కొత్త ఆలోచనలకు, అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలి: సీఎం చంద్రబాబు
నవంబర్ 12, 13వ తేదీల్లో సీఐఐ సదస్సు - స్టార్టప్ కంపెనీలకు, ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలన్న సీఎం - జెన్ జీ భాగస్వామ్యం ఉండేలా చూడాలని సూచన

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 9:39 AM IST
Chandrababu Naidu Over CII Summit: విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో ఈ సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సారి ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. కొత్త ఆలోచనలకు అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలన్న ఆయన ఎమ్ఓయూలు, పెట్టుబడులతోపాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.
వివిధ రాష్ట్రాల సీఎంలకు లేఖలు: నవంబర్లో నిర్వహించే 31వ సీఐఐ సదస్సుపై సీఎం చంద్రబాబు సమీక్ష చెయ్యనున్నారు. నేవిగేటింగ్ ఛేంజ్ లీడర్షిప్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ థీమ్తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో భాగంగా ఎమ్ఓయూలు, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలను రెండు రోజుల పాటు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్ను ఆహ్వానించాలని సూచించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలకు లేఖలు రాయాలని సూచించారు.
జెన్ జీ భాగస్వామ్యం: దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని జూలై నుంచి సెప్టెంబర్ వరకు రోడ్ షోలు చేపట్టాలని ఆదేశించారు. విశాఖ, రాజమహేంద్రవరం లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇలా చేస్తే ప్రజలు, యువత, విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. కొత్త ఆలోచనలను ప్రజలకు చేరవేయడం, యువతలోని ఇన్నోవేషన్లను ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి వెళ్లడం అనేది సాధ్యమవుతుందని గుర్తుచేశారు. స్టార్టప్ కంపెనీలకు,ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలన్నారు. జెన్ జీ భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం సూచించారు.
కీలక అంశాల మీద చర్చ: భాగస్వామ్య సదస్సులు అంటే కేవలం పెట్టుబడులు రాబట్టడం, ఎమ్ఓయూలు కుదుర్చుకోవడం అనే భావన పోవాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ కీలక అంశాల మీద చర్చ జరగాలన్నారు. నాలెడ్జ్ షేరింగ్ అనేది ముఖ్యమన్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. వ్యవసాయం, ఉద్యానరంగం, ప్రకృతి వ్యవసాయం, సర్క్యులర్ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్ ఫ్రీ వర్క్ వంటి అంశాలపై చర్చించాలన్నారు. ప్రముఖ వర్శిటీలకు చెందిన నిపుణులను రప్పించాలన్నారు. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.
కిమ్స్ హాస్పిటల్స్ అరుదైన ఘనత - ఏడు ఆసుపత్రుల్లో ఒకే రకమైన సేవలకు గానూ ఏఏసీఐ గుర్తింపు
రాధా గాయత్రి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తాం: హోంమంత్రి అనిత

