శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా అలర్ట్ - సుడాన్ ప్రయాణికుడికి లక్షణాలు, గాంధీకి తరలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ - సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడు మహమ్మద్కు ఎబోలా వైరస్ హిస్టరీ - గాంధీ ఆసుపత్రికి తరలింపు

Published : June 4, 2026 at 12:02 PM IST
|Updated : June 4, 2026 at 5:15 PM IST
Ebola Virus History Identified at Shamshabad Airport : తెలంగాణలో ఎబోలా వైరస్ కేసు బయటపడింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు. ఎయిర్పోర్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్లో ఈ ప్రయాణికుడికి గతంలో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా లక్షణాలు ఉండటంతో అధికారులు ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీ పంపించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఎయిర్పోర్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎబోలా వైరస్ కేసులో రోగికి ఎలాంటి లక్షణాలున్నాయి? ప్రస్తుతం అతని పరిస్థితి ఏవిధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గాంధీ ఆస్పత్రి హెచ్వోడీ సునిల్, నోడల్ అధికారి వంశీ వివరించారు.
ప్రశ్న : సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలున్నాయి? అతని పరిస్థితి ఎలా ఉంది?
జవాబు : ఈరోజు ఉదయం 35 సంవత్సరాలున్న సూడన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో థర్మల్ టెంపరేచర్ 100 ఉందని ఆస్పత్రికి తరలించారు. అతనిని ప్రశ్నిస్తే లక్షణాలు గురించి చెప్పడం లేదు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది. కేవలం స్క్రీనింగ్లో టెంపరేచర్ ఆధారంగా అతనిని ఐసోలేషన్లో ఉంచాం. బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకున్నాం. వాటిని హైదరాబాద్ సీసీఎంబీకి పంపించారు. వారు టెస్టు చేస్తారు. ఇంకా అవసరమైతే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) కి కూడా పంపిస్తాం.
ప్రశ్న : పరీక్ష ఇక్కడే నిర్వహిస్తున్నప్పుడు ఎన్ఐవీకి పంపడం అవసరమా? టెస్టు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది?
జవాబు : రెండు లేబొరేటరీలకు పంపడంతో సరిచూసుకునేందుకు దోహదపడుతుంది. ఫలితాలు సుమారు రెండు మూడు రోజుల్లో రావచ్చు.
ప్రశ్న : టీమ్ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతోంది? ప్రత్యేక బృందాలను వినియోగిస్తున్నారా?
జవాబు : సంబంధిత వ్యక్తిని ఐసోలేషన్లో ఉంచాం. దీనిలో ప్రత్యేక డాక్టర్స్ టీమ్, సిస్టర్స్, ల్యాబ్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేశాం.
ప్రశ్న : రోగికి ఎలాంటి మెడికల్ కేర్ ఉంటుంది?
జవాబు : ప్రభుత్వ నిబంధనల ఆధారంగా అనేక జాగ్రత్తలు తీసుకొని సంబంధిత వ్యక్తి రక్తాన్ని టెస్టింగ్కు పంపించాం. రోగి లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రస్తుతానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని చెబితే దానికి తగిన రీతిలో వైద్యం చేస్తాం.
ప్రశ్న : ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నారు? తనతో మీరు ఎలా మాట్లాడుతున్నారు? వ్యాధిలక్షణాలు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకుంటున్నారు?
జవాబు : సంబంధిత వ్యక్తి భాష మాకు అర్థం కావడం లేదు. అతడు మోకాళ్ల సర్జరీ నిమిత్తం హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తనతో మాట్లాడేందుకు బోర్డ్, మార్కర్, సైన్ లాంగ్వేజ్, గూగుల్ ట్రాన్స్లేట్లను వినియోగించి వివరాలు తెలుసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలకు అతడు సహకరించారు. తనలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనట్టు తెలుస్తోంది. అయినా బ్లడ్, యూరిన్ శాంపిల్స్ను టెస్టింగ్కు పంపించాం.
ప్రశ్న : టెస్టింగ్లో పాజిటివ్ వస్తే రోగికి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి పంపుతారు? వ్యాధి గ్రస్తునికి స్పెషల్ రూమ్ కేటాయిస్తారా?
జవాబు : ప్రస్తుతం పాజిటవ్ అనే విధంగానే ఐసోలేషన్లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిపోర్టు వచ్చినా ఇలానే కొనసాగిస్తాం. 21 రోజులు ఐసోలేషన్లోనే ఉంచుతాం. వ్యాధి లక్షణాల మార్పును ఆధారంగా చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం.
ప్రశ్న : రోగికి తోడుగా వచ్చిన వారిని ఎక్కడ ఉంచారు? ఎలా ఉంచారు?
జవాబు : వారిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటోంది. ఆస్పత్రిలో కేవలం అనుమానిత వ్యక్తినే ట్రీట్ చేస్తున్నాం. ఒకవేళ వేరే వారికి వ్యాధి సంక్రమిస్తే, ఎలా చేయాలనే నిర్ణయాన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది.
ఆఫ్రికాలో ఎబోలా విజృంభన - వైరస్ కారణంగా అప్రమత్తమైన భారత్
వేసవి కాలం వ్యాధులతో ప్రజల ఇబ్బందులు - క్వారంటైన్ చేసి 'మీజిల్స్'కు ట్రీట్మెంట్

