పాపులర్ అవుతున్న డెడ్జోనింగ్ ట్రెండ్ - వర్క్ ప్రెజర్ను తట్టుకోవడానికే!
విహారయాత్రలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటున్న యువత - పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమేనని వెల్లడి - ఇష్టమైన ఫుడ్, ప్రదేశాలకు వెళ్లేందుకే యూత్ ఆసక్తి - నెట్వర్క్ లేని ప్రాంతాలూ ఎంపిక

Published : June 10, 2026 at 9:00 PM IST
Deadzoning Youth Following New Travel Trend : ఇటీవలి కాలంలో యువత అన్ని రంగాల్లోనూ ఆధునికతను అందిపుచ్చుకుంటూ వృత్తుల్లో రాణిస్తున్నారు. సాంకేతికత ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే తమ బిజీ షెడ్యూల్లో కొంత కాలాన్ని ప్రయాణాలు, విహారయాత్రలకు కూడా కేటాయిస్తున్నారు! ఇలా జాలీగా ఎంజాయ్ చేసే ట్రావెలింగ్లోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్లను సృష్టిస్తున్నారు. అలాంటి ఒక ప్రముఖ ట్రెండ్ 'డెడ్జోనింగ్'. ప్రస్తుతం యువత ఈ ట్రెండ్ ద్వారా విహార యాత్రను పూర్తిగా ఆస్వాదించాలని భావిస్తున్నారు. మరి డెడ్జోనింగ్ ట్రెండ్ అంటే ఏంటి? దీని నుంచి ప్రయోజనాలేంటో పూర్తిగా తెలుసుకుందాం.
డెడ్జోనింగ్ అంటే ఏమిటి? : ఈ ట్రెండ్ పేరు డెడ్జోనింగ్, దీని అర్థం కుటుంబం, స్నేహితులతో సంబంధాలను తెంచుకొని విహరించడం అనుకుంటే పొరపాటే! విహార యాత్రలో పాలొంటున్న సందర్భంలో ఇబ్బంది కలిగించే మొబైల్ ఫోన్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ కాంటాక్ట్స్ను పూర్తిగా దూరం పెట్టడం, మనకు దగ్గరైన వారితో సత్సంబంధాలను కొనసాగించడమని అర్థం. అంటే డిజిటల్ పరికరాలను ఆఫ్ చేసి లేదా సైలెంట్ మోడ్లో ఉంచి, ప్రకృతిని, ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించడం. మొబైల్ ఫోన్లను కేవలం అవసరం మేరకు చాలా పరిమితంగా వినియోగిస్తారు. ప్రస్తుతం ఇది యువతలో బాగా పాపులర్ అవుతోంది.
నచ్చినట్లు జీవించడానికే మొగ్గు : ఈ డెడ్జోన్ ట్రెండ్ వెనుక ప్రధాన కారణం పని ఒత్తిడి. స్మార్ట్ఫోన్లు వచ్చాక ఉద్యోగ, వృత్తుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారాంతపు సెలవులు, వెకేషన్లలో కూడా ఈమెయిల్స్, టీమ్ కాల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు వెంబడిస్తాయి. ఫలితంగా సెలవుల్లోనూ పూర్తి విశ్రాంతి లభించడం లేదు. ఈ ఒత్తిడి నుంచి బయటపడి మనసును రిఫ్రెష్ చేసుకోవడానికే యువత డెడ్జోనింగ్ను ఎంచుకుంటోంది. కెరీర్లో ఎదగాలనే కోరికతో మల్టీ టాస్కింగ్ చేస్తున్నవారికంటే, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి, నచ్చిన ఆహారం తినడం, సంతోషంగా గడపడానికే ఎక్కువ మంది యువకులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది.
రెండు రోజుల టూరైనా పర్లేదు : డెడ్జోనింగ్ ద్వారా డిజిటల్ డిటాక్స్ చేస్తే మనసు తేలికపడుతుంది. శరీరానికి నూతనోత్సాహం, శక్తి వస్తాయి. ఈ ట్రెండ్ ద్వారా పని ఒత్తిడి, బర్నౌట్ సమస్యల నుంచి బయటపడటం సాధ్యపడుతుందని యువత చెబుతోంది. సుదీర్ఘ ట్రిప్లకు వీలు కాకపోయినప్పటికీ ఒకటి, రెండు రోజుల స్థానిక విహార యాత్రల్లోనూ డెడ్జోనింగ్ ట్రెండ్ను ప్రయత్నించవచ్చని యువకులు వివరిస్తున్నారు. మొబైల్, ల్యాప్టాప్లను పక్కకు పెట్టి, కేవలం కెమెరా ఉపయోగించుకొని జ్ఞాపకాలు సేకరించడం ద్వారా భిన్నమైన అనుభూతి కలుగుతుందంటున్నారు. కుటుంబం, స్నేహితులతో మాత్రం అవసరమైన సంప్రదింపులు మాత్రం కొనసాగించాలని చెబుతున్నారు.
నెట్వర్క్ లేని ప్రాంతాలను ఎంపిక చేసుకుంటూ : ఇదివరకు ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు స్నాప్, పోస్ట్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఒక ట్రెండ్గా ఉండేది. క్రమేణా స్క్రీన్ షేర్ చేసుకోవడం కన్నా, అనుభూతిని పూర్తిగా ఆస్వాదించే దిశగా ప్రస్తుత యువత పయనిస్తోంది. డిజటల్ కాంటాక్ట్ కాకుండా తమను తాము నియంత్రించుకోవడానికి నెట్వర్క్ లేని ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు కొందరు యువకులు చెబుతున్నారు. ఈ యాత్రలో ఉన్న సమయంలో స్క్రీన్ను చూడకపోవడం వల్ల శరీరానికి అవసరమైనంత నిద్రపోతున్నామని అంటున్నారు. మరి కొందరు నెట్వర్క్ ఉన్నా మ్యాప్, అత్యవసర కాల్స్ మాట్లాడటానికి మాత్రమే వినియోగించుకుంటున్నామని చెబుతున్నారు. అటు ప్రకృతికి దగ్గరవుతూ ఉరుకుల పరుగుల జీవితానికి విరామం ఇచ్చేందుకు డెడ్జోనింగ్ ట్రెండ్ ఎంతో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.
గోల్కొండ కోటకు సమీపంలోని 'నయా ఖిల్లా'ను చూసొద్దామా? - ప్రత్యేక ఆకర్షణగా 500 ఏళ్ల నాటి మహావృక్షం

