దేశంలోని తొలి 'స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్' ఏలూరులో - ప్రత్యేకలివే!
సెప్టిక్ ట్యాంకుల శుద్ధిలో స్మార్ట్ సాంకేతికత - దేశంలో తొలిసారిగా డీస్లడ్జింగ్ ట్రక్ సిద్ధం - ఏలూరు జిల్లాలో త్వరలో ప్రయోగాత్మకంగా అమలు - దిల్లీలో ట్రయల్ రన్ కూడా విజయవంతం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 5:07 PM IST
Smart Technology in Septic Tank Cleaning : మల మురుగు (సెప్టిక్ స్లడ్జ్) సమస్య పరిష్కారంలో నూతన ఆవిష్కరణకు రాష్ట్రం వేదిక కానుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా 'స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్' అందుబాటులోకి రానుంది. ఇక దీని ప్రత్యేకతలు ఏమిటంటే? సెప్టిక్ ట్యాంకుల్లో ఘన, ద్రవ వ్యర్థాలను కూడా ట్రక్లో వేర్వేరుగా శుద్ధి చేస్తుంది. ఏలూరు జిల్లాలో త్వరలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర సంస్థ, టీపీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ, టైడ్ టెక్నోక్రాట్స్ల భాగస్వామ్యంతో దిల్లీలో స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్ సిద్ధమైంది. దీనికి సంబంధింన ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడం విశేషం.
స్మార్ట్ సాంకేతికత ప్రత్యేకతలు ఇవీ:
- సెప్టిక్ ట్యాంకులోని ఘన, ద్రవ వ్యర్థాలను బయటకు తీస్తారు. వాటిని ట్రక్లోనే శుద్ధి చేస్తారు.
- ఈ ట్రక్లో గంటకు 600 లీటర్ల ద్రవాలను శుద్ధి చేయవచ్చు.
- ఘన, ద్రవ వ్యర్థాలను వేర్వేరుగా శుద్ధి చేయవచ్చు. ప్రతిరోజూ సుమారుగా 2 నుంచి 3 సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయవచ్చు.
- ట్రక్ పై 5 టన్నుల యంత్రం అమర్చారు. వీటి ద్వారా యంత్రంలోని వాక్యూమ్ సెక్షన్ పూర్తి స్థాయిలో ట్యాంకులను శుభ్రం చేసేందుకు పని చేయనుంది.
- ద్రవ వ్యర్థాలను శుద్ధి చేస్తారు. తర్వాత సమీప తోటల్లో అవసరాలకు వదిలేస్తారు.
- శుద్ధి చేసిన తర్వాత ఘన వ్యర్థాలను సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు సైతం వినియోగించనున్నారు.
ప్రతి రెవెన్యూ డివిజన్లోనూ డీస్లడ్జింగ్ ట్రక్: మొదటగా రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలోను కూడా దశల వారీగా డీస్లడ్జింగ్ ట్రక్లు ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛాంధ్ర సంస్థ నిధులతో వీటిని కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 చోట్ల మాత్రమే సెప్టిక్ ట్యాంకుల్లోని ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇకపై అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ముందడుగు పడటం లేదు. ప్లాంట్లతో దుర్వాసన వస్తుంది అని వాటి ఏర్పాటు చేసేందకు ప్రజలు ఎవరూ సహకరించడం లేదు. ట్రక్లు అందుబాటులో ఉంచనున్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో వీటిని వినియోగించుకోవచ్చు.
నీటిని విధిగా శుద్ధి చేశాకే విడిచిపెట్టాలి: ప్రస్తుతం సెప్టిక్ ట్యాంకులు నిండాక వెంటనే ఫ్రైవేట్ ఆపరేటర్లు ఘన, ద్రవ వ్యర్థాలను ట్రక్లో వచ్చి వాటిని తీసుకు వెళుతుంటారు. అయితే వీరు వాటిని శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువులు, కాలువలు, నదులు, సముద్రంలో వదిలేస్తుంటారు. దీని వల్ల నీరు కలుషితం అవుతుంది. అదే విధంగా పర్యావరణం పైనా కూడా ప్రభావం చూపుతోంది. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పలు సందర్భాల్లో రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టిక్ ట్యాంకుల్లో నీటిని విధిగా శుద్ధి చేయాలని ట్రైబ్యునల్ సూచించింది. సెప్టిక్ ట్యాంకులు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే కాలువలు, చెరువులు, నదులు, సముద్రాలలో విడిచి పెట్టాలని ఆదేశాలు సైతం ఇచ్చింది.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అన్నీ బహిరంగ మల విసర్జన రహితమైనవిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. ప్రతి ఇంట్లోనూ వ్యక్తిగత మరుగుదొడ్డు ఉన్నాయి. సెప్టిక్ ట్యాంకుల్లో నీటిని శుద్ధి చేసి, ఆ తర్వతే వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే వారు అమలు చేయడం లేదు. దీంతో స్వచ్ఛాంధ్ర సంస్థ చొరవ తీసుకున్నారు. ప్రముఖ సంస్థల సాంకేతిక (టెక్నాలజీ) సహకారంతో 'స్మార్ట్ డీస్లడ్జింగ్ ట్రక్' తయారీకి సిద్ధం అవుతుంది.
వరిపొట్టు, ఆయిల్పామ్ వ్యర్థాలు, కోకోపిట్ - మట్టి లేకుండానే మొక్కల పెంపకం
మినీ నర్సరీలా మారిన ఇల్లు - 600 రకాల మొక్కలను పెంచుతోన్న విశ్రాంత ఉద్యోగిని

