సురక్షిత ప్రయాణానికి 'ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్' - ఆ భయానికి టెక్నాలజీతో చెక్
సరికొత్త వ్యవస్థను రూపొందించిన శ్రీనివాసరెడ్డి - ఎన్టీఆర్ జిల్లా పోలీసులతో కలిసి ప్రాజెక్టు - క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా రైడ్ రిజిస్ట్రేషన్ జీపీఎస్ ద్వారా ట్రాకింగ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 11:58 AM IST
Srinivas Reddy Introduces QR Code Feedback for Passenger Safety: ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది పాత మాట కానీ ఒకే ఒక్క ఐడియా వందల మందికి ప్రయాణాల్లో భరోసా నింపితే అది అసలైన ఆవిష్కరణ. రాత్రి సమయాల్లో ఒక్కరే ఉన్నప్పుడు ఆటో, క్యాబ్లలో ప్రయాణాలంటే కలిగే భయం, అభద్రతా భావమే ఈ ఆలోచనకు బీజం వేసింది. ఆ భయానికి టెక్నాలజీతో చెక్ పెడుతూ పోలీస్ నిఘాను సామాన్యుడి అరచేతిలోకి తెచ్చాడు విజయవాడకు చెందిన విద్యార్థి శ్రీనివాసరెడ్డి. పైథాన్ ప్రోగ్రామింగ్తో రూపొందించిన ఆ 'ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్' సిస్టమ్ ప్రయాణికులకు ఎలా రక్షణ కవచంలా మారుతుందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
విద్యను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయలేదు ఆ విద్యార్థి. తన జ్ఞానానికి సామాజిక బాధ్యత జోడించి ఆవిష్కరణలకు రూపకల్పన చేశాడు. విజయవాడ యనమలకుదురుకు చెందిన శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం తిరుపతి ఎంబీయూలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రాత్రి వేళల్లో భయం కలిగించే ఒంటరి ప్రయాణాలకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీసుల సహకారంతో ఈ ప్రాజెక్టు సిద్ధం చేశాడు. ప్రతి ప్రయాణికుడి వెంట ఒక పోలీస్ నిఘా ఉండేలా 'ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ ' సిస్టమ్ను తయారు చేశాడు.
'ఈ 'ఆటో క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ ' విధానాన్ని సీపీ రాజశేఖరబాబు ప్రారంభించారు. విజయవాడలో ఉన్న ఆటో డ్రైవర్ల వివరాలు, ఫొటోలు సేకరించి ప్రతీ ఆటోకి స్కానర్ కోడ్ను కేటాయించారు. ప్రయాణికులు ఆటో ఎక్కగానే ఆ కోడ్ స్కాన్ చేస్తే రిజిస్ట్రేషన్ రైడ్, వాహనం నెంబర్ , ఐడీ, రేటింగ్, జెండర్, ఫీడ్ బ్యాక్ కాలమ్స్ ఉంటాయి. ప్రయాణికులు తమ రైడ్ను రిజిస్టర్ వెంటనే పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం వెళ్తుంది. సిబ్బంది వారిని పర్యవేక్షిస్తుంటారు.' -శ్రీనివాసరెడ్డి, విద్యార్థి
కృతిమ మేధస్సుతో ఎనాలసిస్: ప్రయాణికులు తమ రైడ్ రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి గమ్యస్థానానికి చేరే వరకు పోలీసులు ఆ వాహనాన్ని నిరంతరం జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. డ్రైవర్లతో సమస్య ఏర్పడితే పోలీసులకు వెంటనే ఫీడ్బ్యాక్ కాలమ్ ద్వారా సమాచారం ఇస్తే ..రంగంలోకి దిగి బాధితులను కాపాడుతారు. సురక్షిత ప్రయాణం జరిగితే ఆటోకు మంచి రేటింగ్ ఇవ్వొచ్చు. ఎవరైనా ఆటోలో విలువైన వస్తువుల మరచిపోయినపుడు ఆటోకి సంబంధించిన నెంబర్ చెబితే చాలు డ్రైవర్ వివరాలు గుర్తించవచ్చు. గతంలో కూడా ఏపీ ట్రాన్స్కో (AP TRANSCO) అధికారులతో కలిసి ఒక ప్రాజెక్ట్ను తయారు చేశాడీ విద్యార్థి. ట్రాన్స్ఫార్మార్లలో వినియోగించే ఆయిల్ను కృతిమ మేధస్సుతో ఎనాలసిస్ చేసే విధంగా ఏఐ టూల్ని రూపొందించాడు. ప్రస్తుతం అధికారులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
చదువుతున్న సమయంలోనే 2ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పనిచేయటం ఎవరికైనా ప్రత్యేకమే. తన ప్రాజెక్టు యూనివర్శిటీ యాజమాన్యం ,కుటుంబ సభ్యులు ,పోలీసులు మంచి సహకారం అందించారని చెబుతున్నాడు శ్రీనివాసరెడ్డి. భవిష్యత్ లో ఉన్నత విద్యను అభ్యసించి కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యమంటున్నాడు. చదువుకునే వయసులోనే సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ, టెక్నాలజీతో పోలీసు వ్యవస్థకు తోడుగా నిలిచాడు శ్రీనివాసరెడ్డి.
పగలు ప్రజలకు సేవ - రాత్రిళ్లు లక్ష్యం కోసం శ్రమ
రూ.లక్షల ప్యాకేజీల జాబ్స్ వదిలి, గ్రూప్ -1 లో డీఎస్పీ కొలువు సాధించిన చాందిని విజయగాథ

