సంక్రాంతి సీజన్పై వస్త్ర వ్యాపారుల ఆశలు - ఉప్పాడ జాంధానీ మళ్లీ ఊపు అందుకోనుందా!
గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ. 15 కోట్లు కేటాయింపు - సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూస్తున్న వ్యాపారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 8, 2025 at 5:06 PM IST
Uppada Jandhani sarees : ఉప్పాడ జాంధాని చీరల ప్రత్యేకతే వేరు. ఈ చీరలంటే దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. మగువలు జీవితంలో ఒక్కసారైనా ఈ చీర ధరించాలని కోరుకుంటారు. ఈ చీరను ఎలా కట్టుకున్నా డిజైన్ మారకుండా ఉండటం నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం ముచ్చటపడి మరీ ఇక్కడ ఉన్నటువంటి ఉప్పాడ జాంధాని చీరలు కొనుక్కున్నారు.
కరోనా మహమ్మారి రాక మునుపు ఉప్పాడ జాంధానీ పట్టు చీరల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సమృద్ధిగా ఉండేది. కానీ 2020వ సంవత్సరంలో అనుకోకుండా కరోనా రావడంతో చేనేత రంగానికి గడ్డుకాలం ఏర్పడింది. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ రంగాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.
చేనేత రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఫలితంగా అమ్మకాలు లేక వ్యాపారులు, ఉపాధి లేక నేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మకాలు లేక యు.కొత్తపల్లి మండలంలో వందలాది చేనేత వస్త్ర దుకాణాలన్నీ బోసిపోయి దర్శనమిస్తున్నాయి. అయితే రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో అమ్మకాలు పెరిగి లాభాలు వస్తాయని వస్త్ర వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో హస్తకళలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఉప్పాడను ఎంపిక చేసింది.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక: దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పాడలోని నేతన్నలకు అవసరాల రీత్యా మౌలిక వసతులను కల్పించేందుకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మండలాల్లో చేనేత రంగం అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు.
నాలుగేళ్ల క్రితం చేనేత జాంధానీ పట్టు చీరల వ్యాపారం ఏడాదికి సుమారుగా రూ.100 కోట్లు వరకూ లావాదేవీలు జరిగేవి. కరోనా మహమ్మారి, అప్పటి ప్రభుత్వ వైఫల్యం కారణంగా అమ్మకాలు ఒక్కసారిగా 90 శాతం పడిపోయాయి. ప్రస్తుతం ఏడాదికి కేవలం రూ.20 కోట్లు మాత్రమే వ్యాపారాలు సాగుతున్నట్టు మాస్టర్ వీవర్స్ చెబుతున్నారు.
సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూపులు: ముడిసరకు ధరలు అమాంతంగా పెరిగినా చీరల ధరలు పెంచలేక నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది వ్యాపారం మానుకుని దుకాణాలు మూసేశారు. మరి కొంతమంది నష్టాలను భరిస్తూ సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు.
గోదావరి చేనేతకు దక్కిన ప్రపంచ ఖ్యాతి - 'జాంధాని' చీరకు రాష్ట్రపతి ముర్ము ఫిదా!
'ఉప్పాడ జాంధాని' చీరలకు ఊపిరి - ప్రభుత్వ చర్యలతో నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు

