మిర్చి ఎత్తుకెళ్తున్న దొంగలు - ఆందోళనలో రైతులు
అనంతపురం జిల్లా మిరప రైతులను కలవరపెడుతున్న దొంగలు - రాత్రిళ్లు పొలాల్లో పంటను దోచేస్తున్న చోరులు - ఆరబోసిన మిరపను ఎత్తుకెళ్తున్న దొంగలు - పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 1:41 PM IST
|Updated : February 19, 2026 at 2:26 PM IST
Thieves are Troubling Chilli Farmers in Anantapur District : ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు దొంగల భయంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు విద్యుత్తు మోటార్లు, సోలార్ పంపుల చోరీలు వంటి ఘటనలు జరుగుతుండేవి. తాజాగా చోరులు వారి పంథా మార్చుకున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రింబవళ్లు రైతులు పంట పొలాలకు కాపలా ఉండాల్సి పరిస్థితి నెలకొంది.
అనంతపురం జిల్లాలో మిరప దొంగలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఈ ఏడాది ధరలు పెరగడంతో సంతోషంగా ఉన్న రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రాత్రిళ్లు తోటల మీద పడి పంటను దోచేస్తున్నారు. కొన్నిచోట్ల ఆరబోసిన మిరపను బస్తాల్లో నింపుకొని పారిపోతున్నారు. దొంగల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడాల్సి వస్తోంది.
అనంతపురం జిల్లాలో దొంగల బారి నుంచి మిరప పంటను కాపాడుకోవడం రైతులకు సమస్యగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో ఎండు మిరప సాగవుతోంది. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో హెచ్చెల్సీ కాలువ, బోర్ల కింద మిరప సాగు చేస్తున్నారు.
ఆరబోసిన మిరపను ఎత్తుకెళ్తున్న దొంగలు : అత్యంత డిమాండ్ ఉండే బ్యాడిగ రకం మిరపకు గత మూడు ఏళ్లుగా అంతంత మాత్రమే ధరలు ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు 3 ఏళ్లుగా అప్పులపాలయ్యారు. ఈసారి పంట కాలంలో విల్ట్ తెగులు సోకడంతో సగానికిపైగా మిరప పంట ఎండిపోయింది. పంట దిగుబడి తగ్గడంతో మిరప ధర క్వింటా రూ.60 వేలకు చేరింది. దీంతో దొంగలు పొలాలపై పడి మిరపను దోచుకెళ్తున్నారు. దొంగల నుంచి పంటను కాపాడుకోడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
''గత ఎనిమిది సంవత్సరాలుగా మిరప పంట సాగు చేస్తున్నాను. ఎప్పుడూ దొంగల బెడద లేదు. మిర్చి ధరలు పెరిగినా క్రమంలో ఆరబెట్టిన మిరపను దొంగలిస్తున్నారు. కాపలా ఉన్న రైతులను బెదిరించి, రెండు క్వింటాళ్ల మిరపను ఎత్తుకెళ్లారు. పొలాల్లోకి చొరబడి కోతకు సిద్ధంగా ఉన్న పంటను దోచుకుంటున్నారు. మార్కెట్లో మిర్చి ధరలు ధరలు బాగా ఉన్నందున ఆనందంగా ఉంది. కానీ ఎక్కడా చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తుంది. చాలా భయంగా ఉంటుంది. ఈ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా పెట్టాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.'' - మిర్చి పంట రైతులు
పొలాల్లో ఆరబెట్టిన మిరపను దొంగలు దోచుకెళుతున్నారు. విడపనకల్లులో కాపలాగా పడుకున్న రైతును బెదిరించి 2 క్వింటాళ్ల మేర ఎత్తుకెళ్లారు. మరికొన్ని చోట్ల కోతకు సిద్ధమైన పొలంలోకి చొరబడి పంటను కోసుకొని వెళుతున్నారు. మిరప దొంగల బెడద అధికమైందని చాలా మంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో ఇప్పటి వరకు నష్టపోతున్న రైతులకు దొంగల బెడద తోడవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. కుటుంబాలతో సహా పొలాల వద్దే రాత్రింబవళ్లు కాపలాగా ఉంటున్నారు.
చీడపీడల తాకిడిలో మిర్చి పంట - నివారణకు అధికంగా రసాయనాల వాడకం
అధిక రంగు, తక్కువ ఘాటు, కాసింత తీపి కారం! - రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్ మిర్చి

