రాష్ట్రంలో 4 దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ - 8-10 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం
8-10 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం - రూ.21,500 కోట్లతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనలు - జీఈసీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం - ప్రాజెక్టుకయ్యే ఖర్చులో రూ.6,450 కోట్లు కేంద్రం గ్రాంటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 27, 2026 at 12:37 PM IST
Transco Decided to complete Green Energy Corridor : రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 'గ్రీన్ ఎనర్జీ కారిడార్' (GEC)ను 4 దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఈ మొత్తం ప్రాజెక్టును 8 నుంచి 10 ఏళ్లలో పూర్తి చేసేలా ఒక ప్రణాళికను రూపొందించింది. ఇందులో ఒక్కో దశ కాలపరిమితి రెండేళ్లుగా ఉంటుంది. సుమారు రూ.21,500 కోట్ల అంచనా వ్యయంతో జీఈసీని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సుమారు 11,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 7,300 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సరఫరా చేయడానికి, ప్రస్తుతం ఉన్న విద్యుత్ ప్రసార నెట్వర్క్ను విస్తరించాల్సిన అవసరం ఉందని ట్రాన్స్కో అంచనా వేసింది.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలిపింది. ఆర్థిక ప్రణాళిక రూపకల్పనలో సహకరించేందుకు గాను, జీఈసీ ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేయనున్నారనే దానిపై వివరణాత్మక సమాచారాన్ని సమర్పించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల ట్రాన్స్కోను కోరింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారు రూ.6,450 కోట్లను (30 శాతం) కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో అందించనుంది.
విద్యుత్ను సరఫరా చేసేలా రూపొందించిన ప్రణాళిక : రాష్ట్ర 'విద్యుత్ ఎగుమతి విధానం' (Power Export Policy) పరిధిలో, సౌర, పవన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల (PSP)కు సంబంధించి మొత్తం సుమారు 80,798 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదాలు మంజూరు చేసింది. వీటిలో, మొత్తం సుమారు 9,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 11,725 మెగావాట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో అత్యధిక భాగం రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు కానున్నాయి.
ఈ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తీరప్రాంత ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించడానికి ఒక పటిష్టమైన విద్యుత్ ప్రసార నెట్వర్క్ అత్యవసరం. రాయలసీమ నుంచి ఉత్తర ఆంధ్రకు అనుసంధానిస్తూ 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యుత్ను జాతీయ గ్రిడ్లోకి అనుసంధానించడానికి వీలుగా కూడా విద్యుత్ ప్రసార నెట్వర్క్ను విస్తరించాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఏటా ఎన్ని ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందో గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా ట్రాన్స్కో ఒక నెట్వర్క్ విస్తరణ ప్రణాళికను రూపొందించింది. రాబోయే 2 దశాబ్దాల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా నెట్వర్క్ను నిర్ధారించేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ సామర్థ్యం ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడానికి సరిపోవడం లేదు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. తత్ఫలితంగా, వారి విద్యుత్ సరఫరా అవసరాలను తీర్చడానికి విద్యుత్ నెట్వర్క్ను విస్తరించడం అత్యవసరం.
ప్రస్తుతం రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు కలిపి మొత్తం 5,000 మెగావాట్ల సామర్థ్యంతో కొనసాగుతున్నాయి. ఈ విద్యుత్ 17 సబ్స్టేషన్ల ద్వారా కేంద్ర గ్రిడ్కు ప్రసారం చేస్తూ తదనంతరం ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. జీఈసీ ప్రాజెక్టులో భాగంగా ఒక్కోటి 400 కేవీ సామర్థ్యం కలిగిన 4 కొత్త సబ్స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సబ్స్టేషన్లలో 2 అనంతపురం జిల్లాలోనూ ఒక్కోటి చొప్పున కడప - పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారు.
ట్రాన్స్కో డీఈకి ‘డిజిటల్ అరెస్ట్’ టార్చర్ - రూ.34.65 లక్షలు దోచుకున్న సైబర్ కేటుగాళ్లు

