తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం - తప్పుడు ధ్రువీకరణలిచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
వైష్ణవి డెయిరీకి అక్రమ అనుమతులు - ఫ్యాక్టరీస్, బాయిలర్ శాఖ అధికారులకు నోటీసులు - నెయ్యి తయారీ సామర్థ్యం లేకున్నా అనుమతులు - సిట్ నివేదికతో అధికారుల మెడకు ఉచ్చు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2026 at 7:57 PM IST
Tirumala Laddu Ghee Scam Action Against Officials: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డెయిరీకి అక్రమంగా అనుమతులు, తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేసి 7 జీవోలు విడుదల చేశారు.
'నెయ్యి తయారీ సామర్థ్యమే లేదు' సిట్ నిర్ధారణ: ఇంతవరకు డెయిరీ నిర్వాహకులు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. సిట్ మోపిన అభియోగాల మేరకు వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్కు అసలు నెయ్యి తయారు చేసే పరికరాలు, సామర్థ్యం లేదని స్పష్టమైంది. అయినా అన్ని అనుమతులు ఉన్నట్లు ధ్రువీకరించిన అప్పటి ఫ్యాక్టరీస్, బాయిలర్, కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
7 అధికారులకు నోటీసులు: అప్పటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావు, పదవీ విరమణ చేసిన సూపర్వైజర్ బి. రమేష్బాబుతో సహా ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐదుగురు అధికారులపై చర్యలకు నోటీసులు జారీ చేశారు. విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ మేడిచర్ల సత్యనారాయణ, ఏలూరు బాయిలర్ ఇన్స్పెక్టర్ ఎంవీఎల్ నరసింహరాజు, నెల్లూరు బాయిలర్స్ ఇన్స్పెక్టర్ టి. సుష్మ, తిరుపతి బాయిలర్ ఇన్స్పెక్టర్ పి. రాంబాబు, నెల్లూరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎన్. శివశంకర్ రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అవినీతికి పాల్పడ్డారని సిట్ అభియోగం: ఈ అధికారులు అవినీతికి పాల్పడ్డారని సిట్ ధ్రువీకరించింది. ఈ మేరకు 470/2024 కేసు కూడా నమోదు చేసింది. సరిగా తనిఖీలు జరపకుండా తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చారని సిట్ నిర్ధారించింది. ఈ అధికారులు తమ వివరణ సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇచ్చారు.
ఫ్రంట్ కంపెనీగా అక్రమ టెండర్లు: అర్హత లేకపోయినా ఫ్రంట్ కంపెనీగా అక్రమ టెండర్లు దక్కించుకుని, నకిలీ పత్రాలు సృష్టించి వైష్ణవి డెయిరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు - వైపీ సుబ్బారెడ్డి పీఏకి భారీగా అక్రమాస్తులు
తిరుమల లడ్డూ కల్తీ కేసులో వేగంగా అడుగులు - యాక్షన్లోకి త్రిసభ్య కమిటీ

