మల్లవల్లిలో మట్టి కొరత - చర్యలు తీసుకోవాలంటున్న పారిశ్రామికవేత్తలు
మల్లవల్లి పారిశ్రామికవాడలో మట్టి కొరత - వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున వనరుల దోపిడీ, పక్క జిల్లాల నుంచి మట్టి రవాణాతో ఖర్చులు భారీగా పెరిగాయని వాపోతున్న పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 8:28 AM IST
Soil shortage problem in Mallavalli Industrial Park At Krishna District: గత వైఎస్సార్సీపీ హయంలో చీకటిలో ఉన్న మల్లవల్లి పారిశ్రామికవాడ ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటుంది. పారిశ్రామికవాడలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మల్లవల్లిలో మట్టి కొరత పారిశ్రామికవేత్తలను ఆందోళనకు గురి చేస్తుంది. పరిశ్రమల నిర్మాణానికి మట్టి లభ్యత లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్దిని గాడిలో పెడుతోంది. 2014 -2019 మధ్యలో టీడీపీ హయంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో టీడీపీ హయాంలో పారిశ్రామికవాడ నిర్మాణాన్ని చేపట్టింది. మల్లవల్లిలో పారిశ్రామికవాడ కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,467 ఎకరాల భూమిని ఏపీఐఐసి అధికారులు సేకరించారు. పరిశ్రమల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం ఎకరా భూమిని 16.50 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించింది.
మల్లవల్లిలో మట్టి కొరత: టీడీపీ హయంలోనే చాలామంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లిలో పరిశ్రమలను ప్రారంభించారు. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు రాని పారిశ్రామివేత్తలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడి పరిశ్రమలను నెలకొల్పేందుకు అన్ని చర్యలను చేపట్టింది. ప్రస్తుతం మల్లవల్లిలో చిన్నా, పెద్ద తరహా పరిశ్రమలు అన్ని కలుపుకుంటే దాదాపు 50 కి పైనే రన్ అవుతున్నాయి. 2018లో మల్లవల్లిలో భూములు తీసుకుని పరిశ్రమలు స్థాపించలేకపోయినా వారికి కూటమి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది.
అదే విధంగా లాటరీ ద్వారా దాదాపు 350 మందికి ప్లాట్లను కేటాయించింది. దీంతో వారు మల్లవల్లిలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గ్రౌండింగ్కి వచ్చిన వారు పరిశ్రమల నిర్మాణాన్ని వేగంగా చేస్తున్నారు. అయితే గ్రౌండింగ్ కి మట్టి కొరత పారిశ్రామికవేత్తలను వేధిస్తుంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో తాము పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చామని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. పరిశ్రమల గ్రౌండింగ్ కి లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు.
వాపోతున్న పారిశ్రామకవేత్తలు: అంతేకాకుండా గ్రౌండింగ్ చేయాలంటే తమకు మట్టి లభ్యత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఒక ఇంటి నిర్మాణం చేస్తే బేస్మెంట్ వరకు మెరక చేస్తేనే ఆ ఇల్లు పటిష్ఠంగా ఉంటుందని, అలాంటిది పెద్ద పరిశ్రమకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలని వారు అన్నారు. మట్టి లేకపోవడంతో ఇండస్ట్రీ ఎలా నిర్మాణం చేయాలో అర్ధం కావటం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో విపరీతంగా సహజ వనరుల దోపిడి జరింది. దీంతో కూటమి ప్రభుత్వం గన్నవరంలో జరిగిన మైనింగ్ పై విచారణకు ఆదేశించింది. నియోజకవర్గంలో ఎక్కడ మట్టి తవ్వకాలు జరగడం లేదు. పరిశ్రమలకు మట్టి అవసరం ఉన్నా ఏం చేయాలో తెలియడం లేదని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. పక్క జిల్లాల నుంచి మట్టి కొనుగోలు చేద్దాం అంటే ఒక్క లారీ మట్టి 10,000 నుంచి 15,000 వరకు చెబుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి: మల్లవల్లిలో 10 ఎకరాల నుంచి పరిశ్రమల ఉత్పత్తిని బట్టి భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో అన్ని ఎకరాల్లో అంత మట్టి నింపాలి అంటే తమకు ఆర్థిక భారంగా మారుతుందని చెబుతున్నారు. పరిశ్రమ స్థాపనకు ఎంత ఖర్చు అయ్యిందో, ఒక్క మట్టికే అంత ఖర్చు అవుతుందని పారిశ్రామికవేత్తలు తెలిపారు. మట్టి కొరతను ఏపీఐఐసి అధికారుకు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామని పారిశ్రామికవేత్తలు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి పరిశ్రమల నిర్మాణాన్ని మట్టి కొరత లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
"2018లో మల్లవల్లిలో భూములు తీసుకుని పరిశ్రమలు స్థాపించలేకపోయినా వారికి కూటమి ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. లాటరీ ద్వారా దాదాపు 350 మందికి ప్లాట్ లను కేటాయించింది. దీంతో వారు మల్లవల్లిలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గ్రౌండింగ్ కి వచ్చిన వారు పరిశ్రమల నిర్మాణాన్ని వేగంగా చేస్తున్నారు. అయితే గ్రౌండింగ్ కి మట్టి కొరత పారిశ్రామికవేత్తలను వేధిస్తుంది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం"-జి.ఎన్.బి చౌదరి, మల్లవల్లి ఇండస్ట్రీస్
"పరిశ్రమలకు మట్టి అవసరం ఉన్నా అధిక ఖర్చు వల్ల ఏం చేయాలో తెలియడం లేదు. పక్క జిల్లాల నుంచి మట్టి కొనుగోలు చేద్దాం అంటే ఒక్క లారీ మట్టి 10,000 నుంచి 15,000 వరకు చెబుతున్నారు. దీంతో అన్ని ఎకరాల్లో అంత మట్టి నింపాలి అంటే మాకు ఆర్థిక భారంగా మారుతుంది. పరిశ్రమ స్థాపనకు ఎంత ఖర్చు అయ్యిందో, ఒక్క మట్టికే అంత ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీనిపై స్పందించి పరిశ్రమల నిర్మాణాన్ని మట్టి కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం"-పారిశ్రామికవేత్తలు,

