ప్రియుడితో కలిసి భర్త హత్య - మృతదేహాన్ని మహారాష్ట్రలో పూడ్చి పెట్టిన భార్య
ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్ను చంపి పూడ్చి పెట్టిన భార్య - భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్లో మహిళ ఫిర్యాదు - భార్య కాల్ రికార్డులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల అరెస్ట్

Published : July 7, 2026 at 6:06 PM IST
|Updated : July 7, 2026 at 7:44 PM IST
Wife Kill Husband in Miyapur : సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు మాయమైపోతున్నాయి. వివాహ బంధానికి విలువివ్వకుండా కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘాతుకం భాగ్యనగరంలో వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు, భర్త అడ్డుగా ఉన్నాడని, అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై ఏమీ తెలియనట్టు డ్రామాలాడుతూ పోలీసులకే సవాల్ విసిరిన ఓ భార్య ఎట్టకేలకు బుక్కయింది.
పక్కా స్కెచ్ వేసిన భార్య : హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. మియాపూర్కు చెందిన పెంటేశ్ (45), సత్యవతి భార్యాభర్తలు. సత్యవతికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమ బంధానికి భర్త పెంటేశ్ అడ్డుగా ఉన్నాడని భావించిన సత్యవతి, ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని స్కెచ్ వేసింది.
భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు : గతేడాది నవంబర్ నెలలో అన్నంలో నిద్ర మాత్రలు కలిపి స్పృహ కోల్పోయాక ప్రియుడితో కలిసి భర్త పెంటేశ్ను అత్యంత దారుణంగా హత్య చేసింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి సుదూరంగా ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి తరలించి, అక్కడ రహస్యంగా కాల్చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు మియాపూర్కు వచ్చేసిన సత్యవతి, గతేడాది నవంబర్లోనే తన భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు కూడా చేసింది.
మహారాష్ట్ర సరిహద్దుల్లో మృతదేహం : సత్యవతి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రాథమిక విచారణలో భార్య ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సత్యవతి మొబైల్ కాల్ రికార్డులను , ఆమె తిరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విచారణలో భార్య సత్యవతి తన ప్రియుడితో నిరంతరం మాట్లాడినట్లు, అలాగే భర్త కనిపించకుండా పోయిన రోజుల్లో వీరిద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమదైన శైలిలో విచారించడంతో సత్యవతి అసలు నిజాన్ని ఒప్పుకుంది. ప్రియుడితో కలిసే భర్తను హత్య చేసి, మహారాష్ట్ర సరిహద్దుల్లో కాల్చి పడేసి వచ్చినట్లు అంగీకరించింది.
ప్రస్తుతం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లోతైన దర్యాప్తు కోసం పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి బయలుదేరారు. దర్యాప్తు కొనసాగుతుందని పెంటేష్ మృతికి కారణమైన వారందరిని పట్టుకునే పనిలో ఉన్నామని మియాపూర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
"మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు. మా అమ్మను నాన్న ముందుగా పెళ్లి చేసుకొన్నారు. అయితే మేము ముగ్గురం పుట్టిన తర్వాత వారి మధ్య మనస్పర్థలతో విడిపోయారు. మా అమ్మ వెళ్లిపోవడంతో మమ్మల్ని చూసుకునేందుకు ఓ పనిమనిషిని పెట్టాలనుకున్నారు. ఆ సమయంలో సత్యవతి మా ఇంటికి వచ్చింది. ఆమె తన కుటుంబంతో సుమారు 7 సంవత్సరాలు ఇంట్లో ఉండేది. చివరికి మా నాన్నని రెచ్చగొట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. మా నాన్న విషయంలో జరిగిన ప్రతిదానికీ కారణం సత్యవతి, ఆమె అన్నదమ్ములు" - భరత్రాజ్, పెంటేశ్ కుమారుడు
ఆస్తిపై కన్నేసే హత్య : ఇది ఇలా ఉండగా మృతుడి పెంటేష్ను కఠినంగా శిక్షించాలని మొదటి భార్య కుమారుడు భరత్ , కుమార్తె లక్ష్మీ , బంధువు శ్రీశైలం కోరుతున్నారు. సత్యవతి తమ ఆస్తిపై కన్నేసి తన తండ్రిని హతమార్చినట్టు ఆరోపిస్తున్నారు.
యూట్యూబ్లో చూసి పక్కాగా హత్య చేశాడు - కానీ పోలీసులకు ఈజీగా దొరికిపోయాడు

