రైతన్నలకు గుడ్న్యూస్: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల
ఏరువాక పౌర్ణమి తర్వాత కృష్ణా డెల్టాకు నీరు విడుదల - ప్రధాన కాల్వకు 3200 కుసెక్కుల నీళ్లు విడుదల - కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మి శా, గద్దె అనురాధ, ఆళ్ల గోపాలకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 4:33 PM IST
Krishna Delta Water Release : ఏరువాక పౌర్ణమి తర్వాత కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కృష్ణా డెల్టాకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు 3200 కుసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి శా విడుదల చేశారు.
శాస్త్రోక్తంగా పూజలు చేసి కృష్ణమ్మకు సారె సమర్పించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనురుల శాఖ చీఫ్ ఇంజనీర్ రాంబాబు, సాగు నీటి సంఘాల వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఏరువాక పౌర్ణమికి తర్వాత కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ లక్ష్మి శా అన్నారు.
"మేము ఇటీవల ఎరువాక పౌర్ణమి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నాం. ఇప్పుడు కృష్ణా నదీ జలాలను విడుదల చేశాము. ఈ రోజు ప్రజలు - అధికారులతో కలిసి 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు అవసరమైన నీరు కృష్ణా బ్యారేజీ నుంచి ప్రకాశం బ్యారేజీకి ప్రవహిస్తోంది. రైతుల ముఖాల్లో ఆనందం నింపేందుకు మేము ఈ నీటిని విడుదల చేశాం. అలాగే, ప్రతిష్టాత్మకమైన 'జలధార-జలహారతి' కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. కృష్ణా నదీ జలాల సహకారంతో సమృద్ధిగా పంటలు పండుతాయని మేము ఆశిస్తున్నాం"- లక్ష్మి శా,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.
కృష్ణా డెల్టాలో రైతులు పుష్కలంగా పంటలు పండించాలని ఆకాంక్షించారు. 440 కోట్లు రూపాయలతో ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులకు, పంట కాల్వల మరమ్మత్తులు చేసిందని సాగు నీటి సంఘాల వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫెరెన్స్ ఉన్నందు వల్ల జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు పాల్గొనలేదని తెలిపారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని నీటిని సద్వినియోగం చేసుకుని రైతులు పంటలు పండించాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పిలుపునిచ్చారు.
" ఎరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నాం. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించే నిధులు కూడా వారి ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా, రైతులకు తగిన సూచనలు ఇవ్వడం, నీటి వనరుల పరిరక్షణను పర్యవేక్షించడం ద్వారా తన దూరదృష్టిని చాటుకుంటారు. గోదావరి నది అదనపు జలాలను తరలించేందుకు ఆయన చేసిన కృషి ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా మారింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మేము రైతుల సంక్షేమం- వనరుల సమర్థ వినియోగంపై దృష్టి సారించాం. నీటి లభ్యత (ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా) ఆధారంగా ఏ పంటలు వేయాలో నిర్ణయించే చర్యలను అమలు చేశాం. అలాగే ప్రతి కాలువ చివరి భూములకు (టెయిల్-ఎండ్) నీరు చేరేలా రైతులతో కలిసి పనిచేశాం. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, దానిని అంకితభావంతో అమలు చేస్తుంది.-గద్దె అనురాధ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు
నీటి మళ్లింపులు చట్టబద్ధమే - బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు
దిల్లీ కృష్ణా-2 ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు - రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జలయుద్ధాలే

