార్సీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, శాసన మండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజులు ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని రెచ్చకొట్టేలా వైఎస్సార్సీపీ ప్రవర్తించిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీలు హద్దులు దాటి ప్రవర్తించిన తీరు ఎంతో కలచివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయమనం పాటించే కొద్దీ రెచ్చకొడుతున్నారని, హిందువుల పట్ల వైఎస్సార్సీపీ విధానం ఇదేనా అని నిలదీశారు. వెంకటేశ్వర స్వామి పట్ల తమ పార్టీ విధానం ఇదేనని జగన్ చెప్తున్నారా అని ప్రశ్నించారు.
వెంకటేశ్వరస్వామి పటాలను విసిరేసి : హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పేవరకు విషయాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. సభ వాయిదా పడగానే వెంకటేశ్వరస్వామి పటాలను ప్లకార్డులతో పాటు విసిరేసి వెళ్లారని ఆయన ఆరోపించారు. చెప్పులతో వెంకటేశ్వర స్వామి పటాన్ని జగనే పంపించినట్లుందని విమర్శించారు. భారతజాతికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ డైరెక్షన్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరస్వామిని తీవ్రంగా అవమానించారని దుయ్యబట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని నిర్లక్ష్యంగా విసిరేయటం తేలిగ్గా తీసుకునే విషయం కాదని ధ్వజమెత్తారు.
వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డ కూటమి : దేవదేవుడికి మహాపచారం తలపెట్టారంటూ మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. హిందూ మతానికి జగన్ క్షమాపణలు చెప్పే వరకూ వదిలిపెట్టమని మండిపడ్డారు. మతంపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణిస్తామని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్లో హిందువులపై జరుగుతున్న దాడికి ప్రజలే బుద్ది చెప్తారని మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్సీలు హెచ్చరించారు. జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఈ మేర కార్యక్రమాల నిర్వహణకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.
శాసనమండలికి వెంకటేశ్వరస్వామి ఫొటో తీసుకురావడాన్ని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు సరికాదని విమర్శించారు. విలువైన సభా సమయాన్ని వృధా చేస్తూ వైఎస్సార్సీపీ ప్రతిరోజూ సభను వాయిదా వేస్తుందని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల వ్యవహారశైలితో వరుసగా నాలుగోరోజూ శాసన మండలి దద్దరిల్లడం సహా ప్రజా సమస్యలు ప్రస్తానకు నోచుకోకపోవడంపై పలువురు కూటమి, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు.
లడ్డూ కల్తీ వ్యవహారంపై అట్టుడికిన మండలి - ఇరువురి వాదోపవాదాలతో గందరగోళం
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల హంగామా - పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్

