సమష్టి కృషితో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం - ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి: టీటీడీ ఛైర్మన్
7.83లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం - 44లక్షల లడ్డూల విక్రయం - గతేడాదితో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులు అధికంగా దర్శనం - అదనంగా 10 లక్షల లడ్డూల విక్రయాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 6:11 PM IST
TTD Chairman Confirmed More Than 7 Lakh Devotees Had Vaikuntha Dwara Darshanam : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించినట్లు బీఆర్ నాయుడు చెప్పారు.
రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు : రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన ఏర్పాట్లపై 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఈ మేరకు తిరుమలలో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదునపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
పది రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం : 2023లో 6.47 లక్షల మంది, 2024లో 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని బీఆర్ నాయుడు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి లక్ష మంది భక్తులు అధికంగా దర్శనం చేసుకున్నారన్నారు. 10 రోజుల్లో హుండీ ఆదాయం రూ.41 కోట్లు సమకూరిందని, లడ్డూలు విక్రయాలు 44 లక్షలకు చేరుకున్నాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించామని వివరించారు.
గతేడాది కంటే మెరుగ్గా సేవలు - పెరిగిన భక్తుల సంఖ్య : గతేడాది కంటే 27 శాతం అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు అందించగలిగినట్లు పేర్కొన్నారు. 50టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో అలంకరణలు అద్భుతంగా చేశామన్నారు. కల్యాణకట్ట సేవలు, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ప్రణాళిక ప్రకారం క్యూలైన్ల వద్ద మార్పులు చేయడం ద్వారా అంచనా కంటే అధిక సంఖ్యలో భక్తుల వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని బీఆర్ నాయుడు తెలిపారు.
"సమర్థ నిర్వహణతో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేశాం. టీటీడీ, జిల్లా పోలీసు యంత్రాంగం అద్భుతంగా పనిచేసింది. ముందస్తు ప్రణాళికతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంతోనే సత్ఫలితాలను సాధించాం. భక్తులందరూ సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అనుకున్న దానికన్నా ఎక్కువమంది భక్తుల్ని స్వామి దర్శనానికి పంపించగలిగాం." -బీఆర్ నాయుడు, టీటీడీ ఛైర్మన్
గుడ్న్యూస్ - టీటీడీలో పలు పోస్టుల భర్తీకి, ప్రమోషన్లకు పచ్చజెండా
శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్కు విశేష స్పందన : శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్కు భక్తుల నుంచి విశేష ఆదరణ వస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఆఫ్లైన్లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఇవాళ్టి నుంచి ప్రయోగాత్మకంగా ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. కోటా విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 800 టిక్కెట్లు బుకింగ్ చేసుకున్నారు. టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. తిరుపతి ఎయిర్పోర్టులో యథావిధిగా ఆఫ్లైన్ కరెంట్ బుకింగ్ విధానం (రోజుకు 200 శ్రీవాణి టికెట్లు) కొనసాగుతుందని టీటీడీ తెలిపింది.
తిరుమల కొండపై గంటలకొద్దీ నిరీక్షణకు చెక్ -‘కమాండ్’తో దర్శనాల్లో వేగం

