బతికుంటే రూ.400 - ఎండితే రూ.800
రుచిలో కొల్లేరు నల్లజాతి ఎండు చేప అమోఘం - ప్రతి ఏటా 90 టన్నుల ఎగుమతులు, తాడేపల్లిగూడెం, విజయవాడ మార్కెట్లకు తరలించి తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 1:59 PM IST
What Are The Health Benefits Of kolleru Fish: కొల్లేరు నల్లజాతి మీనాలకు ఎంత ప్రాచుర్యమో అందరికీ తెలిసిందే. అందులోనూ నల్లజాతి ఎండు చేపలకూ అంతే ప్రత్యేకం కావడం గమనార్హం. ఇక్కడ దొరికేటటువంటి ఎండు చేపలు రుచి మళ్లీ మళ్లీ తినిపించే విధంగా ఉంటుంది. ఈ చేపలు ప్రధానంగా తాడేపల్లిగూడెం, విజయవాడ మార్కెట్లకు తరలించి అక్కడ నుంచి తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.
సుమారు 200 కుటుంబాలకు జీవనాధారం: ఏలూరు జిల్లాలో కొల్లేరు 90 రకాల భిన్న చేపల జాతులకు నిలయం. అనాదిగా ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ సంప్రదాయ వేటతో చేపలను పట్టి మార్కెట్లకు తరలించి జీవనోపాధిని పెద్దఎత్తున పొందుతున్నారు. అయితే కరోనా సమయంలో లభ్యమైన చేపలను మార్కెట్లకు తరలించే అవకాశం లేక వాటిని ఎండబెట్టడం ప్రారంభించారు. అదే ఇప్పుడు కైకలూరు, మండవల్లి మండలాల్లోని పందిరిపల్లెగూడెం, శృంగవరప్పాడు, పెనుమాకలంక వంటి అయిదారు తదితర గ్రామాల్లోని సుమారు 200 కుటుంబాలకు ప్రధానంగా బతుకుదెరువైంది.
కండరాల పెరుగుదలకు, గాయాల నివారణకు : కొల్లేరు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కొరమీను. కొర్రమీనులో కీలకమైన అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాల సమ్మేళనం కండరాల పెరుగుదలకీ, గాయాల నివారణకీ తోడ్పడుతుంది. బతికుండగా ఈ చేప ధర కేజీకి రూ.400 ధర పలికితే ఎండ బెట్టిన తర్వాత చేపలు రూ.800 వరకు అమ్ముతున్నారు. వీటితో పాటు నాటు గొరక, ఇంగిలాయి, బొమ్మిడాయిలు, జల్లలు, వాలుగ వంటి పలు రకాల చిన్న జాతి చేపలకు గిరాకి ఎక్కువగానే ఉంటుంది. వీటిని రూ.కేజీ 150 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు.
వీటితో పాటు కొల్లేరులో దొరికే చిన్న రొయ్యలను ఎండబెట్టి అమ్మకాలను సాగిస్తారు. కొల్లేరులో ఎక్కువగా లభ్యమయ్యేటటువంటి తిలాపి గొరక, చేదు బెత్తులను సైతం ఎండబెట్టి రొయ్యల మేత కంపెనీలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా 30 టన్నుల పెద్ద రకం చేపలు, 60 టన్నుల చిన్న చేప ఎగుమతులు చేస్తూ సుమారు రూ.5 కోట్లు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
సహజసిద్ధ పద్ధతుల ద్వారా: ఇక్కడ లభించే చేపలు నిల్వ ఉండేందుకు మత్స్యకారులు వారి పూర్వీకుల పద్ధతులను పాటించి ఆరబెడతారు. తద్వారా ఎటువంటి హానికర రసాయనాలు వాడకుండా ఉప్పు, పసుపు, దంచిన కారం కలిపి ఎండలో ఆరబెడతారు. సహజసిద్ధంగా ఎండటంతో వాటి రుచి పెరుగుతుందని అంటున్నారు మాంస ప్రియులు. వీటి ఉత్పత్తి ఈ కాలంలో కొంత తక్కువే అయినా వేసవి మూడు నెలలు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎండా కాలంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లలేని మహిళలకు ఉపాధిగా మారింది.
పోషకాల గని: కొల్లేరులో లభించే ఎండు చేపల్లో ప్రోటీన్లు, ఓమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఏ, డీ, బి12, కే జింక్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, అయోడిన్, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ అల్లాడి శ్రీనివాస్ వెల్లడించారు. ఇవి ఎముకల దృఢత్వం, గుండె పని తీరు, కండరాల నిర్మాణం, మెదడు అభివృద్ధి, చెడు కొవ్వులను తగ్గించేందుకు ఉపయుక్తమవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. మహిళల్లో ముత్రాశయ సంబంధిత వ్యాధులను తగ్గించేందుకు సైతం సహాయపడతాయని తెలిపారు.
వాళ్లకి సైతం మంచి పోషకాహారం : పొట్టకు సంబంధించిన సమస్యలకు ఈ చేప మంచి ఔషధమంటుని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మలబద్ధకం ఉన్న వాళ్లు సైతం తింటే వెంటనే వారికి ఉపశమనం కలుగుతుందనీ, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంటని, వాపుని తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే కీళ్లనొప్పులు, ఆస్తమాతో బాధపడే వాళ్లకీ కూడా మంచి పోషకాహారమని పేర్కొన్నారు. ఈ చేపలు తీసుకునే వారికి నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభించే ప్రయోజనాల్లో ఒకటని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో పేర్కొంది.
కొర్రమీను రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తుందట! - ఎందుకో తెలుసా?
'సేమ్ టు సేమ్' కానీ పులస కాదు - డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

