టీవీ సౌండ్ తగ్గించమన్న భర్త - కత్తితో పొడిచి చంపిన భార్య
మంగళగిరిలో భార్యాభర్తల మధ్య టీవీ సౌండ్ విషయంలో గొడవ - మాటమాట పెరిగి కత్తితో దాడి చేసిన భార్య - కడప జిల్లాలో మద్యం తాగొచ్చి భర్త హింస - భరించలేక భార్య దాడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 6:33 PM IST
Wives Killed Their Husband: కష్టసుఖాల్లో జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని భార్యాభర్తలు పెళ్లినాడు ప్రమాణాలు చేస్తారు. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే కొంతమంది దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయి. అయితే వారు చిన్నపాటి సమస్యను పరిష్కరించుకోకుండా పెద్దదిగా చేసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది మాట్లాడుకుని ఎవరి దారి వారు చుసుకుంటుండగా, మరికొంతమంది మాత్రం దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. దీనికి అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి.
కుటుంబ కలహాలు, వేధింపులు, అనుమానాలు, వివాహేతర సంబంధాల వల్ల రోజురోజుకు హత్యలు పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు ఉంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా భార్యలు భర్తలను చంపడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య కడతేర్చింది. అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను భార్య గొడ్డలితో నరికేసింది.
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు: మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో తన పసుపు కుంకుమను తానే తుడుచుకుంది గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ మహిళ. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను భార్య కత్తితో పొడిచి చంపింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏడాది క్రితం క్రాంతి అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు మంగళగిరిలోని టిడ్కో ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య టీవీ సౌండ్ విషయంలో గొడవ మెుదలైంది. సహనం కోల్పోయిన భార్య క్రాంతి భర్త అహ్మద్ను కత్తితో పొడించింది. అహ్మద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అహ్మద్ను 108లో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు.
షేక్ మహాబీ అనే మహిళ తన కొడుకు చనిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన కొడుకు షేక్ అహ్మద్ ఏడాది క్రితం క్రాంతి అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు మంగళగిరిలోని టిడ్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం భార్య, భర్తల మధ్య టీవీ సౌండ్ విషయంలో గొడవ జరిగింది. సహనం కోల్పోయిన భార్య క్రాంతి భర్త అహ్మద్ను కత్తితో పొడిచింది. అహ్మద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు 108లో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అహ్మద్ చనిపోయాడు. దీనిపై అహ్మద్ తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. -వీరాస్వామి, సీఐ
మద్యం తాగి అనుమానంతో వేధిస్తుండటంతో: భర్తను భార్య గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లయ్యగారిపల్లెలో సిద్ధారెడ్డి, సుహాసిని దంపతులు నివాసం ఉన్నారు. వీరికి ఇద్దరు సంతానం. భర్త రోజు మద్యం తాగి వచ్చి హింసిస్తున్నాడు అలాగే అనుమానంతో వేధింపులకు పాల్పడుతుండటంతో సహనం కోల్పోయిన భార్య సుహాసిని భర్త సిద్ధారెడ్డి (40)ని గొడ్డలితో నరికి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి పరిష్కరించుకుంటే ఆ సంసారం సాఫీగా జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. క్షణిక్షావేశంలో నిర్ణయాలు తీసుకుని హత్యలకు పాల్పడితే జీవితం జైలుపాలు కాక తప్పదంటున్నారు.
విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ - గగనతలంలో సందడి చేసిన హెలికాప్టర్లు, విమానాలు
విశాఖ మీదుగా రైల్లో వెళ్లేవాణ్ని - సాగర నగరం గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఊహించలేదు: సుందర్ పిచాయ్

