బాణసంచా పేలుడు ఘటన - బాధ్యులైన ఇద్దరు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు
వేట్లపాలెం పేలుడు ఘటనలో ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు - సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న నివేదికల మేరకు చర్యలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 10:06 AM IST
Two Govt officials Suspended in Fire Blast Explosion Case: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టి బాధ్యులుగా ఇద్దరు ఉన్నతాధికారులను గుర్తించి చర్యలు చేపట్టింది.
ఉన్నతాధికారులపై సస్పెన్షన్: పెద్దాపురం ఆర్డీఓ కె. శ్రీ రమణి, రాజమహేంద్రవరం అసిస్టెంట్ కార్మిక కమిషనర్, కాకినాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గా వ్యవహరిస్తున్న బీఎస్. ఎం. వల్లి పై సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న నివేదికల మేరకు తక్షణం సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా చర్యలను పాటించడంలో పెద్దాపురం ఆర్డీవో కె. శ్రీరమణి విఫలమైనట్లు గుర్తించి సస్పెన్షన్ వేటు వేసింది.
నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు: విధి నిర్వహణలో ఆర్డీవో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. కాకినాడ జిల్లాలోని వెట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు కాకినాడ డిప్యూటీ లేబర్ కమిషనర్ బీఎస్ ఎం వల్లీ పై వేటు వేసినట్లు ఆదేశాల్లో తెలిపింది. రికార్డుల్లో కార్మికుల పేర్లను నమోదు చేయడంలో విఫలం, పర్యవేక్షణలో తీవ్ర నిర్లక్ష్యం, వహించినందుకు చర్యలు తీసుకుంది. పనిచేసే కార్మికులకు బీమా పథకం కింద కవర్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని నివేదిక మేరకు చర్యలు తీసుకుంది.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, విఫలమయ్యారని నివేదికల మేరకు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఇద్దరు అధికారులు హెడ్ క్వాటర్ నుంచి బయటకు వెళ్లకూడదని ఆదేశించింది. ఈ విషయంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, కార్మిక శాఖ కార్యదర్శి ఎంవీ. శేషగిరిబాబు వేర్వేరుగా ఉత్తర్వులను జారీ చేశారు.
అసలేం జరిగిందంటే? సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పేరిట కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కొన్నేళ్లుగా బాణసంచా తయారీ సాగుతోంది. రోజూలాగే కార్మికులు టపాసులు తయారీలో నిమగ్నం అయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద మొత్తంలో టపాసులు నిల్వ ఉండడంతో విస్ఫోటం ఆగలేదు. కార్మికులు బయటకు రాలేక కాలిపోయారు. 10 మంది పురుషులు, 10 మంది స్త్రీలు సజీవ దహనం అయ్యారు. కొందరివి కాళ్లుంటే చేతులు లేవు, చేతులుంటే కాళ్లు లేవు. కొన్ని శరీరభాగాలే మిగిలాయి. పెను విస్ఫోటం నుంచి 10 మంది గాయాలతో బయటపడ్డారు.
పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు పంటకాల్వల్లో చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఓ మహిళ పుర్రె పేలిపోయింది. మరొకరు శవమై 50 మీటర్ల దూరంలోని పంట కాల్వలో పడ్డారు. మాంసపుముద్దల్లా మిగిలిన మృతుల శరీర భాగాలు, ఒక్క చోటకు చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. పేలుళ్ల ధాటికి వేట్లపాలెం సమీపంలోని జొన్నలదొడ్డిలో పెంకుటిల్లు పైకప్పు ధ్వంసమైంది. కొన్ని ఇళ్లలో ఫాల్ సీలింగ్ కూడా ఊడిపడ్డాయి. పలు నివాసాల్లో అద్దాలు, తలుపులు పగిలిపోయాయి.
రూ.20 లక్షల చొప్పున పరిహారం : తరువాత కాకినాడ జీజీహెచ్కు బయలుదేరి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. ఆ తర్వాత సీఎం మీడియాతో మాట్లాడుతూ గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రాణాలు తీసిన వ్యాపారి అత్యాశ - బాణసంచా పేలుడు ఘటనలో 22 మంది మృతి

