ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ కిచెన్లు - జగన్ ఆరోపణలపై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు
స్మార్ట్ కిచెన్లపై రాజకీయ విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - వేతనాలపై ఆరోపణలు నిరాధారమన్న మంత్రి లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 2:45 PM IST
Minister Lokesh On Smart Kitchen Helpers Salary : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రత, నాణ్యత, రుచితో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా రాజకీయ కోణంలో విమర్శించడం తగదని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం అందుతుండగా, వేలాది మంది మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని చెప్పారు.
కడపలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం : వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు లోకేశ్ తెలిపారు. ఈ కిచెన్ల పరిధిలో ఇప్పటికే పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
కొత్త కిచెన్లతో మరిన్ని ఉద్యోగాలు : జిల్లాలో మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. వీటి ద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలతో పాటు అదనంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ల విస్తరణతో వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
వేతనాలపై ఆరోపణలు నిరాధారం : స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో పనిచేస్తున్న కుక్-కమ్-హెల్పర్లకు వేతనాలు చెల్లించలేదన్న ఆరోపణలను కూడా లోకేశ్ ఖండించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లకు 2026 ఏప్రిల్ నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో ఆ నెలకు గౌరవ వేతనాల చెల్లింపు ఉండదని స్పష్టం చేశారు. జూన్ నెల ఇంకా పూర్తికాకముందే బకాయిలపై ఆరోపణలు చేయడం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. జగన్ ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం లక్ష్యం : స్మార్ట్ కిచెన్ల ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందించడమేనని మంత్రి వివరించారు. ఆధునిక వంటశాలల ద్వారా ఆహార నాణ్యత మెరుగుపడటం ఉంటుందని చెప్పారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వారి విద్యాభ్యాసంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
జగన్పై లోకేశ్ ప్రశ్నలు : పేద పిల్లలకు మంచి ఆహారం అందించడం, మహిళలకు ఉపాధి కల్పించడం కూడా సహించలేకపోతే ఎలా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ను లోకేశ్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేయకుండా, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని ఆయన అన్నారు.
మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలి: మంత్రి లోకేశ్
టీచర్లే మన లీడర్లు, రేపటి 'ఛేంజ్ మేకర్లు' - సింగపూర్ వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ
'మీరు బాగా చదివితేనే సీఎం నాకు మంచి మార్కులేస్తారు' - విద్యార్థులతో మంత్రి లోకేశ్ చమత్కారం

