175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే - విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నంబర్ వన్
భవనానీపురంలో కూటమి శ్రేణుల సంబరాలు - పశ్చిమ నియోజకవర్గానికి మొదటి ర్యాంకు రావడంపై హర్షం - కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చిన నేతలు - సుజనా చౌదరికి ఉత్తమ ర్యాంకు ప్రకటించడంపై సంతోషం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 10, 2026 at 11:49 AM IST
Vijayawada West Number One Constituency in Government Ranking : రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల పనితీరుపై సర్వే నిర్వహించారు. వాటికి ర్యాంకులు, గ్రేడులు కేటాయించారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సంతృప్తి వంటి అంశాల ఆధారంగా సర్వే చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకింగ్లను ప్రకటించింది. వీటిని మూడు గ్రేడులుగా విభజించింది. ఈ ర్యాంకింగ్లో 21 నియోజకవర్గాలు A+ గ్రేడ్ను దక్కించుకున్నాయి. A గ్రేడ్లో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే B గ్రేడ్లో నిలిచింది.
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం మొదటి స్థానంలో దక్కించుకుంది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 2వ స్థానంలో, కాకినాడ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం 3వ స్థానంలో, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం 4వ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ అసెంబ్లీ విభాగం చివరి స్థానంలో నిలిచింది.
పశ్చిమ నియోజకవర్గానికి మొదటి ర్యాంకు రావడంపై హర్షం: సీఎం చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో 93 శాతం మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గానికి బీజేపీ నేత సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. భవానీపురం శివాలయం సెంటర్లో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చారు. పేద, మధ్యతరగతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి నాయకులు పని చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఉత్తమ ర్యాంకు ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
''ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అందర్నీ కలుపుకుని పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి నడిపించారు. ఆయన తన సేవలను 22 నియోజకవర్గాల్లో వాళ్ల సుజనా మిత్ర ద్వారా గానీ, మా నాయకుల ద్వారా గానీ, ఇతర నాయకులను కలుపుకొని మన రాష్ట్రంలో ఈ నియోజకవర్గం మొదటి స్థానం దక్కించుకోవడం చాలా గర్వంగా ఉంది.'' - నాయకులు
ఇటీవల మంత్రుల పనితీరు ఇంకా మెరుగుపడాలని, వేగం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శాఖలపై పూర్తి పట్టు సాధించి వేగంగా, సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి మరో 5 నెలల్లో ఏడాది పూర్తి అవుతుందన్నారు. శాఖలపై పట్టు పెంచుకునేందుకు సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదటి 6 నెలలు కూడా పెద్దగా ఒత్తిడి చేయలేదని, ఇక వేగం పెంచకపోతే ఊరుకోనని ఆయన మంత్రులను అప్రమత్తం చేశారు. మంత్రులు ఫోకస్డ్గా పని చేయాలిని సూచించారు. ప్రతి శాఖకూ ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ను వర్తింపజేస్తూ, పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలిని సీఎం తెలిపారు.
ప్రతి ఒక్కరూ కష్టపడాలి: లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని సీఎం సూచించారు. 'పీపుల్ ఫస్ట్' విధానంతో తాను, తన కేబినెట్ సహచర మంత్రులు అంతా పని చేస్తున్నామని వివరించారు. ఈ మేరకు లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
పోటీ కోసమే ర్యాంకులు - ఎవరినీ తక్కువ చేయడానికి కాదు: సీఎం చంద్రబాబు
నియోజకవర్గాల్లో సర్వే - 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి: సీఎం చంద్రబాబు

