ఆరంభంలోనే నిప్పులు కక్కుతున్న సూర్యుడు - వడదెబ్బ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
మార్చి ఆరంభంలోనే మండిపోతున్న ఎండలు - వరంగల్ జిల్లాలో 36 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత - వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ ఔట్ లుక్లో వెల్లడి

Published : March 4, 2026 at 1:44 PM IST
Temperature Increase in Next 2 Months : ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మొదలయ్యాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏమిటనే ఆందోళన మొదలైెంది. వరంగల్ జిల్లా డోర్నకల్లో ఉష్ణోగ్రత మంగళవారం 36 డిగ్రీలకు చేరుతుంది. గత వారం రోజుల నుంచి ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో పగలు, రాత్రి వేళల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ ఔట్ లుక్లో ప్రకటింది. ఈ నేపథ్యంలో ఈటీవీ-భారత్ ప్రత్యేక కథనం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒక నెల ముందుగానే సూర్యుడు సెగ కక్కుతున్నాడు. ఉదయం 11 దాటాక వీధులు నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. దీంతో ఎండలో బయటకు రావడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ఇక మహబూబాబాద్ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాకు సమీపంలో బొగ్గు గనులున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఉంది. అలాగే దీనికి తోడు డోర్నకల్ నుంచి జనగామ వరకు ఇరువైపులా రైతు పట్టాల సెగ వస్తుంది. ప్రతి ఏడాది రూ. కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ విషయంలో మాత్రం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తుండటంతో పరిసరాల్లో పచ్చదనం తగ్గిపోతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
- గొడుగు, టోపీ, తెల్లని రుమాలు ధరించండి.
- ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే బయట వెళ్లకండి.
- తెల్లని నూలు వస్త్రాలు ధరించడం మంచిది.
- నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి.
- కూల్ డ్రింక్స్, మత్తు పానీయాల జోలికి వెళ్లకూడదు.
- వడదెబ్బ సోకిన వారికి 15 నిమిషాలకు ఒకసారి కోల్డ్ స్పాంజింగ్ చేయాలి. చికిత్స చేయించాలి.
''ఎండకాలంలో అలసత్వం ప్రదర్శించడం తగదు. వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ కూలీలతో పాటు వృద్ధులు, పిల్లలు, వాహనదారులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీకు వడదెబ్బ లక్షణం కనిపిస్తే సమీప సర్కారు ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి.'' - సాధ్విజ, వైద్యాధికారిణి, డోర్నకల్
| ఉమ్మడి వరంగల్ జిల్లా వారీగా ఉష్ణోగ్రతలు | |
| తేదీలు | ఉష్ణోగ్రతలు |
| ఫిబ్రవరి 26 | 33.5 |
| ఫిబ్రవరి 27 | 34.0 |
| ఫిబ్రవరి 28 | 34.2 |
| మార్చి 1 | 34.0 |
| మార్చి 2 | 34.5 |
| మార్చి 3 | 36.0 |
విద్యార్థులు నీరు ఎక్కువగా తాగండి : ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. మార్చి 14 నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో చదువు ఒత్తిడిలో పడి నీరు తాగడం మర్చిపోవద్దు. పుస్తకాల పక్కన నీళ్ల బాటిల్ కూడా ఉంచుకోండి. పళ్ల రసాలు, గ్లూకోజ్, బార్లీ వంటివి తీసుకోవాలి. కాటన్ లేదా తేలికపాటి రంగు దుస్తులు ధరించాలి. వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎండలో ఎక్కువగా ఉండేవారు తరచూ నీటిని తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ, టెంకాయ నీళ్లు తీసుకోవాలి. శరీరానికి తగిన నీరు లేకపోతే పెదాలు, నాలుక ఎండుతాయి. ఇలా అవుతే హెచ్చరికగా భావించాలి.
వేసవిలో వ్యాధుల ముప్పు : ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం పొడిబారడం, చెమటలు పట్టకపోవడం, ఎర్రగా మారడం, దురదలు, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వైద్యులను సంప్రదించాలి. మరి కొందరికి బీపీ, షుగర్ పెరగడంతో పాటు, గుండె జబ్బులు, పక్షవాతం, కడుపునొప్పి, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యలు, చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఈ వేసవిలో భానుడి భగభగలు - వడగాల్పుల ముప్పు : ఆ 3 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

