మార్కాపురంలో దారుణం - కుమార్తె సాయంతో భర్తను హతమార్చిన భార్య
మద్యం సేవించి వచ్చి భార్యతో గొడన పడ్డ భర్త- మాటామాటా పెరిగి కత్తి, రాడ్డుతో భర్తపై తీవ్రంగా దాడి చేసిన లక్ష్మీ - హరిని చంపేసి అక్కడ్నుంచి పరారైన భార్య, కూతురు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 4:57 PM IST
Wife Brutally Murdered Her Husband in Markapuram District : క్షణికావేశంలో నిండు ప్రాణాలను బలిగొంటున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. చిన్న విషయాలకే మాటా మాటా పెరిగి రక్త సంబంధాలను మరిచి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక దాంపత్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పటిలా ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోయే తత్వం దంపతుల్లో లోపించిందనే దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలకే కట్టుకున్న భార్యను దారుణంగా చంపడం పరిపాటి అయ్యింది. మహిళలు ఇదే విధంగా తొందరపాటు నిర్ణయాలతో జీవిత భాగస్వామిని చంపేస్తున్న ఘటనలూ లేకపోలేదు. ఇటువంటి దారుణం తాజాగా మార్కాపురం జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
భర్తను చంపేసి అక్కడ్నుంచి పారిపోయి : మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యే, కుమార్తెతో కలిసి భర్తను హతమార్చింది. 53 ఏళ్ల హరి సోమవారం రాత్రి మద్యం సేవించి వచ్చి భార్య లక్ష్మీదేవితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో భార్య లక్ష్మీదేవి కుమార్తె జ్యోత్స్నతో కలిసి హరిపై కత్తి, రాడ్డుతో తీవ్రంగా దాడి చేశారు. భర్తను చంపేసి అక్కడ్నుంచి ఇద్దరూ పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మహిళను హత్య చేసి ఆపై ఆత్మహత్య : ఇదిలా ఉండగా మరోవైపు తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిన మహిళను హత్య చేసిన ఓ వ్యక్తి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొర్లగుంట మారుతీనగర్లో ఈ ఘటన జరిగింది. తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. ఆమె భర్త, కుమారుడితో కలిసి నివాసముంటోంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సమోసా దుకాణంలో పని చేస్తోంది.
మాట్లాడుకుందామని పిలిచి హతమార్చాడు : గ్యాస్ డెలివరీ నిమిత్తం అక్కడికి వెళ్లే సోమశేఖర్తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో చివరిగా మాట్లాడదామని ఆమెను సోమవారం తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత చాకుతో లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లాలో దారుణం- ముగ్గురు పిల్లల్ని చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
భార్యను గొంతు నులిమి చంపిన భర్త - ఆపై మృతదేహంతో పోలీస్ స్టేషన్కు

