నెల్లూరుకు టాటా పవర్- సౌర విద్యుత్ తయారీ కేంద్రంగా నాయుడుపేట
రూ.6,675 కోట్లతో ప్రాజెక్టు- 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు - 2028 జనవరి నాటికి ఉత్పత్తి - సౌర విద్యుత్ తయారీ కేంద్రంగా నెల్లూరు నాయుడుపేట

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 10:16 AM IST
Tata Power Renewable Energy to Invest in Nellore : రాష్ట్రంలో ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ ప్రాజెక్టును అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ రూ.6,675 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్లో 200 ఎకరాల్లో (33 శాతం గ్రీన్ ఏరియా బఫర్తో కలిపి) ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల రంగంలో టాటా సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 4,721 మెగావాట్ల సౌర, 1,034 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను, 700కు పైగా నగరాల్లో 3 వేల మెగావాట్ల రూఫ్టాప్ ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ ద్వారా దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులు చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
విస్తరణ కోసం మరో 80 ఎకరాలు : ప్లాంటు నిర్మాణాన్ని 2028 జనవరి నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యమని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం 120 ఎకరాల్లో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించింది. భవిష్యత్తు విస్తరణ కోసం మరో 80 ఎకరాలను వినియోగించుకోనుంది. సంస్థకు కేటాయించే భూములను సెజ్ పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రోజుకు 12.6 మిలియన్ లీటర్ల నీటి వినియోగం : ఇంగోట్, వేఫర్ల తయారీ యూనిట్కు అవసరమైన విద్యుత్ కోసం క్యాప్టివ్ విధానంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూములను నెడ్క్యాప్ ప్రత్యేకంగా కేటాయిస్తుంది. ఈ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు కోసం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా రోజుకు 12.6 మిలియన్ లీటర్ల నీటిని సంస్థ వినియోగించుకుంటుంది.
ప్లాంటు కోసం భూసేకరణ : నెల్లూరు, నాయుడుపేట ప్రాంతం సోలార్ ప్యానళ్లు, ఇతర కాంపొనెంట్ల తయారీ కేంద్రంగా మారనుంది. నెల్లూరులో ఇండోసోల్ సంస్థ 10 గిగావాట్ల ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానళ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాంటు కోసం భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ప్రీమియర్ ఎనర్జీస్ నాయుడుపేట సెజ్లో ఇంటిగ్రేటెడ్ ప్లాంటు (ఇంగోట్, వేఫర్, సోలార్ సెల్స్) ఏర్పాటు చేస్తోంది. వోల్ట్సన్ ల్యాబ్స్ (సెల్, మాడ్యూల్స్) తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. తాజాగా టాటా పవర్ సంస్థ ఇంగోట్, వేఫర్ తయారీ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. దీంతో సౌర విద్యుత్ ప్యానళ్లు, ఇతర కాంపొనెంట్ల తయారీకి ఈ ప్రాంతం అనువైనదిగా అభివృద్ధి చెందనుంది.
వీటి తయారీ టాటా సంస్థదే : సెమీకండక్టర్స్ (కంప్యూటర్ చిప్లు, ట్రాన్సిస్టర్స్), సోలార్ సెల్స్ తయారీకి ఇంగోట్స్ (లార్జ్ మెటల్ బ్లాక్లు), వేఫర్స్ (పలుచని పొరలతో-సిలికాన్) అవసరం ఉంటుంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సౌర విద్యుత్ ఉత్పత్తికి ఇవి బేస్గా పని చేస్తాయి. వైర్లు, షీట్లు, యంత్ర విడిభాగాల తయారీలోనూ ఇంగోట్స్ను వినియోగిస్తారు. ఎలక్ట్రానిక్స్లో క్లిష్టమైన మైక్రోఫ్యాబ్రికేషన్ ప్రక్రియల్లో వేఫర్లు వాడతారు. వాటిని దేశీయంగా టాటా సంస్థ తయారు చేయనుంది.
సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రుణాల మంజూరులో జాప్యం! - నత్తనడకన సాగుతున్న పనులు!
విశాఖలో విజయవంతమైన తేలియాడే సోలార్ ప్లాంట్లు - నీటిపైనే కరెంటు తయారీ!

