'ఈసారి సంక్రాంతి అదిరిపోద్ది' - కారవాన్ టూరిజం స్ఫెషల్ ప్యాకేజీలు!
4 మార్గాల్లో సరికొత్త పర్యాటక వాహనాలు - ప్యాకేజీలు ప్రకటించిన పర్యాటక శాఖ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 8:08 AM IST
Caravan Tourism in Andhra Pradesh: రాష్ట్రంలో పర్యాటక రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతుంది. కారవాన్లో ప్రయాణం చేసేయండి ఈసారి సంక్రాంతి అద్దిరిపోద్ది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకృతి అందాలు, ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఎన్నో పేరుగాంచినవి. ఎన్నో సౌకర్యాలు, సానుకూలతలు ఉన్నా గత ప్రభుత్వం హయాంలో పర్యాటక రంగం దైన్యస్థితిని చవిచూసింది. కూటమి అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కారవాన్ టూరిజం ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది.
తొలుత 4 మార్గాల్లో: పర్యాటకులకు సరికొత్త అనుభూతులు అందించే కారవాన్ వాహనాలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. వీటిని తొలుత 4 మార్గాల్లో నడపనున్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) పోర్టల్ ద్వారా సులభంగా వాహనాలు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం రెండు సంస్థలు ఎంప్యానల్ చేసింది. ప్రస్తుతానికి నాలుగు కారవాన్లు తిప్పనున్నాయి.
సర్కారు ప్రత్యేక విధానం: కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో పర్యాటకుల కోసం పెద్దఎత్తున కారవాన్లను నడుపుతున్నారు. వీటిని ఏపీలోనూ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకు వచ్చింది.
మరో రెండు వాహనాలు: ప్రభుత్వం తీసుకొవచ్చిన విధానాలపై పలు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపాయి. వీటిలో ఓజీ డ్రీమ్ లైనర్స్, ఇండియా లక్సీ కారవాన్ ఎల్ఎల్పీ సంస్థలను ఏపీటీడీసీ ఇప్పటికే ఎంప్యానల్ చేసింది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వాహనాల్లో 10 నుంచి 12 సీట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా మరో రెండు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఈ వాహనాల్లో కేవలం 5 నుంచి 6 సీట్లు ఉండే విధంగా ఈ సంస్థలు రూపొందించాయి. వీటిని పర్యాటకుల కోసం నడపనున్నాయి.
సంక్రాంతికి ప్రత్యేక ప్యాకేజీ: సంక్రాంతి పండుగ అంటేనే ఇంటిల్లిపాదీ సందడిగా జరుపుకుంటారు. ప్రతిసారి సొంతూళ్లకు వెళ్లి ఆత్మీయులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటారు. మరి ఈసారి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా! అయితే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మీ కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చేసింది.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కారవాన్ నడపనున్నారు. ధరలు వచ్చేసి రూ.3.50 లక్షలు. ఈనెల 10, 11, 12 తేదీలకు బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది. ఈ 3 తేదీల్లో హైదరాబాద్ నుంచి 4 కారవాన్లు నడపనున్నారు.
భద్రత దృష్ట్యా: పర్యాటకుల కోరిక మేరకు ఆహారం కోసం మార్గమధ్యలో ఎక్కడైనా హోటళ్ల వద్ద ఆపుతారు. భోజన ఖర్చులు మాత్రం పర్యాటకులవే. రాత్రి పూట పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో వాహనం పార్కింగ్ చేస్తారు. ఈ హోటళ్లు లేని చోట భద్రత దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వాహనాన్ని నిలుపుతారు.
పగలు వివిధ ప్రాంతాలను సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కారవాన్లోనే నిద్రపోయేలా వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. కూర్చొనే సీట్లనే మీరు నిద్రపోయేందుకు వీలుగా సైతం మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ, ఫ్రిజ్, వాష్రూం సదుపాయాలు ఉన్నాయి.
ఆ రూట్లు ఇవే:-
- 1.మార్గం: విశాఖపట్నం-అరకు, లంబసింగి కారవాన్లో (ఒకటిన్నర రోజు)
- ధర: రూ.42,500 (10-12 సీట్ల కారవాన్), రూ.31,500 (5-6 సీట్లు)
- 2.మార్గం: విశాఖపట్నం నుంచి సింహాచలం, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం మీదుగా వాడపల్లి (ఒకటిన్నర రోజు)
- ధర: రూ.42,500 (10-12 సీట్లు), రూ.31,500 (5-6 సీట్లు)
- 3.మార్గం: హైదరాబాద్-గండికోట (రెండు రోజులు)
- ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు)
- 4.మార్గం: హైదరాబాద్-సూర్యలంక (రెండు రోజులు)
- ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు)
కారవాన్లో బీచ్ అందాలను చూడొచ్చు - తక్కువ ఖర్చుతో లగ్జరీ సౌకర్యాలు
ఇక హోటల్ బుకింగ్లు అవసరం లేదు - రాష్ట్రంలో కారవాన్ల సందడి మొదలు!

