మందుల కొరతతో రోగుల జేబులకు చిల్లు - ప్రైవేటు షాపుల్లో కొనాల్సిన దుస్థితి
సిక్కోలు జీజీహెచ్లో మందుల కొరత - మందులు లేక అవస్థలు పడుతున్న రోగులు - ప్రైవేటు మందులు కొనాల్సిన దుస్థితి - మందుల కొరతతో పేదల జేబులకు చిల్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 25, 2026 at 8:57 AM IST
Shortage Of Medicines In Government Hospitals In Srikakulam : ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. ఉచితంగా మందులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటునప్పటికీ సరఫరాలో లోపాల కారణంగా రోగులు ప్రైవేటు మందులు కొనాల్సి వస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. సిక్కోలు G.G.H.(Government General Hospital)లో మందుల కొరతపై ప్రత్యేక కథనం
603 రకాల మందులే సరఫరాకు అందుబాటు : శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మందుల కొరత సమస్య మరోసారి బహిర్గతమైంది. ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నా సరఫరా లోపాలు, కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా రోగులు ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్లక తప్పడం లేదు. దీంతో పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. మందుల సరఫరాలో కింది స్థాయి సిబ్బంది చొరవ లేక కొరతకు దారితీస్తోంది. దీంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. APMSIDC (Andhra Pradesh Medical Services and Infrastructure Development Corporation) 660 రకాల మందులు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నా ప్రస్తుతం 603 రకాలే అందిస్తున్నట్లు సమాచారం.
అత్యవసర విభాగంలో మందులు కొరత : సిక్కోలు G.G.H.కి ఔషధ విభాగం 400 రకాల మందులకు ఇండెంట్ పెడుతుండగా కేవలం 355 రకాలే సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా అందుతున్నాయి. సర్జికల్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అత్యవసర విభాగం, చిన్నారులు, మానసిక, చర్మ సంబంధిత మందులు కొరత తీవ్రంగా ఉందని రోగులు అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు వెచ్చించి ప్రైవేటు మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నామని రోగులు చెబుతున్నారు.
యాజమాన్య నిధులతో మందుల కొనుగోలు : సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాని మందులు, పరికరాలను ఆసుపత్రి యాజమాన్య నిధులతో కొనుగోలు చేస్తున్నట్లు G.G.H సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
"ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల సరఫరా తీవ్రంగా తగ్గిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా కొత్త ఆర్థిక త్రైమాసికంలోకి అడుగుపెట్టడం వల్ల APMSIDC ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే మందుల పరిమాణం తాత్కాలికంగా తగ్గింది. తత్ఫలితంగా CDS ద్వారా జరిగే మొత్తం మందుల సరఫరా సుమారు 10 శాతం మేర క్షీణించింది. అయినప్పటికీ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ను వినియోగించుకుంటూ రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మేము స్థానికంగానే మందులను సేకరిస్తున్నాము. అంతేకాకుండా శస్త్రచికిత్సలకు అవసరమైన మందులను ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే APMSIDC ద్వారా సేకరిస్తున్నాము. ఆర్థిక సంవత్సరం మారడం, ఇతర చిన్నపాటి నిర్వహణపరమైన సమస్యల కారణంగా మందుల సరఫరాలో తాత్కాలిక తగ్గుదల ఏర్పడిందన్నది నిజమే. అయినప్పటికీ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఉపయోగించుకుని మేము చురుకుగా మందులను సేకరిస్తున్నాము. స్థానికంగా సేకరించడానికి వీలులేని మందుల కోసం మేము టెండర్ ప్రక్రియ ద్వారా వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. తద్వారా రోగులకు నిరంతర వైద్య సేవలు అందేలా చూస్తున్నాము" - డాక్టర్ ప్రసన్నకుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్
జాప్యాలను నివారిస్తే తీరనున్న మందుల కొరత : C.D.S నుంచి రాని మందులు P.M.B.J.Y. ద్వారా కొనుగోలు చేయాలి. అక్కడ లేకుంటే 48 గంటల్లో సమాచారం రావాలి. కానీ P.M.B.J.Y నుంచి 20 రోజుల వరకు సమాచారం రాకపోవడంతో, టెండర్ ప్రక్రియ పూర్తికాక రోగులకు మందులు దొరకడం లేదు. సరఫరా లోపాలు, కొనుగోలు ప్రక్రియలో జాప్యాలను నివారిస్తే మందుల కొరత తీరే అవకాశముంది.
బాబు బతకాలంటే ఇంజక్షన్కు రూ.16 కోట్లు కావాలి - సాయం చేయాలంటున్న తల్లిదండ్రులు
గంజాయి వినియోగించినా, రవాణా చేసినా 20 ఏళ్లు జైలు శిక్ష: ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ

