తెలంగాణ నుంచి ఏపీలోకి పెద్దపులి - చింతలపాడులో ఆవుపై దాడి
రేడియో కాలర్ ద్వారా నిఘా పెట్టిన అధికారులు - బుధవారం తెల్లవారు జామున వేలేరుపాడు మండలంలోకి ప్రవేశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 4:53 PM IST
Big Tiger In Velerapadu : గత కొద్ది రోజులుగా తెలంగాణ - ఏపీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలు, గ్రామాల్లో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారే సరికి పెద్దపులి తెలంగాణ నుంచి ఏపీలోని వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలోకి వచ్చింది.
సరిహద్దులు దాటిన పులి : తెలంగాణ అటవీ పరివాహక ప్రాంతంలోని కావిడిగుండ్ల అడవుల నుంచి ఈ పెద్దపులి ప్రయాణం ప్రారంభించింది. ఆహారం, కొత్త ఆవాసం కోసమో ఏమో కానీ, అది మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఏలూరు జిల్లాలోని సిద్దారం అడవిలోకి ప్రవేశించింది. నిశ్శబ్దంగా అడవి మార్గాల గుండా ప్రయాణిస్తూ, బుధవారం తెల్లవారుజామున వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలోకి చేరుకుంది.
చింతలపాడులో దాడి : బుధవారం తెల్లవారుజామున చింతలపాడు సమీపంలో ఒక ఆవుపై ఈ పెద్దపులి దాడి చేసింది. పులి పంజా దెబ్బకు, ఆవు అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఉదయాన్నే ఈ దృశ్యాన్ని చూసిన స్థానిక రైతులు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, అది పెద్దపులి దాడేనని నిర్ధారించారు.
రేడియో కాలర్ ద్వారా పర్యవేక్షణ: అయితే ఈ పులి కదలికలను కనిపెట్టడం అధికారులకు పెద్ద సవాలుగా మారలేదు. ఎందుకంటే ఆ పెద్దపులి మెడకు ముందే రేడియో కాలర్ (Radio Collar) అమర్చి ఉంది. ఈ సాంకేతికత సహాయంతో వైల్డ్లైఫ్ అధికారులు పులి ఎటు వెళ్తోంది, ఎక్కడ ఉంది అనే లైవ్ లొకేషన్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా చింతలపాడులో ఆవును చంపిన తర్వాత, ఆ పులి ప్రస్తుతం యడవల్లి అటవీ ప్రాంతం వైపు ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అటవీ శాఖ హెచ్చరికలు : పులి కదలికలు యడవల్లి అటవీ ప్రాంతం వైపు ఉండటంతో, అధికారులు ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పొలాలకు, అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. పశువుల కాపరులు తమ పశువులను అడవి వైపు తోలుకెళ్లవద్దని సూచించారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని, గ్రామాల్లో గుంపులుగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులిని ట్రాక్ చేస్తూ, అది జనావాసాల్లోకి రాకుండా అడవిలోనే ఉండేలా చూసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ఆరు నెలలుగా మూడు జిల్లాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బెబ్బులి
అభయారణ్యం నుంచి బయటికొచ్చిన బెబ్బులి - పాపికొండలకు తగ్గిన పర్యాటకుల సంఖ్య

