టీటీడీ కీలక నిర్ణయం - అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్
అలిపిరి కాలిబాట ఏడో మైలు వద్ద ప్రథమ చికిత్స కేంద్రం ప్రారంభం - భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 10:15 PM IST
First Aid Center at Tirumala Alipiri 7th Mile Stairs Route : తిరుమల అలిపిరి మెట్లమార్గంలో 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడికల్ బృందం సేవలందిస్తుందని బీఆర్ నాయుడు తెలిపారు. ఈసీజీ యంత్రం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, నెబ్యులైజర్తో పాటు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్యచౌదరీ తదితరులు పాల్గొన్నారు.
తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు : మరోవైపు పది రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు గోవిందుడి క్షేత్రం ముస్తాబైంది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మంగళవారం నుంచి జనవరి 8వ తేదీన వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్ల చేశారు. తొలి మూడు రోజులు E-డిప్ విధానం మినహాయిస్తే జనవరి 2 నుంచి 8వ తేదీన వరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం భారీ బందోబస్తుతోపాటు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంతోపాటు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల శ్రీవారి దివ్య క్షేత్రం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన టీటీడీ అందుకు అనుగుణంగా తొలిసారిగా తొలిమూడు రోజులు ప్రత్యేక దర్శనాలను అన్నింటినీ రద్దు చేసి ఈ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా రోజులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు రూ.15వేలు, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యి చొప్పున జారీ చేశారు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శన సమయాన్ని కేటాయించారు.
2 కిలోమీటర్ల మేర సర్వదర్శన క్యూలైన్లు : జనవరి 2వ తేదీ నుంచి సర్వదర్శనానికి నేరుగా వీలు కల్పించారు. పెద్దఎత్తున భక్తజనం వచ్చే అవకాశం ఉండటంతో ఔటర్ రింగ్ రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. నారాయణగిరి షెడ్ల నుంచి గోగర్భం జలాశయం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర సర్వదర్శన క్యూలైన్లు ఉండగా గోగర్భం జలాశయం నుంచి ఔటర్ రింగు రోడ్డులోని మరో కిలోమీటర్ మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గోగర్భం జలాశయం క్యూలైన్లోకి సర్వదర్శన భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులు గుంపులుగా రాకుండా పాచికాల్వ గంగమ్మ ఆలయం వద్ద నియంత్రించి అనుమతించేలా ఏర్పాటుచేశారు. ఈ క్యూలైన్లో తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం, అన్నప్రసాదాల వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రముఖుల పర్యటన, భక్తుల రద్దీ దృష్ట్యా 2,389 మందితో పోలీసు భద్రత, 11వందల46 మంది విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం ముందు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా రంగనాథ మండపం నిర్మించారు. దాతల సహకారంతో 40 లక్షల రూపాయలు వెచ్చించి అష్టలక్ష్మి, దశావతారాల ప్రతిమలు వినియోగించారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవత మూర్తుల ప్రతిమలు భక్తులను కనువిందు చేస్తున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పదిరోజుల రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు చాలా వరకు పనులు పూర్తయినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అశేషంగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఔటర్ రింగు రోడ్డులో ఉన్న సర్వదర్శన క్యూలైన్లను అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. తొలి మూడు రోజుల్లో స్వామివారి దర్శనం కోసం ఉదయం వెళ్లే క్యూలైన్లు, సాయంత్రం వెళ్లే క్యూలైన్లను వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు.
పది రోజులూ పవిత్రమైనవే - వారికి రెండు గంటల్లోనే దర్శనం: టీటీడీ ఈవో
వరుస సెలవులు - తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - స్వల్ప తోపులాటలు

