అమెరికాలో బొబ్బిలి యువకుడు మృతి - మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు
విజయనగరం జిల్లాకు చెందిన ఇంజినీర్ అమెరికాలో మృతి - నిన్న సాయంత్రం బొబ్బిలి మం. పిరిడి గ్రామానికి చెందిన సాయిశ్రీ హరికృష్ణ మృతి - నదిలో మునిగి మృతిచెందినట్లు తెలిపిన హరికృష్ణ తండ్రి శ్రీనివాస్

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 12, 2026 at 4:45 PM IST
Young Man Sai Sri Harikrishna Died in America : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందాడు. ఉన్నత చదువుల నిమిత్తం రెండేళ్లు క్రితం సాయి శ్రీ హరికృష్ణ అమెరికాకు వెళ్లాడు. MSC పూరైన తర్వాత అక్కడే రెండు నెలల కిందట ఎలిసెంట్ క్లీన్ టెక్నాలజీలో ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. నిన్న(శనివారం) తన పుట్టినరోజు సందర్భంగా ఓ రిసార్ట్లో వేడుకల తర్వాత నదిలో ఈతకు వెళ్లాడు. కానీ ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందినట్లు హరికృష్ణ తండ్రి తెలిపారు.
కుమారుడి మరణవార్తతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుడు మృతి చెందడంతో ఒక్కసారిగా స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
మృతుడి సాయి శ్రీ హరికృష్ణ తండ్రి శ్రీనివాసరావు ఆటో డ్రైవర్ కాగా, తల్లి రమ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తోంది. తమ కష్టం కుమారుడు పడకూడదని వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుమారుడ్ని ప్రయోజకుడిని చేయాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. అందులో భాగంగా ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. అక్కడ ఎంఎస్సీ పూర్తి చేశాక రెండు నెలల కిందట ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ ఆనందం తీరక ముందే సాయి శ్రీ హరికృష్ణ జీవితం ముగిసింది.
గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు : కుమారుడు అమెరికాలో ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు రమ, శ్రీనివాస్ ఎంతో ఆనందం చెందారు. ఈ విషయాన్ని బంధువులు, స్నేహితులకు తెలిపారు. ఈ క్రమంలో శనివారం సాయి శ్రీ హరికృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. చివరికి శనివారం సాయంత్రం చెరువులో స్నానానికి దిగి మునిగి మృతిచెందాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుమారుడు ప్రయోజకుడు కావడంతో తమ కష్టలు తీరుతాయని భావించిన తల్లిదండ్రులకు ఊహించని పరిణామం ఎదురైంది. సాయి శ్రీ హరికృష్ణ అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు చర్యలు : చిన్న వయసులోనే సాయి శ్రీ హరికృష్ణ అకాల మరణం తనను కలచివేసిందని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన మంత్రితో మాట్లాడారు. అదేవిధంగా ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. సాయి శ్రీ హరికృష్ణ కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన దంపతులు మృతి
మూడు రోజుల క్రితం జలుబు, ఆయాసం - అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి

