రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం - శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానా
క్రికెటర్ శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం - అంతకుముందే సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి

By ETV Bharat Andhra Pradesh Team
Published : November 7, 2025 at 1:07 PM IST
|Updated : November 7, 2025 at 2:02 PM IST
Women Cricketer Sricharani in AP: ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు రాష్ట్రానికి చెందిన శ్రీచరణికి విజయవాడలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రపంచ కప్ విజయం తర్వాత తొలిసారి శ్రీ చరణి రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతించారు. అలాగే శ్రీ చరణికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. విద్యార్థులు, అభిమానులకు అభివాదం చేసిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.
అనంతరం మహిళ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు క్రికెటర్ శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు, నారా లోకేశ్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచకప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు.
గ్రూప్- 1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు : అనంతరం వరల్డ్కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగంతోపాటు రూ. 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది.
"అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు కుటుంబం నుంచి చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో శిక్షణ పొందా. ఇది మొదటి అడుగు మాత్రమే ముందు చాలా ఉంది. మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారు." - శ్రీచరణి, మహిళ జట్టు క్రికెటర్
శ్రీచరణి బాల్యం : వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రమల్లపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిది మధ్య తరగతి కుటుంబం. నాన్న చంద్రశేఖర్రెడ్డి ఆర్టీపీపీ ఉద్యోగి. అమ్మ రేణుక గృహిణి. అక్క వైష్ణవి చరిత ఎంఎస్ పూర్తి చేసి యూఎస్లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీచరణికి ఆటలంటే చాలా ఇష్టం. పాఠశాల స్థాయిలో ఖోఖో, బ్యాడ్మింటన్ ఆడిన ఆమె ఆ తర్వాత క్రికెట్ వైపు దృష్టి సారించింది. నాన్న ఒప్పుకోలేదు. అయినా ఆమె క్రికెట్ ఆడాలని గట్టిగా పట్టుబట్టింది. అమ్మ రేణుక, మామ కిశోర్కుమార్రెడ్డిలతో కలిసి తండ్రిని ఒప్పించింది. తొలుత ప్రొద్దుటూరులో, ఆపై హైదరాబాద్లో శిక్షణ పొందింది.
ఇదీ శ్రీచరణి క్రికెట్ ప్రస్థానం :
2017-18లో జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో క్రికెట్ ప్రస్థానం మొదలైంది.
- 2022లో ఆంధ్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించింది.
- 2024లో ఉమెన్స్ ఐపీఎల్లో దిల్లీ జట్టు కొనుగోలు చేసింది.
- 2025లో భారత జట్టులో చోటు దక్కించుకుంది. ఇదే ఏడాది ఉమెన్స్ వరల్డ్కప్లో తన ఆట తీరుతో జట్టు ఛాంపియన్గా నిలిచేందుకు కృషి చేసింది.
- ప్రాథమిక విద్య ఆర్టీపీపీ అనుబంధ డీఏవీ పాఠశాలలో సాగింది.
- ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివింది.
- ప్రస్తుతం డిగ్రీ వీరపునాయునిపల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో చదువుతోంది.
- భారత జట్టు ప్రపంచ కప్ను ముద్దాడడం, ఆ జట్టులో తమ కుమార్తె ఉండటం చూసి తల్లిదండ్రులు, గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.
- కడప జిల్లాకు చెందిన తొలి మహిళా క్రికెటర్ శ్రీచరణి.
- జట్టు కప్ గెలవగానే కుటుంబ సభ్యులంతా మిఠాయిలు పంచుకుని సంతోషం పంచుకున్నారు. జిల్లా వాసులు కూడా తమ ఇంటి యువతే ఆడి గెలిచినంత ఆనందం వ్యక్తం చేశారు.
'విశ్వ'విజేతల స్ఫూర్తిదాయక ప్రస్థానాలు- మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్ల ఎమోషనల్ స్టోరీలు
మహిళల ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగుతేజం - విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణి

