ఫ్రూట్స్ను పట్టించుకోవట్లేదా? - వీటిలో ఉండే పోషకాల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలంటున్న వైద్య నిపుణులు - ఆహారంలో భాగంగా పండ్లను చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు - ఆయా పండ్లలో ఉండే పోషకాలు ఏంటి? తదితర వివరాలు మీకోసం

Published : February 23, 2026 at 10:34 AM IST
|Updated : February 26, 2026 at 12:10 PM IST
Benefits Of Fruits In our Life : రోడ్డు పక్కనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తే చాలు వెంటనే అక్కడ ఆగిపోతాం. సాయంత్రమైతే చాలు పానీపూరి బండి వద్ద వాలిపోతాం. అదే ఆ పక్కనే ఓ పండ్ల బండి ఉంటే మాత్రం ఆ తర్వాత చూద్దాంలే అని చల్లగా అక్కడి నుంచి జారుకుంటాం. కానీ ఆ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మీకు తెలుసా? మరి ఏ పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా? ఆ వివరాలు మీకోసం.
యాపిల్ పండులో ఉండే పోషకాలివే :

- యాపిల్ పండులో పీచు, కాపర్, పొటాషియం, కెలోరీలు పుష్కలంగా ఉంటాయి
- శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
- మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
- మెదడు పనితీరును మెరుగు పర్చడంలో సహకరిస్తుంది.
- టైప్-2 మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
- క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఇవీ నారింజపండు ఆరోగ్య ప్రయోజనాలు :

- నారింజ పండులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
- ఈ పండులో క్యాల్షియం, విటమిన్లు, పీచు, పొటాషియం వంటివి ఉంటాయి
- ఈ పళ్లు తినడం వల్ల కంటిచూపు మెరుగ్గా ఉంటుంది
- చర్మం మరింత మృదువుగా మారి, నిగారింపుతో ఉంటుంది.
- వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలు మాన్పించేందుకు ఉపయోగపడుతుంది.
- ఈ పండ్లలో ఉండే పీచు జీర్ణక్రియ సజావుగా సాగేందుకు సాయం చేస్తుంది
- ఎనీమియాను తగ్గిస్తుంది.
- గర్భిణి, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బీ-9 విటమిన్ ఈ పండ్లలో సహజ సిద్ధంగా లభిస్తుంది.
పుచ్చకాయలో ఉండే పోషకాలు ఇవే :

- పుచ్చకాయలో ఏ, సీ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు ఎక్కువగా ఉంటాయి.
- ఈ పండ్లలో 92 శాతం నీరు ఉంటుంది. వీటిని తినడం వల్ల డీహైడ్రేషన్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
- మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచటానికి ఈ పండు దోహదం చేస్తుంది
- శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ఎముకల నొప్పులను నియంత్రిస్తుంది.
- ఇందులో చెడు కొవ్వులు ఉండవు. హృద్రోగ సమస్యలను రానీయదు
- వీటిని తీసుకోవడం చర్మానికి కూడా మంచిది.
- రక్తంలో షుగర్ లెవల్స్ను పెరగనివ్వకుండా చూస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సాయపడుతుంది.

బొప్పాయిలో ఉండే పోషకాలు ఇవే : చాలా మంది బొప్పాయి అంటే చిన్నచూపు చూస్తారు. కానీ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ పదార్థం ఉంటుంది. ఇది ప్రోటీన్లు, జీర్ణ వ్యవస్థలను మెరుగుపర్చడంలో సహకరిస్తుంది. జీర్ణకోశ సమస్యలు తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ పండులోని విటమిన్ ఏ, సీ, పాపైన్, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ను కాంతివంతంగా ఉంచడంలో సహకరిస్తాయి. రేచీకటి లాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ రాకుండా చేయడంలో సాయపడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కర్బుజా : ఈ పండు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్ గడ్డ కట్టిన రక్తాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. బరువు కూడా తగ్గవచ్చు.

వ్యాధి నిరోధక శక్తికి జామ పండు : మన పరిసరాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పండ్లలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డకట్ట వేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండ్లది కీలక పాత్ర. పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. తక్కువ క్యాలరీలూ, అధికంగా పీచు పదార్థం ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి జామ చక్కటి ఆహారం అని చెప్పవచ్చు.

మామిడి పండ్లలో ఆ విటమిన్లు పుష్కలం :
- ఈ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
- మామిడి పండ్లలో ఎ, సి, ఇ, కె, బి6 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
- చర్మం, జుట్టు సంరక్షణలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి
- ఐరెన్ లోపం ఉన్నవారికి ఈ పండ్లు మంచి ఆహారం

రక్తహీనత నుంచి రక్షణ సీతాఫలం
- ఇది ఎక్కువగా పల్లెలు, కొండ ప్రాంతాల్లో లభిస్తుంది
- ఇందులోని కాపర్ జీర్ణశక్తికి అతి ముఖ్యమైనది
- హృద్రోగ వ్యాధులను అడ్డుకుంటుంది
- ఈ పండ్లు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది
- వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
- ఈ ఫలంలో ఉండే పోషకాలు క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి
- బి కాంప్లెక్స్ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది

అరటి పండే కదా అని తీసిపారేయొద్దు
- అరటి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
- వీటిలో పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
- మెగ్నీషియం బీపీని నియంత్రించడంలో సాయపడుతుంది
- పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది
- ఇందులోని పోషకాలు ఆందోళనను తగ్గిస్తాయి. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
"పండ్లను కొంతమంది జ్యూస్గా చేసుకుని తాగుతుంటారు. ఈవిధంగా చేయడం వల్ల వాటిలోని పీచుపదార్థాన్ని కోల్పోతాం. పీచు చక్కెరను రక్తంలో త్వరగా కలవకుండా చూస్తుంది. అందువల్ల పండుగా తీసుకోవడమే మేలు. జ్యూస్ చేశాక 30 నిమిషాల్లో తాగకపోతే అందులోని పోషకాలు నశిస్తాయి"- శ్రీనాథ్, పోషకాహార నిపుణులు

