ETV Bharat / state

ఫోన్​ పోయిందా? పాతదే కదా అని కంప్లైంట్​ ఇవ్వలేదా? - సైబర్​ క్రైమ్​లో చిక్కుకున్నట్లే!

సెల్​ఫోన్​ పోతే నిర్లక్ష్యం వద్దంటున్న అధికారులు - మనకు తెలియకుండానే సైబర్​ మోసంలో మనమూ ఇరుక్కునే ప్రమాదం ఉందంటూ హెచ్చరిక - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ సూచన

Theft Smart Phone Recovery Telugu
Theft Smart Phone Recovery Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 2:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Theft Smart Phone Recovery Telugu : నేటి ఆధునిక కాలంలో చేతిలో సెల్​ ఫోన్​ లేకుండా ఏ పనీ పూర్తి కావడం లేదు. మనం లేచినప్పటి అలారం మొదలుకొని పడుకునే ముందు జోలపాట వరకు అంతా ఫోన్​​ల పైనే అధారపడి పని చేస్తున్నాం. అలాంటి మొబైల్​ ఫోన్​​ ఒక్కసారిగా దొంగలపాలైతే ప్రాణం పోయినంత పనవుతుంది. చేతిలో సెల్​ఫోన్​ పోయినా, ఎవరైనా దొంగిలించినా పోనీలే అని నిర్లక్ష్యం వహించవద్దు. వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీనికోసం సీఈఐఆర్​ పోర్టల్​లో నమోదు చేయడం ఎంతో ముఖ్యం.

ఇటీవల ఆదిలాబాద్​ జిల్లాలో నలుగురు అంతర్రాష్ట్ర సైబర్​ మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారుగా 1500 పాత మొబైల్​ ఫోన్లను, మదర్​ బోర్డులను, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. పాత స్మార్ట్​ ఫోన్​లను సేకరించి వాటిని బాగుచేసి, అందులోని డాటా ఆధారంగా సైబర్​ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలోని పలు కాలనీల్లో తిరుగుతూ పాత మొబైల్​ ఫోన్​లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో పాటు చోరీ చేసిన మొబైల్ ఫోన్​లు, ఎక్కడైనా దొరికినవి కూడా దీనిలో వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి పాటించకుంటే సైబర్​ మోసంలో ఇరుక్కునే ప్రమాదం : ఈ విధమైన చర్యల కారణంగా మనకు తెలియకుండానే సైబర్​ మోసంలో మనమూ ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది. లేనిపోని చిక్కులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాతవనో, పాడైపోయాయనో మొబైల్​ ఫోన్​లను విక్రయించరాదు. దానిలోని డాటా మొత్తాన్ని తొలగించిన తర్వాతే ఫోన్​ను అమ్మాలి.

అనుమానించాల్సిందే : తక్కువ ధరలో వస్తున్నాయని, సెకండ్​ హ్యాండ్​లో స్మార్ట్​ఫోన్​లను కొనుగోలు చేయొద్దని అధికారులు అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కొంటే కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవి చోరీకి గురైనవా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అంటున్నారు. దీనికోసం సీఈఐఆర్​లో పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు. పాత వస్తువులను కొనుగోలు చేస్తామంటూ వీధిలోకి చాలా మంది వస్తూ ఉంటారని, అయితే చరవాణులను సేకరించే వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని అంటున్నారు. మరీ అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

సీఈఐఆర్​ పనిచేసేదిలా : ముందుగా సీఈఐఆర్​ అధికార వెబ్​సైట్​ను సందర్శించాలి. అధికార వెబ్​సైట్​ www.ceir.gov.in లో లాగిన్​ అవ్వాలి. అనంతరం అపహరణకు గురైన మొబైల్​ ఫోన్​ మోడల్​, కంపెనీ పేరు, ఐఎంఈఐ నంబరు, బిల్లు తదితర వివరాలను నమోదు చేయాలి. సెల్​ఫోన్​ ఎక్కడ, ఏరోజు పోయింది అనే విషయాలతో పాటు ఏ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు అనే వివరాలను వెబ్​సైట్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఓ ఐడీ నంబరును కేటాయిస్తారు. ఫోన్​ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నమోదు చేసిన వివరాల ఆధారంగా మన ఫోన్​ పనిచేయకుండా చేస్తారు. ఒకవేళ మనకు ఫోన్​ దొరికితే మళ్లీ అదే వెబ్​సైట్​లోకి వెళ్లి అన్​బ్లాక్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి. మనకు కేటాయించిన ఐడీని నమోదు చేస్తే మన ఫోన్​ యాథావిధిగా పని చేస్తుంది.

"తక్కువ ధరలో వస్తున్నాయని, సెకండ్​ హ్యాండ్​లో స్మార్ట్​ఫోన్​లను కొనుగోలు చేయొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కొంటే కాస్త అప్రమత్తంగా ఉండాలి. అవి చోరీకి గురైనవా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనికోసం సీఈఐఆర్​లో పరీక్షించుకోవచ్చు. పాత వస్తువులను కొనుగోలు చేస్తామంటూ వీధిలోకి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే చరవాణులను సేకరించే వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. మరీ అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలి." - పోలీసు అధికారులు

సందులో దోచేస్తారు, సూడాన్​లో అమ్మేస్తారు - ఇదీ మొబైల్​ దొంగల తీరు

రద్దీ ప్రాంతాల్లో ఏమరుపాటుగా ఉన్నారా? - మీ సెల్​ఫోన్​ గోవిందా!