ధరణి పోర్టల్లో కోడ్ ఆడిటింగ్ - ఇక అక్రమాలకు చెక్
ధరణి పోర్టల్లో అక్రమాలకు చెక్ పేట్టేలా ప్రభుత్వం చర్యలు - జనగామ, యాదాద్రి జిల్లాల్లో స్టాంపు డ్యూటీ, చలాన్ల డబ్బు దారి మళ్లింపు ఘటనలతో అప్రమత్తం - మళ్లీ జరగకుండా కోడ్ ఆడిటింగ్కు నిర్ణయం

Published : February 21, 2026 at 9:51 AM IST
Telangana Government Action on Dharani Portal : ధరణి పోర్టల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కోడ్ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీ- డాక్కి బాధ్యతలు అప్పగించింది.
విచారణకు ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ : ధరణి పోర్టల్లో లోతైన ఆడిటింగ్ వ్యవస్థ తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. కోడ్ ఆడిటింగ్ ఏర్పాటు చేసేందుకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్-సి-డాక్కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ - టీజీఎస్ఎస్ (TGSS) నేతృత్వంలో సి-డాక్ కోడ్ ఆడిటింగ్ను చేపట్టనున్నారు. భూ భారతి పోర్టల్లో ఇటీవల యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల కేంద్రంగా స్టాంపు డ్యూటీ, చలాన్ల నగదును కొందరు దారి మళ్లించిన విషయయం తెలిసిందే. ఆ విషయంపై విచారణకు ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీ మరిన్ని లోతైన విషయాలు గుర్తించింది. ధరణి పోర్టల్ ఏర్పాటు నాటి నుంచి కొన్ని రక్షణపరమైన లోపాలు లేవంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి ఆ కమిటీ తీసుకొచ్చింది. దీంతో పోర్టల్ను మరింత పకడ్బందీగా తయారు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు.
సరైన రక్షణ వ్యవస్థలు లేవు : పోర్టల్ను మరింత బలోపేతం చేసేలా సాఫ్ట్వేర్ రంగంలో పరిశోధన-అభివృద్ధి-ఆర్అండ్డీలో పట్టున్న కేంద్రప్రభుత్వ సంస్థ సి-డాక్కి బాధ్యతలు బాధ్యతలు అప్పగించారు. సాఫ్ట్వేర్ సమస్యలు, పరిష్కారాలు, డేటా భద్రతపై ఆ సంస్థ సేవలను రెవెన్యూశాఖ తీసుకోనుంది. ధరణి సాఫ్ట్వేర్ రూపొందించిన ప్రైవేట్ సంస్థ గతంలో రక్షణ చర్యలపై దృష్టిసారించలేదని కోడ్ ఆడిటింగ్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదని గుర్తించారు. రహస్యంగా లాగిన్లను తెరిచి ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం వంటి అక్రమాలకు ఇదొక కారణమని రెవెన్యూ శాఖ అభిప్రాయపడుతోంది. 2020 సంవత్సరం అక్టోబరు నుంచి ధరణి అమల్లోకి రాగా అప్పటి నుంచే సరైన రక్షణ వ్యవస్థలు లేవని, 2024 సంవత్సరం చివరలో టెర్రా ఐసిస్ నుంచి ఎన్ఐసీకి భూముల డేటా బదిలీ చేసిన సమయంలో గుర్తించలేకపోయిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
లోపాలు వెలుగు చూసినప్పుడు కమిటీలు : దాదాపు 75 లక్షల మందికిపైగా రైతులు సుమారు 1.60 కోట్ల ఎకరాల భూములు, లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల డేటా నిర్వహణ ఈ పోర్టల్ ద్వారా జరుగుతోంది. రోజుకు సగటున 40 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డేటాలో ఏవైనా లోపాలు సమస్యలు వస్తే వాటిని సమీక్షించేందుకు ప్రభుత్వ పరంగా ఒక నిపుణుల వ్యవస్థ లేదు. డేటా నిర్వహణ చేపడుతుండగా సాంకేతికతపై లోతైన అవగాహన, సమీక్షించే నేర్పున్న నిపుణుల అవసరాన్ని ఇటీవల జనగామ ఘటన నొక్కిచెప్పింది. లోపాలు వెలుగు చూసినప్పుడు కమిటీలు వేసి తేల్చడం కన్నా ఏ వ్యవస్థలు అవసరమో గుర్తించి అప్రమత్తం చేసేలా ఒక వింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భూభారతి స్కామ్ : తక్కువ చెల్లించినా ఎందుకు రిజెక్ట్ అవలేదు? - ఆ రూ.50 కోట్లు ఏమయ్యాయి?
వందకు రూపాయి మాత్రమే కట్టారు - మిగతాదంతా కమీషన్ కింద కొట్టేశారు!

